BSNL: ఫీల్డ్ టెస్టు విజయవంతం.. రోజుకు 200 4జీ టవర్ల ఏర్పాటుకు బీఎస్ఎన్ఎల్ సన్నాహాలు

ABN , First Publish Date - 2023-04-23T17:01:05+05:30 IST

దేశంలోని ప్రైవేటు టెలికం సంస్థలైన జియో(Jio), ఎయిర్‌టెల్(Airtel) 5 సేవలు అందిస్తుంటే

BSNL: ఫీల్డ్ టెస్టు విజయవంతం.. రోజుకు 200 4జీ టవర్ల ఏర్పాటుకు బీఎస్ఎన్ఎల్ సన్నాహాలు

న్యూఢిల్లీ: దేశంలోని ప్రైవేటు టెలికం సంస్థలైన జియో(Jio), ఎయిర్‌టెల్(Airtel) 5 సేవలు అందిస్తుంటే ఇంకా 3జీలోనే ఉండిపోయిన ప్రభుత్వ రంగ ప్రైవేటు సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇటీవలే 4జీపై దృష్టిసారించి చకచకా పనులు చేస్తోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 4జీ సేవలను అందుబాటులోకి తీసుకున్న ఈ సంస్థ మూడు నెలలపాటు ఫీల్డ్ టెస్టు కూడా నిర్వహించింది. ఇది కాస్తా విజయవంతం కావడంతో ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది.

ఇకపై రోజుకు 200 4జీ మొబైల్ టవర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడే 135 సైట్లను మోహరించిన బీఎస్ఎన్ఎల్ త్వరలోనే మిగతా వాటి పనులు కూడా ప్రారంభించబోతోంది. బీఎస్ఎన్ఎల్ 4జీ పరికరాలను 5జీకి కూడా పెంచుకోవచ్చు. ఇందుకు సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ చేస్తే సరిపోతుందని టెలికం మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల తెలిపారు.

అయితే, బీఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేయబోయే లక్ష 4జీ సైట్స్‌కు సంబంధించి సాధికార మంత్రుల బృందం (EGoM) నుంచి టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) అనుమతి తీసుకోవాల్సి ఉంది. మంత్రుల బృందం నుంచి అనుమతి లభిస్తే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)కు కొనుగోలు ఆర్డర్‌ను బీఎస్ఎన్ఎల్ విడుదల చేస్తుంది.

2023-24లో కనుక పూర్తిస్థాయిలో 4జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తే తమ ఆదాయం 20 శాతం పెరుగుతుందని బీఎస్ఎన్ఎల్ ఆశలు పెట్టుకుంది. 4జీ టవర్ల ఏర్పాటు, 5జీ అప్‌గ్రేడ్ సాంకేతికత కోసం కేంద్ర ప్రభుత్వం 2023-24 బడ్జెట్‌లో రూ. 52,937 కోట్లు కేటాయించింది. 2019లో రూ. 69 వేల కోట్ల రెస్క్యూ ప్లాన్ తర్వాత బీఎస్ఎన్‌ఎల్‌, ఎంటీఎన్ఎల్‌‌కు రూ. 1.64 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ గత జులైలో ఆమోదం తెలిపింది.

Updated Date - 2023-04-23T17:01:05+05:30 IST