Kotak Mahindra Bank: కోటక్ సొంతమైన సొనాటా ఫైనాన్స్.. డీల్ విలువ రూ. 537 కోట్లు!

ABN , First Publish Date - 2023-02-11T21:28:12+05:30 IST

సొనాటా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (SFPL)ను కోటక్ మహీంద్రా సొంతం

 Kotak Mahindra Bank: కోటక్ సొంతమైన సొనాటా ఫైనాన్స్.. డీల్ విలువ రూ. 537 కోట్లు!

ముంబై: సొనాటా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (SFPL)ను కోటక్ మహీంద్రా సొంతం చేసుకుంది. అందులోని 100 శాతం ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసేందుకు బైండింగ్ షేర్ కొనుగోలు ఒప్పందం అమలు చేస్తున్నట్టు కోటక్ మహీంద్రా బ్యాంక్ (KMBL) ప్రకటించింది. సొనాటా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఓ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. ఇప్పటికే ఉన్న వాటాదారుల నుంచి ఎన్‌బీఎఫ్‌సీ-ఎంఎఫ్ఐ (NBFC-MFI)గా వర్గీకరించబడింది. భారతీయ రిజర్వు బ్యాంకు సహా ఇతర నియంత్రణ సంస్థలు, ఇతర ఆమోదాలకు లోబడే ఈ ఒప్పందం ఉంటుందని కోటక్ బ్యాంకు తెలిపింది.

దాదాపు రూ. 537 కోట్ల మొత్తం నగదు పరిగణనతో ఈ కొనుగోలు జరిగింది. ఈ నేపథ్యంలో నియంత్రణ సంస్థలు, ఇతర అనుమతులు పొందిన తర్వాత ఎస్ఎఫ్‌పీఎల్ పూర్తిగా బ్యాంకుకు అనుబంధంగా మారుతుంది. ఆర్థికంగా బలహీనమైన, వెనుకబడిన కుటుంబాలకు వాణిజ్యపరమైన లాభదాయక రీతిలో సొనాటా ఫైనాన్స్ సేవలు అందిస్తూ, ఆర్థిక చేకూర్పు విభాగంలో బ్ాయంకును ఒక ముఖ్యమైన సంస్థగా మార్చేందుకు బలమైన వేదిక అందిస్తుంది.

31 డిసెంబరు 2022 నాటికి సొనాటా రూ. 1,903 కోట్ల అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ (AUM)ని కలిగి ఉంది. 10 రాష్ట్రాల్లోని 502 బ్రాంచ్‌లతో బ్రాంచ్ నెట్‌వర్క్ ద్వారా 9 లక్షల కస్టమర్ బేస్‌కు సేవలు అందిస్తోంది. దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో గ్రామీణ, సెమీ అర్బన్ మార్కెట్లలో తన కార్యకలాపాలను పెంచేందుకు ఈ లావాదేవీ బ్యాంకుకు అవకాశాన్ని ఇస్తుంది. ఎస్ఎఫ్‌పీఎల్‌కు దాదాపు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. కస్టమర్‌లపై లోతైన అవగాహన కలిగిన మైక్రోఫైనాన్స్ సంస్థ ఇది.

బ్యాంక్ సొంత పంపిణీ ఉనికి, సాంకేతికతతో పాటు ఎదుగుదల, సామర్థ్యాల వెలికితీతల కారణంగా కొనుగోలు ప్రారంభం నుంచి సంస్థ విలువను పెంచుతుందని భావిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న బ్యాంకింగ్ అవసరాలకు సరిపోయేలా ఎస్‌ఎఫ్‌పీఎల్ కస్టమర్ బేస్‌కు విస్తృతమైన బ్యాంకింగ్ ఉత్పత్తులను అందించడానికి నెట్‌వర్క్‌‌ను కూడా ప్రభావితం చేస్తుంది.

ఈ సందర్భంగా కోటక్ మహీంద్రా బ్యాంకు ప్రెసిడెంట్ (కమర్షియల్ బ్యాంకింగ్) మనీష్ కొఠారి మాట్లాడుతూ.. సొనాటా ఒక మైక్రో ఫైనాన్స్ సంస్థ అని అన్నారు. తమ విస్తృత దృష్టి, వ్యూహానాకి అనుగుణంగానే ఈ కొనుగోలు జరిగినట్టు చెప్పారు. 2017లో తాము బీఎస్ఎస్ మైక్రో ఫైనాన్స్ సంస్థను విజయవంతంగా కొనుగోలు చేసినట్టు గుర్తు చేశారు. అప్పటి నుంచి 1.3 మిలియన్ల రుణగ్రహీతలకు రూ.5,300 కోట్లకు పైగా అడ్వాన్స్‌‌లతో ఆర్థిక చేరిక విభాగంలో తమ ఉనికిని ఏకీకృతం చేయగలిగినట్టు వివరించారు.

ఎస్‌ఎఫ్‌పీఎల్ సీఈవో, ఎండీ అనూప్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. కోటక్ మహీంద్రా గ్రూప్ వంటి విశ్వసనీయ, అనుభవజ్ఞుల చేతుల్లోకి సొనాటా చేరడం సంతోషంగా ఉందన్నారు. బ్యాంకింగ్ సేవలు అంతగా పొందలేకపోతున్న కస్టమర్ విభాగానికి ఫైనాన్సింగ్ అందించే లక్ష్యంతో సొనాటాను ప్రారంభించినట్టు చెప్పారు. ఇప్పుడు పెద్ద బ్యాంక్ వేదికపై మరింత స్థిరమైన పద్ధతిలో ఈ సేవలు అందుతాయని విశ్వసిస్తున్నట్టు చెప్పారు.

తాజా ఒప్పందం సొనాటా కస్టమర్‌లు, ఉద్యోగులు, ఇతర వాటాదారులకు అపారమైన ప్రయోజనాలను అందిస్తుందని, సొనాటా ప్రస్తుత కస్టమర్ కుటుంబాలు కోటక్ బ్యాంక్ పూర్తిస్థాయి ఉత్పత్తులు, ఉత్తమమైన డిజిటల్ సేవల నుంచి ప్రయోజనం పొందగలుగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కంపెనీని ఈ దశకు చేర్చడంలో సహకరించిన పెట్టుబడిదారులు, వినియోదారులు, ఉద్యోగులు, ఇతర వాటాదారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నట్టు తెలిపారు.

Updated Date - 2023-02-11T21:28:15+05:30 IST