Share News

కూలిన మట్టిమిద్దెలు

ABN , Publish Date - Sep 04 , 2024 | 11:57 PM

మండలంలోని క్రిష్టిపాడు గ్రామానికి చెందిన మస్కినసాబ్‌గారి పకృద్దీన, దావాజీ గారి దస్తగిరిలకు చెందిన మట్టిమిద్దెలు కూలిపోయాయి.

 కూలిన మట్టిమిద్దెలు
క్రిష్టిపాడులో కూలిన మట్టి మిద్దెను పరిశీలిస్తున్న వీఆర్వో సాంబశివుడు

దొర్నిపాడు, సెప్టెంబరు 4: మండలంలోని క్రిష్టిపాడు గ్రామానికి చెందిన మస్కినసాబ్‌గారి పకృద్దీన, దావాజీ గారి దస్తగిరిలకు చెందిన మట్టిమిద్దెలు కూలిపోయాయి. మంగళవారం రాత్రి ఇంటిలో నిద్రిస్తుండగా గాలి, వర్షంతో మట్టిమిద్దెలు కూలి ప్రమాదం తప్పింది. ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో మట్టి పక్కన కూలడంతో భయభ్రాంతులకు గురయ్యారు. ఇంటిలోని టీవీ, కొన్ని వస్తు సామగ్రి దెబ్బతిన్నాయి. బుధవారం వీఆర్వో సాంబశివుడు, రెవెన్యూ సిబ్బంది పడిపోయిన మట్టిమిద్దెలను పరిశీలించి సంబంధిత అఽధికారులకు నివేదికను అందజేస్తామని అన్నారు.

రుద్రవరం: మండలంలో గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు మంగళవాం అర్ధరాత్రి మూడు మట్టిమిద్దెలు కూలినట్లు తహసీల్దారు మల్లిఖార్జునరావు బుధవారం తెలిపారు. తిప్పారెడ్డిపల్లె గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి మట్టి మిద్దె కూలినట్లు బుధవారం బాధిత వృద్ధురాలు వెంకటమ్మ వాపోయింది. పెద్దకంబలూరు గ్రామంలో గురప్ప, మరో వ్యక్తికి చెందిన రెండు మట్టి మిద్దెలు కూలాయి. సుమారు రూ.80వేలు ఆస్తి నష్టం కలిగినట్లు తహసీల్దారు తెలిపారు. బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్ధికసాయం కింద బియ్యం, కందిపప్పు అందించినట్లు తెలిపారు. సమగ్రంగా విచారించి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు. మట్టిమిద్దెల్లో నిద్రించరాదని ప్రతి గ్రామంలో టాంటాం వేయించాలని గ్రామ వీఆర్వోలను ఆదేశించినట్లు తహసీల్దారు తెలిపారు.

నీట మునిగిన పంటలు

రుద్రవరం, సెప్టెంబరు 4: మండలంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. 19వ గంగ బ్లాక్‌ఛానెల్‌లో వాగు, పంట పొలాల్లో నీరు పొంగి ప్రవహించింది. మందలూరు సమీపంలో వాగు నీరు 19వ బ్లాక్‌ఛానెల్‌లో చేరడంతో గండి పడిందని రైతులు వాపోయారు. 60 ఎకరాల్లో వరి, మినుము పంటలు నీట మునిగాయి. మూడురోజుల వర్షాలకు రైతులు ఆందోళన చెందుతున్నారు. అప్పనపల్లె రహదారిలో వేపచెట్టు కూలడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.

Updated Date - Sep 04 , 2024 | 11:57 PM