AP News: జగన్‌ ఒక్క డీఏ అయినా ప్రకటించారా?: బండి శ్రీనివాస్

ABN , First Publish Date - 2023-04-28T15:53:24+05:30 IST

సీఎం జగన్‌ (CM Jagan)పై ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్ (Bandi Srinivas) కీలక వ్యాఖ్యలు చేశారు. మాట తప్పడం జగన్‌ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య అని దుయ్యబట్టారు.

AP News: జగన్‌ ఒక్క డీఏ అయినా ప్రకటించారా?: బండి శ్రీనివాస్

విజయవాడ: సీఎం జగన్‌ (CM Jagan)పై ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్ (Bandi Srinivas) కీలక వ్యాఖ్యలు చేశారు. మాట తప్పడం జగన్‌ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య అని దుయ్యబట్టారు. 11వ పీఆర్సీ వారం రోజుల్లోనే అమలు చేస్తామని.. నేటికీ చేయట్లేదని విమర్శించారు. ఉద్యోగ సమస్యలపై జగన్‌ ప్రభుత్వానివి చిత్తశుద్ధి లేని చర్చలని తప్పుబట్టారు. జగన్‌ ఒక్క డీఏ అయినా ప్రకటించారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అని సీఎస్ జవహర్‌రెడ్డి (CS Jawahar Reddy) చెప్పారని గుర్తుచేశారు. జగన్‌ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు కరోనా ఉంటుందన్నట్లుందని వ్యాఖ్యానించారు. త్వరలో ఏపీ జేఏసీ ఉద్యోగుల సంఘంతో చర్చించి.. ఉద్యమంలోకి వచ్చే అంశం ప్రకటిస్తామని బండి శ్రీనివాస్ తెలిపారు.

మరోవైపు ఫస్ట్‌ తారీఖు వచ్చిందంటే ఠంఛన్‌గా జీతాలు అందుకునేవారు ఎవరంటే ప్రభుత్వ ఉద్యోగులే. అందుకే ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు.. దేనికీ కొదువ ఉండదనుకున్నారు. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగుల సీను రివర్స్‌గా మారింది. ఒకప్పుడు ప్రైవేటు సంస్థల ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులను చూసి ఈర్ష్య పడేవారు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రైవేటు సంస్థల్లో పనిచేవారితో సమానంగా వీరి పరిస్థితి మారింది. ఫస్ట్‌ తారీఖునే జీతాలు పడడం అనేది ఎప్పుడో మరిచిపోయారు. రానురాను వారాలు గడిచినా ఇదిగో అదిగో అంటూనే కాలయాపన. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు పడకపోతే కాస్త తికమకపడేవారు. కస్సుబుస్సులాడేవారు. ప్రభుత్వం ఏదైనా బహిరంగంగా విరుచుకుపడేవారు. కొన్ని మాసాలుగా రాష్ట్ర ఆర్థిక వ్యవహారం నడి సంద్రంలో నావలాగా మారి, అప్పులు తెస్తేనే జీతాలన్నట్లు పరిస్థితి మారింది.

Updated Date - 2023-04-28T16:03:32+05:30 IST