Share News

Education: విద్యార్థులకు కేంద్రం శుభవార్త..! ఉన్నత విద్యలో మార్పులివే!

ABN , First Publish Date - 2023-11-17T12:08:18+05:30 IST

ఐదేళ్ల యూజీ-పీజీ ఇంటిగ్రేటెడ్‌ కోర్సులోనూ క్రెడిట్స్‌ ఫ్రేమ్‌వర్క్స్‌ను పెంచాలని తాజా ముసాయిదా ప్రతిపాదించింది.

Education: విద్యార్థులకు కేంద్రం శుభవార్త..! ఉన్నత విద్యలో మార్పులివే!

  • నాలుగేళ్ల డిగ్రీ ఉంటే ఏడాదిలో పీజీ

  • విద్యార్థులు నచ్చిన విభాగానికి మారొచ్చు

  • ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌, హైబ్రీడ్‌ దూరవిద్య విధానాన్ని ఎంచుకోవచ్చు

  • రెండేళ్ల పీజీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ యథాతథం

  • కొత్త విద్యావిధానం మేరకు యూజీసీ నిబంధనల ముసాయిదా సిద్ధం

న్యూఢిల్లీ, నవంబరు 16: ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు శుభవార్త..! కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన నూతన జాతీయ విద్యావిధానం(ఎన్‌ఈపీ) మేరకు పీజీ కోర్సుల కాలపరిమితి, క్రెడిట్స్‌, ఎంపిక విధానాలు, విద్యార్థికి ఇష్టమైన సబ్జెక్టు, నచ్చిన మోడ్‌ను ఎంచుకునే వెసులుబాట్లను కల్పిస్తూ.. యూనివర్సిటీస్‌ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) కొత్త నిబంధనల ముసాయిదాను సిద్ధం చేసింది. త్వరలో ఈ ముసాయిదాను పబ్లిక్‌ డొమైన్‌లో పెడతారు. తాజా ముసాయిదాలో పీజీ కోర్సుల కోసం పాఠ్యాంశాలు, క్రెడిట్‌ ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేస్తూ.. విద్యార్థులు ఇకపై పీజీని పూర్తి చేసేందుకు యూజీసీ మూడు విధానాలను ప్రతిపాదించింది. అవి.. ఏడాది కాలపరిమితితో పోస్టు గ్రాడ్యుయేషన్‌, ఇప్పుడున్న రెండేళ్ల పీజీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ యూజీ-పీజీ కోర్సులు. అండర్‌ గ్రాడ్యుయేషన్‌(యూజీ- బ్యాచిలర్‌ డిగ్రీ)లో నాలుగేళ్ల కోర్సులను చదివిన విద్యార్థులు, పరిశోధనను పూర్తిచేసి ఉంటే.. ఇకపై ఏడాదిలో పోస్టు గ్రాడ్యుయేషన్‌(పీజీ)ని పూర్తిచేయొచ్చు.

ఒకవేళ పరిశోధన లేనిపక్షంలో.. ప్రొఫెషనల్‌గా డిమాండ్‌ ఉన్న కృత్రిమ మేధ(ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌(ఎంఎల్‌) వంటి సబ్జెక్టులను పూర్తి చేసినా.. అలాంటి వారు ఒక సంవత్సరంలో పీజీని పూర్తి చేయొచ్చు. అంతేకాదు..! పీజీలో నచ్చిన కోర్సును ఎంచుకోవచ్చు. అది ఆన్‌లైన్‌ మోడ్‌లోనా? లేక ఆఫ్‌లైన్‌/దూరవిద్య ద్వారానా? లేదంటే ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ మోడ్‌లను కలగలిపిన హైబ్రీడ్‌ విధానమా? అన్నదాన్ని విద్యార్థులు ఎంచుకోవచ్చు. దీంతోపాటు.. రెండేళ్ల పీజీ విధానం కొనసాగుతుంది. ఐదేళ్ల యూజీ-పీజీ ఇంటిగ్రేటెడ్‌ కోర్సులోనూ క్రెడిట్స్‌ ఫ్రేమ్‌వర్క్స్‌ను పెంచాలని తాజా ముసాయిదా ప్రతిపాదించింది.

పీజీ డిప్లొమా..: ఇప్పుడున్న రెండేళ్ల పీజీని ఎంచుకున్న విద్యార్థులు ఒక సంవత్సరం విద్యను పూర్తిచేశాక నిష్క్రమించవచ్చు. అలాంటి వారికి పీజీ డిప్లొమా సర్టిఫికెట్‌ను అందజేయాలని తాజా ముసాయిదా ప్రతిపాదించింది.

ప్రతిభకు పెద్దపీట: యూజీ పూర్తిచేసిన విద్యార్థులు ఇప్పటి వరకు రెగ్యులర్‌ పద్ధతిలో పీజీలో చేరేందుకు ప్రవేశపరీక్షలను అధిగమించాల్సిందే..! తాజా ముసాయిదాలో.. యూజీలో ప్రతిభ ఆధారంగా నేరుగా పీజీలో సీటు సంపాదించే వెసులుబాటును ప్రతిపాదించారు. దాంతోపాటు ప్రవేశ పరీక్షలు సమాంతరంగా కొనసాగుతాయి. ఇక యూజీలో సబ్జెక్టుతో సంబంధం లేకుండా.. పీజీలో నచ్చిన సబ్జెక్టును ఎంచుకునేలా జాతీయ లేదా విశ్వవిద్యాలయ స్థాయిలో ప్రవేశ పరీక్షలకు ప్రతిపాదనలు చేశారు.

ఇంజనీరింగ్‌లో..: స్టెమ్‌ సబ్జెక్టుల్లో నాలుగేళ్ల డిగ్రీ.. లేదా మూడేళ్ల డిగ్రీతోపాటు రెండేళ్ల పీజీ.. లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులను పూర్తి చేసినవారు ఎంఈ, ఎంటెక్‌లో చేరేందుకు అర్హులని తాజా ముసాయిదా ప్రతిపాదిస్తోంది.

Updated Date - 2023-11-17T12:08:22+05:30 IST