Share News

‘తెలుగుభాష పరిరక్షణ, పరివ్యాప్తి కోసం ఏంచేద్దాం?’.. తానా ఆధ్వర్యంలో ఫలవంతమైన చర్చ

ABN , Publish Date - Aug 29 , 2024 | 10:03 PM

తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట నిర్వహిస్తున్న 71వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం.. ఈ పర్యాయం వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి జయంతి (ఆగస్ట్ 29) “ఆంధ్రప్రదేశ్ తెలుగుభాషాదినోత్సవం” సందర్భంగా.. “తెలుగుభాష పరిరక్షణ, పరివ్యాప్తికోసం ఏంచేద్దాం?” అనే అంశం మీద చాలా విస్తృతమైన, ఫలవంతమైన చర్చ జరిగింది.

‘తెలుగుభాష పరిరక్షణ, పరివ్యాప్తి కోసం ఏంచేద్దాం?’.. తానా ఆధ్వర్యంలో ఫలవంతమైన చర్చ

డాలస్, టెక్సస్: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట నిర్వహిస్తున్న 71వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం.. ఈ పర్యాయం వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి జయంతి (ఆగస్ట్ 29) “ఆంధ్రప్రదేశ్ తెలుగుభాషాదినోత్సవం” సందర్భంగా.. “తెలుగుభాష పరిరక్షణ, పరివ్యాప్తికోసం ఏంచేద్దాం?” అనే అంశం మీద చాలా విస్తృతమైన, ఫలవంతమైన చర్చ జరిగింది. తానాఅధ్యక్షులు నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ “తెలుగుభాషా సంస్కృతుల పరిరక్షణే ధ్యేయంగా తానా సంస్థ గత 50 సంవత్సరాలగా విశేష కృషి చేస్తోందని, తానా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాటశాల ద్వారా అమెరికాలో వేలాదిమంది పిల్లలు తెలుగు నేర్చుకుంటున్నారని ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులందరకు ఆత్మీయ స్వాగతం” అని అన్నారు.


తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “తెలుగును వ్యావహారిక భాషగా మార్చడంలో ఎంతోమంది ఛాందసువాదులను ఒంటిచేత్తో ఎదుర్కొని, ఆ కృషిలో తన సర్వసాన్ని త్యాగంచేసిన ఏకవ్యక్తి సైన్యం, ధీశాలి గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జన్మదినాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాషాదినోత్సవంగా జరుపుకోవడం ముదావహమని అన్నారు. కనీసం ఈరోజైనా ప్రస్తుతం మాతృభాష పరిస్థితి ఎలా ఉందీ, దాన్ని ఉన్నతస్థితిలో ఉంచడానికి తీసుకోవలసిన చర్యల గురించి ప్రభుత్వం దృష్టిసారించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలలో కనీసం ప్రాధమికస్థాయి వరకైనా తెలుగును నిర్భందం చెయ్యాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలలో తెలుగువాడకం పెరగాలన్నారు. ప్రభుత్వం, ప్రజలు, సంస్థలు, విద్యాలయాలు సమన్వయంతో పనిచేసి తెలుగుభాషను పరిరక్షించుకోవాలసిన సమయం ఇది’’ అని అన్నారు.


Untitled-13.jpg

తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలుగువారు సాధించిన జ్ఞానం విజ్ఞానం, అనుభవసారం అంతా తెలుగు భాషలోనే నిక్షిప్తమై ఉందన్నారు. ఈ గొప్పసంపదను భావితరాలు అందుకోవాలంటే వారికి మాతృభాష తెలిసి ఉండాలన్నారు.

ముఖ్యఅతిథిగా పాల్గొన్న భారతీయ భాషాశాస్త్రజ్ఞుల సంఘం అధ్యక్షులు ఆచార్య డా. గారపాటి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ భాషమీద ఆధారపడి 87% ఉత్పత్తులు, అమ్మకాలు, కొనుగోళ్ళ వ్యవహారాలు జరుగుతున్నాయని, భాషా వినియోగంతోనే ఆర్ధిక ఆలంబన ఉందని, తెలుగుభాషా మాధ్యమం అమలు జరగకపోతే భవిష్యత్త్ లో భాషా సంక్షోభం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.

ప్రత్యేకఅతిథిగా పాల్గొన్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య డా. మాడభూషి సంపత్ కుమార్ కార్పోరేట్ విద్యావిధానం ద్వారా మాతృభాషకు ముప్పు ఏర్పడిందని, మాతృభాషను నిలబెట్టుకోవడానికి ప్రజా ఉద్యమాలు అవసరం ఉందన్నారు. ఇక తెలుగుభాషోధ్యమ నాయకులు డా. సామల రమేష్ బాబు మాట్లాడుతూ పట్టణాలతో పాటు గ్రామాలలో నివసిస్తున్న ప్రజల్లోకి తెలుగు భాషోధ్యమాన్ని తీసుకువెళ్ళడంలో గిడుగు కృషిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.


