Share News

first T20 India vs Sri Lanka : ‘టాప్‌’షోతో బోణీ

ABN , Publish Date - Jul 28 , 2024 | 06:27 AM

కొత్త కోచ్‌.. కొత్త కెప్టెన్‌ ఆధ్వర్యంలో బరిలోకి దిగిన టీమిండియా శ్రీలంక పర్యటనను విజయంతో ఆరంభించింది. టాపార్డర్‌లో సూర్యకుమార్‌ (58), పంత్‌ (49), జైస్వాల్‌ (40), గిల్‌ (34) లంక బౌలర్లను చెడుగుడు ఆడేయగా.. ఆ తర్వాత భారత బౌలర్లు కీలక సమయంలో చెలరేగి

 first T20 India vs Sri Lanka  : ‘టాప్‌’షోతో బోణీ

తొలి టీ20లో

శ్రీలంకపై భారత్‌ ఘనవిజయం

టీ20ల్లో శ్రీలంకపై పవర్‌ప్లేలో ఎక్కువ పరుగులు (74) చేయడం భారత్‌కిదే తొలిసారి.

పల్లెకెలె: కొత్త కోచ్‌.. కొత్త కెప్టెన్‌ ఆధ్వర్యంలో బరిలోకి దిగిన టీమిండియా శ్రీలంక పర్యటనను విజయంతో ఆరంభించింది. టాపార్డర్‌లో సూర్యకుమార్‌ (58), పంత్‌ (49), జైస్వాల్‌ (40), గిల్‌ (34) లంక బౌలర్లను చెడుగుడు ఆడేయగా.. ఆ తర్వాత భారత బౌలర్లు కీలక సమయంలో చెలరేగి ఆతిథ్య జట్టును కట్టడి చేశారు. దీంతో శనివారం జరిగిన తొలి టీ20లో 43 రన్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది. అలాగే మూడు టీ20ల సిరీ్‌సలో 1-0తో ఆధిక్యం అందుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 213 పరుగులు చేసింది. పేసర్‌ పథిరనకు నాలుగు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో శ్రీలంక 19.2 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు నిస్సాంక (79), కుశాల్‌ మెండిస్‌ (45) మెరుపు ఆరంభంతో తొలి వికెట్‌కు 84 పరుగులు జోడించారు. నిస్సాంక క్రీజులో ఉన్నంత సేపు లంక విజయంపై ధీమాతోనే ఉంది. 14 ఓవర్లలో 140 పరుగులు సాధించిన వేళ.. నిస్సాంకను స్పిన్నర్‌ అక్షర్‌ అవుట్‌ చేయడంతో ఇక కోలుకోలేక పోయింది. భారత బౌలర్లు ఒక్కసారిగా పట్టు బిగించడంతో చివరి 9 వికెట్లు 30 పరుగుల వ్యవధిలోనే నేలకూలాయి. పరాగ్‌ ఐదు పరుగులకే మూడు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్‌, అక్షర్‌ రెండేసి వికెట్లు సాధించారు. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా సూర్యకుమార్‌ నిలిచాడు.

