CBSE: తెలుగు విద్యార్థులకు శుభవార్త.. ఇకపై సీబీఎస్‌ఈలో కూడా..!

ABN , First Publish Date - 2023-07-24T12:38:59+05:30 IST

సీబీఎస్‌ఈ సిలబస్‌ పాఠశాలల్లో ఇకపై తెలుగులో కూడా బోధన మొదలుకానుంది. ప్రస్తుతం హిందీ, ఆంగ్ల భాషల్లో బోధన జరుగుతుండగా.. కొత్తగా బోధన మీడియం భాషలుగా తెలుగు సహా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో

CBSE: తెలుగు విద్యార్థులకు శుభవార్త.. ఇకపై సీబీఎస్‌ఈలో కూడా..!

ఇక మాతృభాషలో బోధన

మరో 21 భాషల్లోనూ: బోర్డు నిర్ణయం

న్యూఢిల్లీ, జూలై 23: సీబీఎస్‌ఈ (CBSE) సిలబస్‌ పాఠశాలల్లో ఇకపై తెలుగులో కూడా బోధన మొదలుకానుంది. ప్రస్తుతం హిందీ, ఆంగ్ల భాషల్లో బోధన జరుగుతుండగా.. కొత్తగా బోధన మీడియం భాషలుగా తెలుగు సహా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో గుర్తించిన మరో 21 భాషలను చేరుస్తూ బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రాంతీయ భాషలు, వివిధ మాతృభాషలు బోధనభాషల్లో చేరిన నేపథ్యంలో విద్యార్థులకు భాషాపరమైన వైవిధ్యం, సమగ్రమైన బోధన అనుభవం లభిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఈ సందర్భంగా వివరించారు. ఆంగ్లం, హిందీలతో పాటు ఇతర భాషల్ని కూడా బోధనకు పరిగణించాలని ఇటీవల విడుదల చేసిన ఓ సర్కులర్‌లో సీబీఎస్‌ఈ తమ పాఠశాలలకు సూచించిన సంగతి తెలిసిందే. విద్యావ్యవస్థలో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం కల్పించాలన్న జాతీయ విద్యావిధానం(ఎన్‌ఈపీ) మార్గదర్శకాలను అనుసరించి బోర్డు తాజా నిర్ణయాన్ని తీసుకుందని ప్రధాన్‌ తెలిపారు. ‘‘మాతృభాషలో నేర్చుకుంటే విద్యార్థులకు పాఠాలు త్వరగా అర్థమవుతాయి. 22 భాషల్ని కూడా బోధన మీడియంలో భాగంగా చేయడం వల్ల విద్యార్థులు తమ ప్రాంతీయ భాషల ద్వారా విషయాల్ని అర్థం చేసుకుని, మరింత మెరుగ్గా రాణించగలుగుతారు’’ అని మంత్రి పేర్కొన్నారు. కాగా.. తాజా మార్పుకు అనుగుణంగా ఎన్‌సీఈఆర్‌టీ ఆయా భాషల్లో పాఠ్య పుస్తకాలను తీసుకురానుంది.

Updated Date - 2023-07-24T12:38:59+05:30 IST