Australia: మరోసారి రెచ్చిపోయిన ఖలిస్థాన్ అనుకూలవాదులు

ABN , First Publish Date - 2023-03-04T17:50:09+05:30 IST

హిందువులకు వ్యతిరేకంగా పెరుగుతున్న విద్వేష నేరాల జాబితా పెరుగుతోంది. ఇందులో భాగంగా ప్రత్యేక ఖలిస్థాన్..

Australia: మరోసారి రెచ్చిపోయిన ఖలిస్థాన్ అనుకూలవాదులు

మెల్‌బోర్న్: హిందువులకు వ్యతిరేకంగా పెరుగుతున్న విద్వేష నేరాల (Hate Crimes) జాబితా పెరుగుతోంది. ఇందులో భాగంగా ప్రత్యేక ఖలిస్థాన్ (Khalistan) అనుకూలవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆస్ట్రేలియా (Australia)లోని బ్రిస్బేన్ (Brisbane)లో ఓ హిందూ ఆలయాన్ని తాజాగా లక్ష్యంగా చేసుకున్నారు. ఆలయ ప్రహరీగోడను ధ్వంసం చేయడంతో పాటు గోడలపై భారత వ్యతిరేక రాతలు రాశారు. ఖలిస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు రాశారు. ఆలయ అర్చకులు, భక్తులు శనివారం ఉదయం శ్రీ లక్ష్మీనారాయణ అలయానికి రాగానే ఆలయంపై ప్రహరీ గోడలపై రాతలు, జరిగిన విధ్వంసాన్ని గుర్తించినట్టు ఆలయ అధ్యక్షుడు సత్యేందర్ శుక్లా తెలిపారు. ''సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) చాలా స్పష్టంగా ఆస్ట్రేలియా హిందువులను భయభ్రాంతులను చేసేందుకు జరుపుతున్న విద్వేష నేరాల క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భయపెట్టడం, బెదరించమే లక్ష్యంగా ఇలాంటి చర్యలకు దిగుతోంది''అని హిందూ మానవహక్కుల డైరెక్టర్ సారా గేట్స్ చెప్పారు.

వరుస ఘటనలు...

ఖలిస్థాన్ అనుకూల వాదులు ఇలాంటి చర్యలకు పాల్పడటం ఇదే తొలిసారి కాదు. గత ఫిబ్రవరిలో కొందరు ఖలిస్థాన్ అనుకూల వాదులు భారత కాన్సులేట్ కార్యాలయం గోడకు ఖలిస్థాన్ జెండా అతికించారు. క్వీన్‌లాండ్ పోలీసుల సమక్షంలో ఆ తర్వాత జెండాను అక్కడి నుంచి తొలగించారు. ఇటీవల మూడు హిందూ దేవాలయాల గోడలపైనా ఖలిస్థాన్ జెండాలు అతికించారు. జనవరి 23న మెల్‌బోర్డ్ నగరంలోని అల్బర్డ్ పార్క్ దగ్గర్లోని ఇస్కాన్ ఆలయం గోడలను ధ్వంసం చేశారు. దీనికి ముందు జనవరి 16న విక్టోరియాలోని శ్రీ శివవిష్ణు దేవాలయంలోనూ ఇదే తరహా చర్యలకు పాల్పడ్డారు. జనవరి 12న మెల్‌బోర్న్‌లోని స్వామినారాయణ దేవాలయం గోడలపై ఇండియాకు వ్యతిరేకంగా నినాదాలు రాశారు. గత నెలలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఆస్ట్రేలియా పర్యటనలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆస్ట్రేలియాలో భారతీయులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని కోరారు.

Updated Date - 2023-03-04T17:51:57+05:30 IST