Share News

Heavy rains: నేడు 9 జిల్లాలకు భారీ వర్ష సూచన

ABN , First Publish Date - 2023-11-21T07:04:49+05:30 IST

రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. కన్నియాకుమారి(Kanniyakumari)

Heavy rains: నేడు 9 జిల్లాలకు భారీ వర్ష సూచన

- పలుచోట్ల విస్తారంగా

- వాతావరణ శాఖ హెచ్చరిక

అడయార్‌(చెన్నై): రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. కన్నియాకుమారి(Kanniyakumari) సముద్రతీరంపై బాహ్య ఉపరితల ద్రోణి ఏర్పడివుందని, అదేవిధంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని ఈ కారణంగా సోమవారం నుంచి రాష్ట్రంలోని కోస్తాతీర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో, పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో ఒకటీరెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని పేర్కొంది. సోమవారం చెన్నైతో పాటు చెంగల్పటట్టు, విల్లు పురం, కడలూరు, తంజావూరు, తిరువారూర్‌, నాగపట్టినం, మైలాడు దురై, పుదుక్కోట, రామనాథపురం జిల్లాలతో పాటు పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా, చెన్నై, చెంగ ల్పట్టు, కాంచీపురం, విల్లుపురం, కడలూరు(Kanchipuram, Villupuram, Kadaluru), తంజావూరు, తిరువారూర్‌, నాగపట్టినం, మైలాడుదురై, పుదుకోట జిల్లాలతో పాటు పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొంది. ఈనెల 25వ తేదీ వరకు వాతావరణ పరిస్థితులు ఇదే విధంగా ఉంటాయని తెలిపింది. కాగా, గత నెల 20వ తేదీ నుంచి రాష్ట్రంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. అప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెల్సిందే.

ఉధృతంగా తామ్రభరణి...

తిరునెల్వేలి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. రాధాపురంలో గరిష్ఠంగా 6.7 సెంటీమీటర్ల, కలక్కాట్టిలో 6.2 సెం.మీ, మూలైకరైపట్టిలో 5.5 సెం.మీ, పాలయంకోటలో 5.4 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. 143 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన పాపనాశం రిజార్వయర్‌లో నీటి మట్టం 102.75 అడుగుల కు చేరుకుంది. అలాగే, ఈ జిల్లాలో మరో ప్రధాన రిజర్వాయర్‌ అయిన మణిముత్తారులో నీటి మట్టం 70.75 అడుగులకు చేరుకుంది.

ఆదివారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా తామ్రభరణి నదికి వరద ముప్పు ఏర్పడింది. దీంతో ఈ నదికి ఇరువైపులా, లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను జిల్లా యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

పెరుగుతున్న జ్వరపీడితులు

రాష్ట్రంలో వర్షాల కారణంగా జ్వరాల బారినపడే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా జ్వరపీడితులు అధికమవుతు న్నారు. ఈ జ్వరం బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విస్తృతంగా ప్రచా రం చేస్తున్నారు. వేడి నీటిని తాగాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలని ఆరోగ్య సిబ్బంది సూచిస్తున్నారు.

Updated Date - 2023-11-21T07:04:51+05:30 IST