Share News

పారిస్‌లో తెలుగు యోధులు

ABN , Publish Date - Aug 27 , 2024 | 05:22 AM

వైకల్యం వెక్కిరించినా కుంగిపోకుండా.. కాలం నేర్పిన గుణపాఠాలను సవాల్‌ గా తీసుకొని.. అవరోధాలను అనుకూలంగా మార్చుకున్న పోరాట యోధులు వీళ్లు. ప్రోత్సాహం అంతగా లేకున్నా, అందుబాటులో ఉన్న వనరులను....

పారిస్‌లో తెలుగు యోధులు

రేపటి నుంచే పారాలింపిక్స్‌

వైకల్యం వెక్కిరించినా కుంగిపోకుండా.. కాలం నేర్పిన గుణపాఠాలను సవాల్‌ గా తీసుకొని.. అవరోధాలను అనుకూలంగా మార్చుకున్న పోరాట యోధులు వీళ్లు. ప్రోత్సాహం అంతగా లేకున్నా, అందుబాటులో ఉన్న వనరులను అందిపుచ్చుకొని తమ క్రీడల్లో సత్తా చాటిన విజేతలు వీళ్లు. ఇప్పుడదే ఆటల్లో దేశం తరఫున పారాలింపిక్స్‌లో పతకాలు సాధించేందుకు సిద్ధమయ్యారు మన క్రీడాకారులు. పారి్‌సలో పోడియంపై నిల్చొని, జాతీయ పతాకాన్ని రెపరెపలాడించగలరన్న అంచనాలున్న ఈ తెలుగు వెలుగులపై ఓ లుక్కేద్దాం.

అనకాపల్లి కె. కోటపాడుకు చెందిన షాట్‌పుట్‌ క్రీడాకారుడు రొంగలి రవి పుట్టుకతోనే మరుగుజ్జు. తన ఎత్తును చూసి మిత్రులతో పాటు చుట్టుపక్కల వాళ్లు గేలిచేసినా ఏనాడూ కుంగిపోలేదు. తాను ఏదైనా సాధిస్తే, ఇవాళ వెక్కిరించిన వాళ్లే రేపు గౌరవిస్తారని చిన్నతనంలోనే దృఢంగా నిశ్చయించుకున్న రవి.. చదువుతో పాటు ఆటల్లోనూ తనదైన ప్రతిభ చూపేవాడు. చిన్నప్పుడు ప్రభుత్వ హాస్టల్‌లో ఉండి చదువుకునేటప్పుడే తనకిష్టమైన షాట్‌పుట్‌ క్రీడను కెరీర్‌గా ఎంచుకున్నాడు. అనతికాలంలోనే అందులో రాటుదేలిన రవి.. ఈ ఏడాది పారిస్‌ క్రీడలకు ఎంపికై పారాలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత షాట్‌పుట్‌ క్రీడాకారునిగా రికార్డు సృష్టించాడు. తన ఈవెంట్‌లో ప్రస్తుతం ప్రపంచ ఐదో ర్యాంకర్‌గా కొనసాగుతున్న రవి.. నిరుడు పారా ఆసియా క్రీడల్లో రజతం నెగ్గి అదరగొట్టాడు. బెంగళూరు సాయ్‌ కేంద్రంలో శిక్షణ తీసుకొన్న రవి.. ఇప్పుడు పారాలింపిక్స్‌లో ఏకంగా స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు.


గౌరవం కోసం పోరాటం

రిసెప్షనిస్టుగా మొదలై...

నంద్యాలకు చెందిన సైక్లిస్ట్‌ షేక్‌ అర్షద్‌ మొదట తైక్వాండో క్రీడాకారుడు. అయితే, పన్నెండేళ్ల వయసులో ఉన్నప్పుడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎడమకాలిని మోకాలి దాకా కోల్పోయాడు. అయినా, ఓవైపు చదువు కొనసాగిస్తూనే, పారా క్రీడలపై దృష్టి సారించాడు. వైద్యుడు రవికృష్ణ ప్రోత్సాహంతో ఆర్చరీ, పర్వతారోహణ, ట్రయాథ్లాన్‌ లాంటి ఈవెంట్లలో జాతీయస్థాయిలో రాణించి పతకాలు కొల్లగొట్టాడు. ఈ క్రమంలో ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురవడంతో కొన్నాళ్లు ఆసుపత్రిలో రిసెప్షనిస్టుగా పనిచేశాడు. అనంతరం ఆదిత్య మెహతా ఫౌండేషన్‌ సహకారంతో సైక్లింగ్‌ క్రీడను కెరీర్‌గా ఎంచుకొన్న అర్షద్‌..


