Share News

Jagan : ప్రభుత్వ కౌంటర్‌కు జవాబివ్వడానికి టైమివ్వండి

ABN , Publish Date - Sep 06 , 2024 | 04:43 AM

తన భద్రతకు సంబంధించి ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌ బుధవారం తమకు అందిందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తరఫు న్యాయవాది సి.సుమన్‌ హైకోర్టుకు నివేదించారు.

Jagan : ప్రభుత్వ కౌంటర్‌కు జవాబివ్వడానికి టైమివ్వండి

  • ‘సీఎం హోదా భద్రత’పై హైకోర్టుకు జగన్‌ అభ్యర్థన

  • ఆయన వ్యాజ్యాన్ని కొట్టివేయండి

  • రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్‌.. విచారణ 13వ తేదీకి వాయిదా

అమరావతి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): తన భద్రతకు సంబంధించి ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌ బుధవారం తమకు అందిందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తరఫు న్యాయవాది సి.సుమన్‌ హైకోర్టుకు నివేదించారు. దానిని పరిశీలించి రిప్లయ్‌ వేసేందుకు సమయం ఇవ్వాలని, విచారణను వాయిదా వేయాలని కోరారు. అందుకు అంగీకరించిన న్యాయస్థానం. విచారణను ఈనెల 13కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి గురువారం ఉత్తర్వులు ఇచ్చారు.

ముఖ్యమంత్రి హోదాలో తనకు ఉన్న భద్రతను పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ జగన్‌ పిటిషన్‌ వేయడం, దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ (ఐఎ్‌సడబ్ల్యూ), ఎస్పీ, స్టేట్‌ లెవల్‌ సెక్యూరిటీ రివ్యూ కమిటీ సభ్యుడు ఐపీఎస్‌ అధికారి షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ బుధవారం హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. ‘‘మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పిస్తున్నాం. ఈ కేటగిరీ కింద మొత్తం 58 మంది భద్రతా సిబ్బంది రక్షణగా ఉంటారు. తాజా భద్రత ముప్పు విశ్లేషణ నివేదిక ఆధారంగా ఆయనకు జడ్‌ ప్లస్‌ కొనసాగించాలని సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సు చేసింది. పిటిషనర్‌ 2014-19 మధ్య ప్రతిపక్షనేతగా ఉండగా జడ్‌ కేటగిరీ భద్రత ఉండేది. 2019లో ముఖ్యమంత్రి అయ్యాక జడ్‌ ప్లస్‌ ఇచ్చారు.

బుల్లెట్‌ ఫ్రూప్‌ వాహనం కేటాయించారు. ఆన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన, ఆయన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించేందుకు ప్రత్యేక సెక్యూరిటీ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తూ 2023లో చట్టం తీసుకొచ్చారు. దీని ఆధారంగా ఆయనకు అదనపు సిబ్బందితో భద్రత కల్పించారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందింది. ఈ నేపఽథ్యంలో అదనపు భద్రతకు జగన్‌, ఆయన కుటుంబ సభ్యులు అనర్హులు. చట్ట నిబంధనలు అనుసరించి ముఖ్యమంత్రి హోదాలో తనకు అదనపు భద్రత కల్పించారని పిటిషనర్‌కు తెలిసినప్పటికీ, ఆ విషయాన్ని దాచిపెట్టి ప్రస్తుత పిటిషన్‌ వేశారు. ప్రస్తుతం జగన్‌ ఓ ఎమ్మెల్యే మాత్రమే. ఎమ్మెల్యే హోదాలో ఆయనకు 1+1సెక్యూరిటీకి మాత్రమే అర్హులు.


ఆయనకు ముప్పు ఉందని భావించినప్పటికీ 2+2 సెక్యూరిటీ మాత్రమే పొందగలరు. అయినప్పటికీ ప్రభుత్వం జగన్‌కు బుల్లెట్‌ ఫ్రూప్‌ వాహనంతో పాటు జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా సేవలు అందించిన కిరణ్‌కుమార్‌ రెడ్డికి మాజీ సీఎం హోదాలో వై కేటగిరీ సెక్యూరిటీ మాత్రమే కల్పిస్తున్నాం. ఆయనకు ఓ అదనపు పీఎ్‌సవోతో పాటు 13 మంది సిబ్బందితో ఎస్కార్ట్‌ మాత్రమే ఉంటుంది.

భద్రతకు ముప్పు ఉందని ఆధారాలు జత చేస్తూ పిటిషనర్‌ ఉన్నతాధికారులకు ఎలాంటి వినతీ సమర్పించలేదు. కోర్టు ముందు ఎలాంటి వివరాలూ ఉంచలేదు. ఈ ఏడాది జూన్‌ 7 తర్వాత ఆయన భద్రతకు ముప్పుందని చెప్పేలా ఎలాంటి ఘటనలూ జరుగలేదు. ఈ వివరాలు ఏమీ లేకుండా పిటిషన్‌ దాఖలు చేయడం వెనుక ఇతర కారణాలు ఉన్నట్లు కనిపిస్తోంది. భద్రతపై ఆందోళన ఉంటే ఇతర ప్రత్యామ్నాయాలను అనుసరించాలి తప్ప నేరుగా హైకోర్టును ఆశ్రయించడానికి వీల్లేదు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని పిటిషన్‌ను కొట్టివేయండి’ అని అందులో కోరారు.

Updated Date - Sep 06 , 2024 | 04:43 AM