Share News

Polavaram : పోలవరం ఫైళ్లకు నిప్పు!

ABN , Publish Date - Aug 18 , 2024 | 04:22 AM

పోలవరం ప్రాజెక్టు ఫైళ్లను శుక్రవారం రాత్రి తగలబెట్టేశారు. కొత్త బీరువాలు కొని పాతవన్నీ క్లీన్‌ చేస్తూ వేస్ట్‌ పేపర్లను దహనం చేసినట్టు అధికారులు చెబుతున్నా,

Polavaram : పోలవరం ఫైళ్లకు నిప్పు!

‘మరో మదనపల్లె’ దహనం?

ధవళేశ్వరం భూసేకరణ కార్యాలయం వద్ద కీలక ఫైళ్లు బుగ్గి

వాటిలో భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ చెల్లింపు వివరాలు

ఎడమ కాలువ కింద నాడు భూసేకరణలో భారీ స్కామ్‌

రూ.19 కోట్లు కాజేసిన అప్పటి స్పెషల్‌ కలెక్టరు

నకిలీ రైతుల పేరిట దందా.. అది బయటపడొద్దనే నిప్పా?

విలేకరులను చూడగానే కాలిన ఫైళ్లు ఆఫీ్‌సలోకి..

అవి జిరాక్స్‌ కాపీలే.. వేస్ట్‌ తగలబెట్టాం: అధికారులు

గ్రీన్‌ ఇంక్‌ సంతకాలు ఎందుకు ఉన్నాయంటే మౌనం

వేస్ట్‌కూ అనుమతి లేకుండా నిప్పు పెట్టకూడదన్నది నిబంధన

రాజమహేంద్రవరం, ఆగస్టు 17(ఆంరధజ్యోతి): పోలవరం ప్రాజెక్టు ఫైళ్లను శుక్రవారం రాత్రి తగలబెట్టేశారు. కొత్త బీరువాలు కొని పాతవన్నీ క్లీన్‌ చేస్తూ వేస్ట్‌ పేపర్లను దహనం చేసినట్టు అధికారులు చెబుతున్నా, ఇది మరో మదనపల్లె ఘటనా? అనే అనుమానాలు పొగలా కమ్ముకుంటున్నాయి. తమ భూదందాలు బయటకు వస్తాయని వైసీపీ నేతలు మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలోని ఫైళ్లు తగలబెట్టిన విషయం తెలిసిందే. పోలవరం ప్రధాన ఎడమ కాలువ పనుల కోసం చేపట్టిన భూసేకరణ చెల్లింపుల్లో భారీ స్కామ్‌ జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం రూ. 19 కోట్లు దాకా మింగేశారని చెబుతున్నారు. ఇప్పుడు తగలబడింది సరిగ్గా ఆ ప్రధాన ఎడమ కాలువ భూసేకరణ కార్యాలయంలోని ఫైళ్లే! ఇంకా.. రైతులు, లబ్ధిదారుల ఆధార్‌ కార్డులు, కాకినాడ కలెక్టరేట్‌ నుంచి ఇక్కడకు వచ్చిన లెటర్లు, పోలవరం ఎడమ ప్రధాన కాలువకు సబంధించిన అవార్డు పత్రాలు, ఫొటోలు కూడా దహనమైన వాటిలో ఉన్నాయి. శనివారం మధ్యా హ్నం 2.30గంటల సమయంలో సమాచారం తెలిసి విలేకరులు అక్కడకు వెళ్లగా, సగం కాలిన ఫైళ్లను, పత్రాలను అక్కడి అధికారులు లోపలకు తీసుకుని వెళ్లి దాచేశారు. దీంతో ఈ ఘటనపై మరిన్ని అనుమానాలు ముసురుకున్నాయి. ఆ తర్వాతి పరిణామాలు కూడా సందేహాలను మరింత పెంచేలా ఉన్నాయి. ఫైళ్లను బయట పడేసినట్టు చెబుతున్న శ్రావణి అనే స్వీపరు..ఆకస్మికంగా విశాఖపట్నం వెళ్లారని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది.

అసలేం జరిగింది?

పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలు అమలుచేసే కార్యాలయం ధవళేశ్వరంలో ఉంది. ఇక్కడ ప్రాజెక్టు అడ్మిస్ర్టేటర్‌గా ఐఏఎస్‌ అధికారి, భూసేకరణ స్పెషల్‌ కలెక్టర్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ (ప్రధాన కాలువ భూసేకరణ విభాగం) ఉన్నారు. పోలవరం నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి మీదుగా విశాఖపట్నానికి నీటిని తీసుకెళ్లడానికి పోలవరం ప్రాజెక్టు నుంచి 212 కిలోమీటర్ల మేర ఎడమ ప్రధాన కాలువను నిర్మిస్తున్నారు. ఇందులో చాలా వరకూ భూసేకరణ జరిగింది. దానికి సంబంధించిన ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలుకు సంబంధించిన ఫైళ్లు, ఎవరి భూమిని ఎంతకు, ఎపుడు సేకరించామనే ఫైళ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. గతంలో స్పెషల్‌ కలెక్టర్‌గా పనిచేసిన వి.మురళి దేవీపట్నం తదితర ప్రాంతాల్లో లబ్ధిదార్లకు దక్కకుండా రూ.19 కోట్లు కాజేశారు. ఆ తర్వాత 22మంది నకిలీ రైతులను సృష్టించి రూ.6 కోట్లు కాజేసిన గొడవలు, కేసులు కూడా ఉన్నాయి. రూ.6 కోట్ల కేసు కోర్టులో నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఏమైనా ప్రణాళిక ప్రకారమే నిప్పుపెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ధవళేశ్వరంలోని భూసేకరణ కార్యాలయంలో ప్రస్తుతం ప్రాజెక్టు పరిపాలనాధికారిగా ఉన్న ఐఏఎస్‌ అధికారి ఇలాక్కియా కొద్దివారాల క్రితమే బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల ఆమె ఆరునెలల మెటర్నిటీ లీవ్‌ మీద వెళ్లారు. భూసేకరణ స్పెషల్‌ కలెక్టర్‌ ఎస్‌.సరళాదేవి కూడా ప్రస్తుతం సెలవులో ఉన్నారు. స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ జి.మమ్మి కూడా రెండురోజుల పాటు సెలవు పెట్టారు. ఈలోపు ఆఫీసు ఇన్‌చార్జిగా స్పెషల్‌ కలెక్టర్‌ పీఏ వేదవల్లిని నియమించారు. ఆఫీసు సూపరింటెండెంట్‌గా కుమారి అనే ఉద్యోగిని ఉన్నారు. ఇక్కడ పనిచేసే శ్రావణి అనే స్వీపర్‌ శుక్రవారం రాత్రి బీరువా సర్ది, శుభ్రం చేసి, పలు ఫైళ్లను, పత్రాలను బయట పడేసినట్టు చెబుతున్నారు. ఆమె వాటిని దహనం చేసినట్టు ఒకసారి, సిబ్బందే తగలబెట్టారని మరోసారి చెబుతున్నారు. సమాచారం బయటకు పొక్కేసరికే ఫైళ్లు చాలావరకు పూర్తిగా దహనమై, బూడిదగా మారాయి.


గోరంట్ల చొరవతో...

పోలవరం ఫైళ్ల దహనంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి....జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిశోర్‌కు దీనిపై సమాచారం ఇచ్చారు. తాను స్వయంగా కార్యాలయానికి వెళ్లి కాగిన ఫైళ్లను పరిశీలించారు. అధికారులను గట్టిగా నిలదీశా రు. కాగా, కలెక్టరు, ఎస్పీ ఆదేశాలతో ఆర్డీవో లక్ష్మీ శివజ్యోతి, డీఎస్పీ భవ్యకిశోర్‌ ఘటనాస్థలికి చేరుకుని విచారించారు. రికార్డులు దహనం లేదని, జిరాక్స్‌లు, వేస్ట్‌ పత్రాలు మాత్రమే తగలబెట్టారని మీడియాకు తెలిపారు .అయితే, ఏ కాగితమైనా అధికారుల అనుమతి లేకుండా దహనం చేయరాదని, అందువల్ల బాధ్యులపై చర్య తీసుకుంటామని తెలిపారు. కాగా, పోలవరం ఫైళ్ల దహనం వెనుక అనేక అనుమానాలున్నాయని గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. ‘‘గత ప్రభుత్వంలో ఇరిగేషన్‌, ఇతర భూముల కుంభకోణాలు జరిగాయి. అసలెన్ని భూములు ఉన్నాయో, ఎక్కడ ఉన్నాయో సర్వే చేయాలని ఇటీవలే ఆదేశించాం. ఇంతలో ఇది జరిగింది. దీన్ని సీరియ్‌స్‌గా తీసుకుని సమగ్ర విచారణ జరపాలి’’ అని గోరంట్ల కోరారు.

అవి వేస్ట్‌ ఫైళ్లు ఎందుకవుతాయి?

సమాచారం తెలిసి, విలేకరులు వెళ్లి చూస్తుండగా, ఆఫీసు లోపల ఉన్న వేదవల్లి, కుమారి తమ సిబ్బందితో సగం వరకూ తగలబడిన ఫైళ్ళను లోపలకు తెప్పించి, భద్రపరిచారు. ఇవి కేవలం చిత్తు కాగితాలని, ఆఫీసును శుభ్రం చేస్తూ, వేస్ట్‌గా ఉన్నవాటికి నిప్పు పెట్టినట్టు కుమారి తెలిపారు. ఈ క్రమంలో విలేకరులు కొన్ని పత్రాలు చూపించి, ఇవి వేస్ట్‌ ఫైళ్లు ఎందుకవుతాయి? అధికార్ల సంతకాలు కూడా ఉన్నాయి కదా? అని ప్రశ్నించగా... ఇన్‌చార్జి వేదవల్లి జోక్యం చేసుకున్నారు. ‘వేస్ట్‌ కాగితాలైతే మాత్రం నాకు చెప్పకుండా ఎందుకు ఇలా చేయించావ’ని కుమారిపై ఆగ్రహించారు. ‘నేను కొద్ది నెలల్లో ఉద్యోగ విరమణ చేస్తా, నాకు పెద్ద సమస్య తెచ్చిపెట్టావ’ని చీవాట్లు వేశారు. ఆ తర్వాత తాను కలెక్టర్‌ ఆఫీసుకు వెళుతున్నట్టు చెప్పి ఆమె వెళ్లిపోయారు.

Updated Date - Aug 18 , 2024 | 05:33 AM