Share News

కొన్ని స్వార్ధాల మధ్య పురాణపండ శ్రీనివాస్‌తో రోజా అద్భుత పరమార్ధమే ‘శ్రీ పూర్ణిమ’

ABN , Publish Date - May 07 , 2024 | 12:37 AM

కొన్ని స్వార్ధాల మధ్య పురాణపండ శ్రీనివాస్‌తో రోజా అద్భుత పరమార్ధమే ‘శ్రీ పూర్ణిమ’. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రెండువారాల ముందు తన స్వగృహానికి ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్‌ని ఆహ్వానించి, తన గృహంలోని కార్యాలయంలో గంటకు పైగా చర్చలు జరిపి, సత్కరించి ఈ అద్భుతమైన ‘శ్రీపూర్ణిమ’ గ్రంధాన్ని ప్రచురించి తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించారు రోజా.

కొన్ని స్వార్ధాల మధ్య పురాణపండ శ్రీనివాస్‌తో రోజా అద్భుత పరమార్ధమే ‘శ్రీ పూర్ణిమ’

అమరావతి, మే 6: తెలుగు భక్త రసజ్ఞ ప్రపంచం ప్రస్తుతించిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ‘శ్రీపూర్ణిమ’ మహా గ్రంధం సుమారు ఏడు వందల పేజీలతో అలరారుతోంది. తెలుగు రాష్ట్రాలలో వందల కొలది ఆలయాలకు, అనేక భక్త సమాజాలకు, ధార్మిక మండళ్లకు, వేద పాఠశాలలకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖామంత్రి ఆర్కే రోజా ఎంతో పవిత్ర భావనతో అందజేయడం మేధో సమాజాన్ని ఆశ్చర్య పరిచింది. అంతే కాదు, ఈ ‘శ్రీపూర్ణిమ’ అపురూప గ్రంధానికి సౌజన్యం కూడా రోజానే అందించడం ఆమె భక్తి హృదయాన్ని ఆవిష్కరించింది కూడా. ఈ గ్రంథ కమనీయత, రమణీయతకు వెనుక పురాణపండ శ్రీనివాస్ సౌందర్య హృదయం ముచ్చటగా ఆవిష్కృతమౌతోందని, రోజా చేసిన ఈ ఉత్తమ కార్యాన్ని అభినందించకుండా ఉండలేమని తిరుమల నాటి నేటి ప్రధానార్చకులు రమణ దీక్షితులు, వేణుగోపాల దీక్షితులు ప్రశంసలు వర్షించడం రోజా జీవన వైభవంలో ఒక మైలు రాయిగా చెప్పక తప్పదు.

Sree-Poornima.jpg

సహజంగా రాజకీయాలలో తన ప్రత్యర్థులపై నోటి దురుసును ప్రదర్శించే రోజా ఇలాంటి ప్రవిత్ర గ్రంథ కార్యాన్ని భుజాన వేసుకుందంటే సహచర మంత్రులే నమ్మలేకపోయారనే వార్త కూడా వినిపించింది.

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రెండువారాల ముందు తన స్వగృహానికి ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్‌ని ఆహ్వానించి, తన గృహంలోని కార్యాలయంలో గంటకు పైగా చర్చలు జరిపి, సత్కరించి ఈ అద్భుతమైన ‘శ్రీపూర్ణిమ’ గ్రంధాన్ని ప్రచురించి తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించారు రోజా. అప్పటికే ఈ మంగళకర ‘శ్రీపూర్ణిమ’ గ్రంధాన్ని కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కె. వి రమణాచారి, వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి మూడు ప్రచురణలు భక్తి సొగసులతో సమర్పించారు. మరికొన్ని సరిక్రొత్త అంశాలను జత చేసి నాల్గవ ప్రచురణగా ఈ అత్యద్భుత ‘శ్రీపూర్ణిమ’ అఖండ గ్రంధాన్ని ఆర్కే రోజా సమర్పించారు.

Puranapanda-Srinivas.jpg

చాలా విలువైన గ్రంధంగా ఖరీదైన పేపర్‌పై, పూర్తిగా మల్టీకలర్‌లో ముద్రించబడ్డ ఈ పుస్తకంలో ఎన్నో చోట్ల పురాణపండ శ్రీనివాస్ దైవీయ చైతన్యాన్ని స్ఫురింపచేసేలా, స్మరిస్తూ రాసిన అద్భుతాంశాలు మనస్సును కుదుటపడేలా అమృతపు విలువలతో కట్టేస్తాయి. పూజా పీఠాలకు అర్ధవంతమైన మహా గ్రంధాన్ని అందించిన రోజా ఇలాంటి ఒకటి రెండు ప్రయోజనకరమైన పనులే చేసిందని, మిగిలినవన్నీ స్వార్ధ ప్రయోజనాలతో కూడుకున్నవేనని కొందరు ప్రతిపక్ష విద్యాధికులు విమర్శిస్తున్నారు. పురాణపండ శ్రీనివాస్ గ్రంధాల్లో అక్కడక్కడ రాసే అద్భుతమైన కొన్ని అంశాలు పాఠకుల బాహ్యాన్తరాలను ప్రక్షాళన చేసేలా వుంటాయని, మన మనస్సును నిశిత పరీక్షకు గురి చేస్తాయని... ఇలాంటి ఎంతో ఎంతో విలువైన గ్రంధాన్ని తన సొంత ఖర్చుతో ప్రచురించిన రోజా చాలామంది వైఎసార్సీపీ నాయకులకు, నగరిలో తమ భక్త ఆలయాలకు ఇవ్వలేదని విమర్శించిన వారూ వున్నారు.

