Share News

Chandrababu: వలంటీర్లపై మరోసారి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 01 , 2024 | 04:02 PM

వలంటీర్ల(Volunteers) విషయంలో తాము స్పష్టంగా ఉన్నామని.. వారికి ఎలాంటి అన్యాయం జరగదని తెలుగుదేశం (Telugu Desham Party) పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. వలంటీర్లను ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు వాడుతున్న కారణంగా వారిని కేంద్ర ఎన్నికల సంఘం విధులకు దూరం పెట్టిందని తెలిపారు.

 Chandrababu: వలంటీర్లపై మరోసారి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

అమరావతి: వలంటీర్ల(Volunteers) విషయంలో తాము స్పష్టంగా ఉన్నామని.. వారికి ఎలాంటి అన్యాయం జరగదని తెలుగుదేశం (Telugu Desham Party) పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. వలంటీర్లను వైసీపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు వాడుతున్నారనే కారణంతో కేంద్ర ఎన్నికల సంఘం విధులకు దూరం పెట్టిందని తెలిపారు. పెన్షన్లు పంపిణీ చేయొద్దని తాము ఎవరినీ కోరలేదని.. కేంద్ర ఎన్నికల సంఘం కూడా అలా చేయలేదని అన్నారు. ఏపీలో మొత్తం 1.35 లక్షల మంది సచివాలయ సిబ్బంది ఉన్నారని.. వారి ద్వారా ఒక్క రోజులో ఇంటింటికీ పెన్షన్ ఇచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం వారి సేవలను ఎందుకు వినియోగించుకోట్లేదని చంద్రబాబు ప్రశ్నించారు.

ప్రభుత్వ పథకాలకు ఇవ్వాల్సిన డబ్బులు.. సొంత కాంట్రాక్టర్లకు జగన్ ఇచ్చారని మండిపడ్డారు. ఖజానా ఖాళీ చేసి వైసీపీ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వలేకపోయిందన్నారు. ఆ నెపాన్ని తమపై, ఎన్నికల సంఘంపై కుట్రపూరితంగా నెడుతోందని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి మద్దతిచ్చే కొంతమంది వలంటీర్లపై తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో వలంటీర్లు తప్పులు చేస్తే కేసులు పెట్టే అవకాశం ఉందని.. వాళ్లూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జగన్ రాజకీయ క్రీడలో వలంటీర్ల జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

Volunteers: మచిలీపట్నంలో వలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు..


రూ.4000ల పెన్షన్ ఇస్తాం

ఏపీ సార్వత్రిక ఎన్నికలపై తెలుగుదేశం నేతలు, బూత్ లెవల్ కార్యకర్తలతో సోమవారం నాడు చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సూపర్ సిక్స్, ఎన్నికలల్లో అవలంభించాల్సిన వ్యూహాలు ప్రతి వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిన విషయాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు. ఒకవేళ పెన్షన్ ఇవ్వకపోతే ఈ నెల నుంచే రూ. 4000 చొప్పున టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలకు వివరించాాలని చెప్పారు. పెన్షన్ల వ్యవహారాన్ని వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

పెన్షన్ ప్రతి ఒక్కరికీ అందేలాగా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. వలంటరీ వ్యవస్థకు టీడీపీ వ్యతిరేకం కాదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ కేడర్‌కు సూచించారు. ‘ప్రజాగళం’ సభల స్పందన చూస్తుంటే టీడీపీ, మిత్రపక్షాల గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలనే బలమైన భావన, కసి ప్రజల్లో కనిపిస్తోందన్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో సీఎం జగన్‌రెడ్డికి ఆయన ఓటమి తథ్యమైందని గ్రహించారని అన్నారు. అందుకే టీడీపీపై ఫేక్ ప్రచారాలు, కుట్రలకు తెరదీశారని మండిపడ్డారు.

TDP: పెన్షన్ల అంశం.. సీఎస్‌తో టీడీపీ నేతల బృందం భేటీ


ఎన్నికల్లో అక్రమాలకు తెరదీసిన జగన్

పెన్షన్లపై అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు జగన్ నీచ రాజకీయాలకు నిదర్శనంగా ఉన్నాయని దుయ్యబట్టారు. ప్రతి నెల 1వ తేదీన ఇంటి వద్దనే పెన్షన్ అందించే విషయంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని మండిపడ్డారు. వృద్ధులు, వికలాంగులకు మానవీయ కోణంలో పెన్షన్ ఇంటి వద్దనే ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత జగన్ 15 రోజుల్లో రూ.13 వేల కోట్లు కాంట్రాక్టర్లకు దోచి పెట్టారని ఆరోపించారు. తన రాజకీయ లబ్ధి కోసం నడి వేసవిలో వృద్ధులు, వికలాంగులకు పెన్షన్ ఇవ్వకుండా జగన్ వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులతో ఇంటింటికీ పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు.

ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ విషయంలో వైసీపీ ప్రభుత్వ కుట్రలు, వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని టీడీపీ కేడర్‌కు సూచించారు. తన రాజకీయ లబ్ధి కోసం బాబాయి వివేకానందారెడ్డిని జగన్ చంపించారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఓట్ల కోసం ఇలాంటి చాలా కుట్రలకు జగన్ తెరలేపారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక రూ. 4 వేల పెన్షన్ ఇంటింటికీ ఇస్తామని.. రెండు, మూడు నెలలు తీసుకోకపోయినా అన్నీ కలిపి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాలను లబ్ధిదారులకు టీడీపీ కేడర్ వివరించాలని అన్నారు.

జగన్ ప్రభుత్వం గత 15 రోజుల్లో ఎవరెవరికి బిల్లులు ఇచ్చిందో ప్రకటించాలని డిమాండ్ చేశారు. మే 13వ తేదీ తర్వాత ప్రభుత్వ ఖజానాను మాయం చేసి తన కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు జగన్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. పేదలకు ఇచ్చే డబ్బుల విషయంలో మాత్రం జగన్ నాటకాలు అడుతున్నారన్నారు. ఇంటింటికీ పెన్షన్ ఇచ్చేలా ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల సంఘం కూడా ఈ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని చంద్రబాబు కోరారు.

YCP: వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు ఘోర పరాభవం

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 01 , 2024 | 04:33 PM