Share News

TDP (GS) Nara Lokesh : ‘మిషన్‌ రాయలసీమ’తో కష్టాలు తీరుస్తాం

ABN , Publish Date - May 09 , 2024 | 05:46 AM

తాను రాయలసీమ బిడ్డనని, ఒక్క అవకాశం ఇస్తే సీమను అభివృద్ధి చేస్తానని గత ఎన్నికల సందర్భంగా జగన్‌ చెప్పిన మాయమాటలు నమ్మి రాయలసీమ వాసులు దారుణంగా మోసపోయారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు

TDP (GS) Nara Lokesh : ‘మిషన్‌ రాయలసీమ’తో కష్టాలు తీరుస్తాం

జగన్‌ పాలనలో విధ్వంసానికి చిరునామాగా సీమ

వికసిత భారత్‌ మోదీ లక్ష్యం...

కలికిరి ‘ప్రజాగళం’ సభలో లోకేశ్‌ భరోసా

పీలేరు, మే 8: తాను రాయలసీమ బిడ్డనని, ఒక్క అవకాశం ఇస్తే సీమను అభివృద్ధి చేస్తానని గత ఎన్నికల సందర్భంగా జగన్‌ చెప్పిన మాయమాటలు నమ్మి రాయలసీమ వాసులు దారుణంగా మోసపోయారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ఆయన పాలనలో రాయలసీమ 30ఏళ్లు వెనక్కు వెళ్లిపోయిందని ధ్వజమెత్తారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అన్నమయ్య జిల్లా కలికిరిలో ‘ప్రజాగళం’ సభలో లోకేశ్‌ ప్రసంగించారు. రాయలసీమను అభివృద్ధి బాట పట్టించిన విజనరీ చంద్రబాబు అని, ఆయన సీఎంగా ఉన్న 2014-19 మధ్యకాలంలో సీమ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టుల కోసం సుమారు రూ.12వేల కోట్లు ఖర్చు పెట్టగా, జగన్‌ హయాంలో అందులో కనీసం 10శాతం కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇసుక దోపిడీ కారణంగా అన్నమయ్య, పింఛా డ్యాంలు కొట్టుకుపోయి 39మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు కనీసం ఇళ్లు కూడా కట్టించలేని చెత్త ప్రభుత్వం జగన్‌దని మండిపడ్డారు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి రెండుసార్లు శంకుస్థాపన చేసినా.. ఇప్పటివరకు అక్కడ ఒక్క ఇటుక కూడా పెట్టలేదని ఎద్దేవా చేశారు.

స్వతంత్ర భారతావనిలో ఇంతవరకు ఎన్నడూ కనని, వినని అత్యంత శక్తిమంతమైన నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని, ఆయన నేతృత్వంలో దేశం బలోపేతమైందని లోకేశ్‌ కొనియాడారు. మోదీ నూరు శాతం ‘మేడిన్‌ ఇండియా’లా ఉంటారని, ఆయన కారణంగా ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి గౌరవ మర్యాదలు పెరిగాయన్నారు.

  • మిషన్‌ రాయలసీమకు సహకరించండి

చంద్రబాబు స్వప్నమైన వికసిత్‌ రాయలసీమను సాకారం చేసుకునేందుకు ఆయన మిషన్‌ రాయలసీమ పథకాన్ని రూపొందించుకుని ఉన్నారని, దాని ఆచరణకు సహకరించాలని ప్రధాని మోదీని లోకేశ్‌ కోరారు. లోకేశ్‌ విజ్ఞప్తి పట్ల ప్రధాని సానుకూలంగా స్పందించారు. ఎన్డీయే కూటమి ముచ్చటగా మూడోసారి కూడా అధికారంలోకి వస్తుందని, రానున్న ఐదేళ్లలో రాయలసీమ రూపురేఖలు సమూలంగా మార్చివేస్తామని ఆ తరువాత ప్రధాని ప్రకటించారు.


అంతకుమందు ప్రధానిని శ్రీవేంకటేశ్వర స్వామి ప్రతిమ, మంగళగిరి శాలువతో లోకేశ్‌ సన్మానించారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పదవులు ఆశించని త్యాగమూర్తి అని లోకేశ్‌ కితాబిచ్చారు. మోదీ గ్యారంటీ, చంద్రబాబు విజన్‌, పవన్‌ కమిట్‌మెంట్‌ చూసి ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు.

  • మచ్చలేని నేత నరేంద్రుడు: కిరణ్‌కుమార్‌ రెడ్డి

అవినీతి ఆరోపణలు లేని స్వచ్ఛమైన నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కొనియాడారు. ‘ప్రజాగళం’ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రధానిగా పనిచేసిన పదేళ్లలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోని నిరంతర శ్రామికుడు మోదీ అని పేర్కొన్నారు.

దాదాపు 500 ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న అయోధ్య రామ జన్మభూమి అంశాన్ని శాంతియుతంగా పరిష్కరించడంతో పాటు మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంటు ఉభయసభల్లో విజయవంతంగా గట్టెక్కించారని చెప్పారు. మోదీ పాలనలో దేశం వెలిగిపోతుంటే.. జగన్‌ పరిపాలనలో రాష్ట్రం తిరోగమనంలో ఉందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు పేర్కొన్నారు.

Updated Date - May 09 , 2024 | 05:46 AM