పూర్వ డిప్యూటీ కలెక్టర్ డా. నూర్ భాషా రహంతుల్లా ప్రాథమిక స్థాయిలో తెలుగుమాధ్యమం తప్పనిసరిగా ప్రవేశ పెట్టాలని, న్యాయవ్యవస్థలో తీర్పులు తెలుగులోనే ఉండాలని, తెలుగుమాధ్యమంలో చదువుకున్నవారికి ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలన్నారు. “వ్యక్తులు, వ్యవస్థల ద్వారానే భాషా పరిరక్షణ సాధ్యమని, తగు జాగ్రత్తలు తీసుకోక పోతే ఉర్దూభాష ఏ విధంగా క్రమ క్రమంగా అంతరించిపోతున్నదో అలాగే తెలుగుభాష కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది” అని భాషోద్యమ నాయకులు డా. గుంటుపల్లి శ్రీనివాస్ అన్నారు.

‘అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ స్టడీస్’ ద్వారా విదేశీయులకు తెలుగు మాట్లాడం, వ్రాయడంలో శిక్షణ ఇస్తున్న ఆచార్య డా. కటికనేని విమల మాట్లాడుతూ ముందుగా భాషాతర్కాన్ని అర్ధం చేసుకోవాలని, కేవలం తెలుగు మాట్లాడమే గాకుండా రాయడం కూడా నేర్చుకోవాలన్నారు.


నిజాం కళాశాల తెలుగు అధ్యాపకులు డా. చంద్రయ్య శివన్న మాట్లాడుతూ సామాజిక సమానత్వ విలువగా భాషా పరివ్యాప్తి జరగాలని, విద్యార్థులకు భాషపై పట్టును, వ్యక్తీకరణ సామర్థ్యం పెంపొదించే విధంగా రూపకల్పన జరగాలన్నారు. తెలుగుభాషను సులువుగా నేర్చుకునేందుకు వీలుగా ‘ఈ – బుక్’, ‘యాప్స్’, ‘ఆన్లైన్ నిఘంటువులు’ లాంటివి రూపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు అంతర్జాల సాంకేతిక నిపుణులు శ్రీ రహమానుద్దీన్ షేక్.

“ఈమాట” పత్రిక సంస్థాపక సంపాదకులు, సురేష్ కొలిచాల మాట్లాడుతూ తెలుగు భాషను పరిరక్షించుకోవడంలో సరైన ప్రణాళికను అనుసరించకపోతే 22వ శతాబ్దంలో అంతరించబోయే 90 శాతం భాషల్లాగే తెలుగుభాష కూడా తన మనుగడను కోల్పోవచ్చని హెచ్చరించారు. భాష మనుగడకు సురేష్ ఆరు సూత్రాలను ప్రతిపాదించారు. ఆచార్య విమల దగ్గర మూడు సంవత్సరాలగా తెలుగును ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటున్న విదేశీవనిత యానా రెమిల్లార్డ్ మల్లవరపు అనర్గళంగా తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరచారు. ఆంగ్లం నేర్చుకోవడానికి ఉన్నట్లుగా తెలుగుభాష నేర్చుకోవడానికి ఎటువంటి ప్రాధమిక వ్యాకరణ గ్రంథాలు లేకపోవడం ఒక లోటు అన్నారు.


కేవలం 18 నెలల వయస్సులో తన తల్లిదండ్రులతో పాటు కాకినాడనుండి వచ్చి అమెరికా దేశంలో స్థిరపడ్డ బిందు బచ్చు తనకు తెలుగుభాష పెద్దగా తెలియకపోయినా, మాతృదేశంలో ఉన్న బంధుమిత్రులతో మాట్లాడడానికి మాతృభాష చాలా అవసరం అని గుర్తించి, వివాహమై, పిల్లలు కల్గిన తర్వాత పట్టుదలతో తెలుగు నేర్చుకున్నానని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలతో తెలుగులోనే మాట్లాడడం ద్వారా ప్రవాసంలో మాతృభాషను నిలుపుకోవచ్చన్నారు.

దుబాయిలో స్థిరపడిన ప్రశాంతి చోప్రా సభా ప్రారంభంలో సురేష్ కొలిచాల రచించిన “ఘనమైన మన భాష మన తెలుగు భాష” అనే పాటను శ్రావ్యంగా గానం చేశారు.

తెలుగు మాట్లాడం రాకపోయినా 400 కు పైగా తెలుగు పాటలను అతి శ్రావ్యంగా పాడగల పోలాండ్ దేశానికి చెందిన 15 సంవత్సరాల జాక్ చెర్ట్లూర్ ‘బ్రోచేవారెవరురా’, ‘వేదం అణువణున నాదం’, తరలి రాదా తనై వసంతం’ మొదలైన పాటలను ఎంతో శాస్త్రీయంగా, లయాత్మకంగా పాడి ఔరా అనిపించాడు.

Updated Date - Aug 29 , 2024 | 10:05 PM