ఇప్పటిదాకా నాలుగు

ప్రపంచ చాంపియన్‌షి్‌పలలో పాల్గొని స్వర్ణ పతకాలు సాధించాడు. సైక్లింగ్‌లో పారాలింపిక్స్‌కు ఎంపికైన తొలి భారత ఆటగాడిగా నిలిచిన 31 ఏళ్ల అర్షద్‌.. పారిస్‌ క్రీడల్లో పతకం నెగ్గాలన్న కసితో గతనెలలో లద్దాఖ్‌లో అత్యంత కఠినమైన హై ఆల్టిట్యూడ్‌ శిక్షణ తీసుకున్నాడు. పారాలింపిక్స్‌ సైక్లింగ్‌లో నాలుగు విభాగాల్లో పోటీపడుతున్న అర్షద్‌.. కచ్చితంగా పతకంతో తిరిగొస్తానని చెబుతున్నాడు.

పేదరికం నుంచి..

వరంగల్‌ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన జీవాంజి దీప్తికి పుట్టుకతోనే మానసిక వైకల్యం. బంధువులు, ఇరుగు పొరుగు వారి నుంచి హేళనలు. వీటికి తోడు పేదరికం. అయినా, అన్ని అడ్డంకులను అధిగమించి పరుగునే ఊపిరిగా చేసుకుంది. అంతర్జాతీయస్థాయిలో పతకాలు సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగింది. అథ్లెటిక్స్‌ కోచ్‌ నాగపురి రమేశ్‌ శిక్షణలో రాటుదేలింది. కెరీర్‌ ఆరంభంలో కూతురి వైద్యం, శిక్షణ కోసం తమకున్న ఎకరం భూమిని అమ్మిన దీప్తి తల్లిదండ్రులు.. ఆమెకు వెన్నుదన్నుగా నిలిచారు. గతేడాది పారా ఆసియా క్రీడల్లో రికార్డు ప్రదర్శనతో పసిడి నెగ్గిన దీప్తి.. పారా వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో విజేతగా నిలిచింది. ఇప్పుడు పారాలింపిక్స్‌లో పతకం నెగ్గాలన్న పట్టుదలతో పారి్‌సలో అడుగుపెట్టింది. 400 మీటర్ల టీ20 రేసులో పోటీపడుతున్న దీప్తికి పతకం గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.


ఆర్మీ విధుల్లో కాలు పోయినా..

కబడ్డీ ప్లేయర్‌గా జూనియర్‌ విభాగంలో జాతీయ స్థాయిలో రాణించిన నంద్యాల జిల్లా ప్యాపిలికి చెందిన కొంగనపల్లి నారాయణ.. దేశానికి సేవ చేయాలన్న లక్ష్యంతో 17 ఏళ్ల వయసులో ఆర్మీలో చేరాడు. జమ్మూలోని ఎల్‌ఓసీ వద్ద విధులు నిర్వర్తిస్తుండగా మందుపాతర పేలి ఒక కాలు పోగొట్టుకున్నాడు. మానసికంగా, శారీరకంగా తీవ్రంగా కుంగిపోయిన దశలో కల్నల్‌ గౌరవ్‌ దత్‌తో ఏర్పడిన పరిచయం నారాయణ జీవితాన్ని మార్చేసింది. పుణె వెళ్లి కృత్రిమ కాలు అమర్చుకున్న నారాయణ.. గౌరవ్‌ సహకారంతో పారా క్రీడలను కెరీర్‌గా ఎంచుకున్నాడు. మొదట జావెలిన్‌లో ప్రయత్నించినా.. పరిగెత్తడం కష్టమని భావించి ఆ తర్వాత రోయింగ్‌కు మారాడు. జాతీయస్థాయిలో ఎన్నో పతకాలు నెగ్గిన అతడు.. గతేడాది పారా ఆసియా క్రీడల్లో మిక్స్‌డ్‌ స్కల్‌ రోయింగ్‌ విభాగంలో రాజస్థాన్‌కు చెందిన అనితతో కలిసి రజతం సాధించాడు. పారాలింపిక్స్‌లోనూ అనితతో కలిసి బరిలోకి దిగుతున్న నారాయణ.. పీఆర్‌ మిక్స్‌డ్‌-3 విభాగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

(ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి)

Updated Date - Aug 27 , 2024 | 02:14 PM