Share News

ఆన్‌లైన్‌ చెల్లింపుల మోసాలకు చెక్‌!

ABN , First Publish Date - 2023-11-29T01:49:17+05:30 IST

దేశంలో డిజిటల్‌ చెల్లింపుల మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు...

ఆన్‌లైన్‌ చెల్లింపుల మోసాలకు చెక్‌!

  • ఇద్దరు వ్యక్తుల మధ్య తొలి లావాదేవీ పూర్తయ్యేందుకు 4 గంటల సమయం

  • రూ.2,000కు పైగా ట్రాన్సాక్షన్స్‌కు వర్తింపు

న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్‌ చెల్లింపుల మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇద్దరు వ్యక్తుల మధ్య తొలిసారిగా జరిగే రూ.2,000కు పైగా విలువైన ఆన్‌లైన్‌ లావాదేవీ పూర్తయ్యేందుకు కనీస వ్యవధిని 4 గంటలుగా నిర్దేశించాలన్న యోచనలో ఉన్నట్లు ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. ఏదైనా తప్పు దొర్లినట్లు అన్పిస్తే, ఆ నాలుగు గంటల్లో లావాదేవీని రద్దు చేసుకోవడం లేదా సవరించుకునే వీలుంటుందని వారన్నారు. యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫే్‌స (యూపీఐ)తో పాటు ఇతర డిజిటల్‌ చెల్లింపుల విధానాలైన ఇమ్మీడియేట్‌ పేమెంట్స్‌ సర్వీసె్‌స (ఐఎంపీఎస్‌), రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ (ఆర్‌టీజీఎస్‌) లావాదేవీలకు సైతం ఈ నిబంధనను వర్తింపజేయాలని కేంద్రం భావిస్తోంది.

ప్రస్తుతం యూపీఐ ఐడీని క్రియేట్‌ చేసుకున్న యూజర్‌కు తొలి 24 గంటల్లో గరిష్ఠంగా రూ.5,000 మాత్రమే బదిలీ చేయగలిగే వీలుంటుంది. నెఫ్ట్‌ విషయంలో ఈ పరిమితి రూ.50,000గా ఉంది. ఆర్‌బీఐ నివేదిక ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో రూ.30,252 కోట్ల విలువైన చెల్లింపుల లావాదేవీ మోసాలు నమోదయ్యాయి. అందులో 49 శాతానికి సమానమైన 6,659 కేసులు డిజిటల్‌ చెల్లింపుల విభాగంలోనే నమోదయ్యాయి.

Updated Date - 2023-11-29T01:49:19+05:30 IST