అయితే రోజా తాను పురాణపండ శ్రీనివాస్ ద్వారా ప్రచురించిన ఇలాంటి అఖండ గ్రంధాలను మరియు అప్పుడప్పుడు ప్రచురించిన మరికొన్ని చిన్న చిన్న పుస్తకాలను తానే స్వయంగా బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో, యాదాద్రిలో, కాణిపాకంలో పంచిపెట్టి భక్తిని చాటుకోవడం సంతోషమే అయినా రోజా ఇలాంటి భక్తికి సంబంధించిన మంచిపనులు చేసినప్పుడు తన సహచర ఎమ్మెల్యేలకు, మంత్రులకు, నగరి ప్రభుత్వ అధికార గణాలకు, నగరి చుట్టూ ప్రక్కల ఉన్న ఆలయాలకు ఇచ్చి ఉంటే చాలా బాగుండేదని వైఎసార్సీపీ నాయకులు కొందరు బాహాటంగా విమర్శించడం రోజా చెవిన పడినా పట్టించుకోకపోవడం గమనార్హం. తిరుమల మొదలు తెలుగు రాష్ట్రాలలో వేలాది ఆలయాలలో పురాణపండ శ్రీనివాస్ పుస్తకాలు మెరుస్తూ దర్శనమిస్తాయి. ఇలాంటి ప్రజ్ఞావంతునితో బుక్ ప్రచురించినప్పుడు ఎక్కడెక్కడ ఈ అపురూపపు ఙ్ఞానపేటిక ఇస్తే బాగుంటుందో రోజా తెలుసుకోకుండా... తన అనుచర గణానికి అప్పచెప్పడంతో వారు ఎక్కడపడితే అక్కడ పంచేశారు. ఆర్కే రోజా ఇంత మంచి పని చేసినా అమరావతిలో తన శాఖ అధికారులకు కూడా ఇంత ఉత్తమ గ్రంధం ఇవ్వకపోవటం విచారకరమని అక్కడి అధికారులు పెదవులు విరిచారు కూడా.

RK-Roja.jpg

మంత్రి రోజా తన రాజకీయ, సినీ ప్రయాణంలో ‘శ్రీపూర్ణిమ’ గ్రంధం ఒక అద్భుతమైన వెలుగనే పేర్కొన్నారు రాజకీయ విశ్లేషకులు. కానీ అమరావతి, నగరికి సంబంధించిన అధికార, రాజకీయ, వైఎసార్సీపీ శ్రేణులకు కాకుండా వేర్వేరు చోట్ల తన అనుచరగణం పంచెయ్యడం అనేక విమర్శలకు దారితీసింది. అంతే కాదు.... ఎన్నో నిగూఢమైన సత్యాలతో, వేద వేదాంతాల సత్య శోధనలతో, పురాణేతిహాసాల స్తోత్ర సంపదలతో, అలరారే ‘శ్రీపూర్ణిమ’ని అందించిన ప్రతిభాశాలి పురాణపండ శ్రీనివాస్ ఈసారి ఆర్కే రోజాకి ఎన్నికల తరువాత ఎలాంటి పవిత్ర గ్రంధాన్ని అందిస్తారో చూద్దామంటున్నారు విజ్ఞులు. ఈసారైనా మంత్రి రోజా పురాణపండ శ్రీనివాస్ చేత రాయించి ప్రచురించే భాగ్యాలను సక్రమరీతిలో అందిస్తారో... లేదో చూడాల్సిందే అంటున్నారు భక్త శిఖామణులు.

Roja-2.jpg

మరొక అంశమేమంటే ఉత్తమమైన కార్యాలు చేసే రోజా మరి నాలుకతో కూడా మరింత ఉత్తమంగా పలికితే ఎన్నో విజయ దుందుభిలు ఆమె ఇంట మ్రోగుతాయంటున్నారు మేధావులు. ఇదిలా ఉండగా ఈ ‘శ్రీపూర్ణిమ’ గ్రంధంలో వున్న అత్యద్భుతమైన అంశాల కారణంగా ఈ దివ్యగ్రంధం ఇప్పటికి ఇరవైఐదు పునర్ముద్రణకు నోచుకుందని హైదరాబాడ్ కోఠికి చెంది ఒక ప్రముఖ బుక్ స్టాల్ అధినేత కితాబివ్వడం ఈ పుస్తక వైభవాన్ని తెలియజేస్తోంది.

Updated Date - May 07 , 2024 | 12:39 AM