Share News

AP News: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వ్యవహారం కీలక అప్‌డేట్

ABN , Publish Date - Sep 05 , 2024 | 08:00 PM

కృష్ణా జిల్లా గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ వాష్ రూమ్‌లో హిడెన్ కెమెరాల ఆరోపణల వ్యవహారంపై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఈ ఘటనపై పోలీసు బృందం దర్యాప్తు వివరాలను ఆయన ప్రకటించారు. కాలేజీలో పోలీసులు దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాలు గుర్తించలేదని వెల్లడించారు.

AP News: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వ్యవహారం కీలక అప్‌డేట్

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ వాష్ రూమ్‌లో హిడెన్ కెమెరాల ఆరోపణల వ్యవహారంపై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఈ ఘటనపై పోలీసు బృందం దర్యాప్తు వివరాలను ఆయన ప్రకటించారు. కాలేజీలో పోలీసులు దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాలు గుర్తించలేదని వెల్లడించారు. ఇందుకోసం ఏపీలో తొలిసారి క్రిమినల్ కేసుల్లో కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఢిల్లీ టీం సేవలు వినియోగించామని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల అనుమానాలను నివృత్తి చేశామని అన్నారు. ఇక ఈ ఘటనపై ముగ్గురు ఐజీలు దర్యాప్తు చేశారని అశోక్ కుమార్ వివరించారు.


సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపారని ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. హాస్టల్ వాష్ రూముల్లో కెమెరాలు ఏర్పాటు చేశారంటూ ఆరోపణలు వచ్చిన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేశామని ప్రస్తావించారు. విద్యార్థులు, స్త్రీ శిశు సంక్షేమ, పోలీసు బృందాల సమక్షంలో ఆరోపణలు వచ్చిన వెంటనే హాస్టల్ వాష్ రూముల్లో తనిఖీలు చేపట్టామని ఆయన వివరించారు. వాష్ రూమ్‌లు, షావర్లలో ఎలాంటి కెమెరాలు గుర్తించలేదని అన్నారు. విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది, ఉద్యోగులు అందరినీ నేరుగా విచారించామని వెల్లడించారు. విచారణలో కెమెరాలు కానీ, ఆరోపిస్తున్న వీడియోలు కానీ ప్రత్యక్షంగా చూసినట్లు ఏ ఒక్కరూ చెప్పలేదని స్పష్టం చేశారు.


కెమెరాల ఏర్పాటు చేసినట్టు, వీడియోలు అంశం ఎవరో చెబితేనే తమకు తెలిసిందని విచారణలో విద్యార్థులు అందరూ చెప్పారని అన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థుల ఫోన్లు, ల్యాప్ ట్యాప్‌లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఏపీలో క్రిమినల్ కేసుల్లో తొలిసారిగా సీఈఆర్‌టీ (CERT) సేవలు వినియోగించామని, వారు అన్ని విధాలుగా దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. తాము స్వాధీనం చేసుకున్న 14 ఫోన్లు, 6 ల్యాప్‌ట్యాబ్‌లు, ఒక ట్యాబ్‌ను సీఈఆర్‌టీ బృంద సభ్యులకు అప్పగించామని చెప్పారు. విద్యార్థులు ,తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు వ్యక్తం చేసిన అనుమానాలను నివృత్తి చేశామని అన్నారు. విద్యార్థులు ఎవరు భయపడనవసరం లేదని, నేరుగా చేసిన దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాలు లభ్యం కాలేదని అశోక్ కుమార్ వివరించారు. ఢిల్లీ సంస్థ సీఈఆర్‌టీ టెక్నికల్ విచారణ జరుగుతోందని, మరో మూడు రోజుల్లో ఆ నివేదిక కూడా వస్తుందని ఆయన తెలిపారు. ఈ ఘటనపై ఎటువంటి ఆధారాలున్నా పోలీసుల దృష్టికి తేవచ్చని ఆయన సూచించారు. కాలేజీ యజమాన్యానికి విద్యార్థుల భద్రతపై పలు సూచనలు చేశామని చెప్పారు.

Updated Date - Sep 05 , 2024 | 08:00 PM