మెరుపు ఆరంభంతో..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌-4 బ్యాటర్లు అదుర్స్‌ అనిపించారు. ఓపెనర్లు జైస్వాల్‌, గిల్‌తోపాటు కెప్టెన్‌ సూర్యకుమార్‌ ఫటాఫట్‌ ఆటతీరుతో చెలరేగారు. ఇక ఆరంభంలో నెమ్మదిగా ఆడిన పంత్‌ చివర్లో తడాఖా చూపాడు. దీంతో భారత్‌ సునాయాసంగా 200 దాటేసింది. అటు లంక పేసర్‌ పథిరన డెత్‌ ఓవర్లలో 4 వికెట్లతో కాస్త కట్టడి చేయగలిగాడు. ఇన్నింగ్స్‌ తొలి బంతినే జైస్వాల్‌ ఫోర్‌గా మల్చగా.. అదే ఓవర్‌లో గిల్‌ రెండు ఫోర్లతో 13 పరుగులు వచ్చాయి. ఇక మూడో ఓవర్‌లో జైస్వాల్‌ 6,4.. తర్వాతి ఓవర్‌లో గిల్‌ 4,4తో నాలుగు ఓవర్లలో స్కోరు 50కి చేరింది. అయితే ఆరో ఓవర్‌లో గిల్‌ 4,4,6తో పదును చూపినా చివరి బంతికి మదుశంకకు చిక్కాడు. దీంతో తొలి వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అలాగే ఏడో ఓవర్‌ తొలి బంతికే జైస్వాల్‌ కూడా స్టంపౌట్‌ అయ్యాడు. కానీ సూర్య రాకతో లంక బౌలర్ల కష్టాలు రెట్టింపయ్యాయి. ఎనిమిదో ఓవర్‌లో తను కళ్లుచెదిరే షాట్లతో 6,4,4 బాది 17 రన్స్‌ అందించాడు. 22 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసిన కెప్టెన్‌ కాసేపటికే పేసర్‌ పథిరనకు చిక్కాడు. ఇక సూర్య ఉన్నంతసేపు నిదానంగా ఆడిన పంత్‌ 16వ ఓవర్‌లో 6,4తో జోరు చూపాడు. 19వ ఓవర్‌లోనూ రెండు ఫోర్లు బాదినా.. పథిరన అతడితో పాటు పరాగ్‌ (7)ను అవుట్‌ చేశాడు. అప్పటికే 200 రన్స్‌ దాటిన స్కోరుకు చివరి ఓవర్‌లో అక్షర్‌ (10 నాటౌట్‌) 10 రన్స్‌ అందించాడు.

స్కోరుబోర్డు

భారత్‌: జైస్వాల్‌ (స్టంప్‌) కుశాల్‌ (బి) హసరంగ 40; గిల్‌ (సి) ఫెర్నాండో (బి) మదుశంక 34; సూర్యకుమార్‌ (ఎల్బీ) పథిరన 58; పంత్‌ (బి) పథిరన 49; హార్దిక్‌ (బి) పథిరన 9; పరాగ్‌ (ఎల్బీ) పథిరన 7; రింకూ (బి) ఫెర్నాండో 1; అక్షర్‌ (నాటౌట్‌) 10; అర్ష్‌దీప్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 213/7. వికెట్ల పతనం: 1-74, 2-74, 3-150, 4-176, 5-192, 6-201, 7-206. బౌలింగ్‌: మదుశంక 3-0-45-1; ఫెర్నాండో 4-0-47-1; తీక్షణ 4-0-44-0; హసరంగ 4-0-28-1; కమిందు 1-0-9-0; పథిరన 4-0-40-4.

శ్రీలంక: నిస్సాంక (బి) అక్షర్‌ 79; కుశాల్‌ (సి) జైస్వాల్‌ (బి) అర్ష్‌దీప్‌ 45; పెరీరా (సి) బిష్ణోయ్‌ (బి) అక్షర్‌ 20; కమిందు (బి) పరాగ్‌ 12; అసలంక (సి) జైస్వాల్‌ (బి) బిష్ణోయ్‌ 0; షనక (రనౌట్‌) 0; హసరంగ (సి) పరాగ్‌ (బి) అర్ష్‌దీప్‌ 2; తీక్షణ (బి) పరాగ్‌ 2; పథిరన (సి) అక్షర్‌ (బి) సిరాజ్‌ 6; ఫెర్నాండో (నాటౌట్‌) 0; మదుశంక (బి) పరాగ్‌ 0; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 19.2 ఓవర్లలో 170 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-84, 2-140, 3-149, 4-158, 5-160, 6-161, 7-163, 8-170, 9-170, 10-170. బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 3-0-24-2; సిరాజ్‌ 3-0-23-1; అక్షర్‌ 4-0-38-2; బిష్ణోయ్‌ 4-0-37-1; హార్దిక్‌ 4-0-41-0; పరాగ్‌ 1.2-0-5-3.

టీ20ల్లో తన రెండో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ (22 బంతుల్లో) సాధించిన సూర్యకుమార్‌. గతంలో దక్షిణాఫ్రికాపై 18 బంతుల్లోనే పూర్తి చేశాడు.

Updated Date - Jul 28 , 2024 | 08:17 AM