Tata Motors: టాటా మోటార్స్ నుంచి బీఎస్ 6 ఫేజ్ 2 ట్రాన్సిషన్ వాహనాలు
ABN , First Publish Date - 2023-02-11T19:23:34+05:30 IST
టాటా మోటార్స్(Tata Motors) శనివారం నిబంధనలకు అనుగుణంగా
న్యూఢిల్లీ: టాటా మోటార్స్(Tata Motors) శనివారం నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన ఆర్డీఈ (RDE), (E20) ఇంజిన్లతో కూడిన కొత్త బీఎస్6 ఫేజ్ 2(BS6 Phase 2) శ్రేణి ప్యాసింజర్ శ్రేణి వాహనాలను విడుదల చేసింది. కంపెనీ తన మొత్తం పోర్ట్ఫోలియోను తాజా ఉద్గారాల నిబంధనలకు అనుగుణంగా పెట్రోలు, డీజిల్, సీఎన్జీ వాహనాలను అప్గ్రేడ్ చేసింది. అలాగే, ప్రయాణికుల భద్రత, సౌకర్యార్థం కొత్త ఫీచర్లను జోడించింది.
ప్రామాణిక వారెంటీని రెండేళ్లు/ మూడేళ్లలో 75 వేల కిలోమీటర్లు/ లక్ష కిలోమీటర్లకు పొడిగించింది. స్లో స్పీడ్స్తో మరింత సాఫీ డ్రైవింగ్ అనుభవం కోసం అట్రోజ్, పంచ్ కార్లలో ఐడిల్ స్టాప్ స్టార్ట్ ఫీచర్లను జోడించింది. ఈ కొత్త ఫీచర్ అన్ని వేరియంట్లలోనూ ఉంటుంది.
అలాగే, అల్ట్రోజ్(Altroz), నెక్సాన్(Nexon) రెండింటికీ రెవోటార్క్ డీజిల్ ఇంజిన్లను అప్డేట్ చేసింది. అదనంగా నెక్సాన్ డీజిల్ ఇంజిన్ మరింత మెరుగైన పనితీరు అందించేందుకు రీట్యూన్ చేసినట్టు కంపెనీ పేర్కొంది. కొత్త ఆర్డీఈ ఇంజిన్లు ఇంధనాన్ని పొదుపు చేసేలా ట్యూన్ చేసినట్టు కంపెనీ తెలిపింది.
ఒత్తిడి లేని డ్రైవింగ్ కోసం టియాగో(Tiago), టిగోర్ కార్లకు టాటా మోటార్స్ టీపీఎంఎస్ సేఫ్టీ ఫీచర్లను జోడించింది. అంతేకాకుండా కొత్త శ్రేణి కార్లను తక్కువ ఎన్వీహెచ్ స్థాయులతో మెరుగుపరిచినట్టు కంపెనీ వివరించింది.
ఈ సందర్భంగా టాటా మోటార్స్(tata Motors) ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్, మార్కెటింగ్ అండ్ కస్టమర్ కేర్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ అంబా మాట్లాడుతూ.. వాహన కాలుష్యాన్ని తగ్గించాలన్న ప్రభుత్వం మిషన్లో టాటా మోటార్స్ ఎల్లప్పుడు క్రియాశీల భాగస్వామిగా ఉంటుందని అన్నారు. ఉద్గారాలను అదుపులో ఉంచడమే కాకుండా అసమానమైన డ్రైవింగ్, కారు యాజమాన్య అనుభవాన్ని మెరుగుపరిచే సాంకేతికతలను నిరంతరం ఆవిష్కరిస్తూ, పరిచయం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఆలోచనా ప్రక్రియకు అనుగుణంగా తాము తమ కార్లను కొత్త ఉద్గార ప్రమాణాలతో మాత్రమే కాకుండా, అత్యాధునిక భద్రత, డ్రైవబిలిటీ, అప్గ్రేడ్ చేసిన ఫీచర్లు, మెరుగైన రైడ్ అనుభవం, అత్యంత ముఖ్యమైన అంశాలతో కూడిన మెరుగైన పోర్ట్ఫోలియోతో అందిస్తున్నట్టు వివరించారు. ఈ రిఫ్రెష్డ్ శ్రేణి తమ మార్కెట్ వాటాను విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.