G-20 Venue Delhi : జీ 20.. ఢిల్లీ రెడీ!

ABN , First Publish Date - 2023-08-30T04:28:03+05:30 IST

ప్రపంచ అధినేతలను స్వాగతించేందుకు జీ-20 వేదిక అయిన దేశ రాజధాని ఢిల్లీ సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. అగ్రదేశాల నేతల కోసం హోటళ్లన్నీ బుక్‌ ,..

G-20 Venue Delhi : జీ 20.. ఢిల్లీ రెడీ!

జిగేల్‌మనేలా హస్తినలో ఏర్పాట్లు..

హోటళ్లన్నీ ప్యాక్‌

అగ్రనేతలు,అతిథుల కోసం బుకింగ్‌

ఐటీసీ మౌర్యాలో జో బైడెన్‌కు బస

జీ జిన్‌పింగ్‌ కోసం తాజ్‌ ప్యాలెస్‌

రిషి సునాక్‌కోసం షాంగ్రీ లా బుక్‌

సుందరంగా జీ20 స్మారక పార్కు

దక్షిణ ఢిల్లీ గ్రేటర్‌ కైలాశ్‌ ప్రాంతంలోని మునిసిపల్‌ పార్కులో భారీ మెటాలిక్‌ జీ-20 లోగోను ఏర్పాటు చేశారు. పార్కులోని పచ్చని తోటల మధ్య సభ్యదేశాల జెండాలను సుందరంగా అలంకరించిన స్తంభాలకు ఏర్పాటు చేశారు. జెండా స్తంభాలను కాంక్రీటుతో నిర్మించి, చెక్కతో మెరుగులు దిద్ది, గోతిక్‌ డిజైన్‌తో అలంకరించారు. జీ-20 లోగో వెనుక నీలం రంగులో భారీ బోర్డుపై ప్రపంచ మ్యాప్‌ ఆలంకరించారు. లోగో కింద ‘భారత్‌ 2023 ఇండియా’ అని ముద్రించారు.

న్యూఢిల్లీ, ఆగస్టు 29: ప్రపంచ అధినేతలను స్వాగతించేందుకు జీ-20 వేదిక అయిన దేశ రాజధాని ఢిల్లీ సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. అగ్రదేశాల నేతల కోసం హోటళ్లన్నీ బుక్‌ అయిపోయాయి. సాధారణంగా ఇది హోటళ్లకు అన్‌సీజన్‌. అయితే, జీ-20 మహా సంరంభంతో ఢిల్లీ, దాని పక్కల ఉన్న హోటళ్లకు మహర్దశ పట్టింది. అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కోసం ఐటీసీ మౌర్యా షెరటన్‌లోని ప్రెసిడెంటల్‌ సూట్‌, ఆయన పరివారం కోసం ఆ హో టల్‌లో 400 గదులు ఇప్పటికే బుక్‌ అయిపోయాయి. చైనా అగ్రనేత జీ జిన్‌పింగ్‌ కోసం తాజ్‌ ప్యాలె్‌సను సిద్ధం చేశారు. ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి అగ్రదేశాలకు చెందిన ప్రత్యేక బృందాలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నాయి. జీ-20లో భాగస్వాములైన మిగతా దేశాల నేతలు, ప్రతినిధుల కోసం ఢిల్లీ - ఎన్‌సీఆర్‌ (దేశ రాజధాని ప్రాదేశిక ప్రాంతం) పరిధిలోని హోటళ్లన్నీ బుక్‌ అయిపోయాయి. సెప్టెంబరు 9, 10 తేదీల్లో జరిగే జీ-20 శిఖరాగ్ర సమావేశాలకు ఈసారి భారత్‌ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. దీనికోసం ఢిల్లీ పరిధిలో హోటల్‌ అశోకా, హోటల్‌ ఒబెరాయ్‌ సహా 20కిపైగా స్టార్‌ హోటళ్లు సిద్ధమయ్యాయి. ఇక.. ఎన్‌సీఆర్‌ పరిధిలో ప్రధానంగా గురుగ్రామ్‌, నోయిడా, సూరజ్‌కుండ్‌ల్లో వివంత, ఒబెరాయ్‌, క్రౌన్‌ ప్లాజా సహా ఏడు అత్యంత ఖరీదైన హోటళ్లను బుక్‌ చేశారు.

ఎవరెక్కడ..?

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ బస చేసే ఐటీసీ మౌర్యాలోని ప్రతి అంతస్థునూ అమెరికా రహస్య దళాలకు చెందిన కమాండోలు కాపు కాస్తారు. హోటల్‌లోని 14వ అంతస్థులో బైడెన్‌ బస చేస్తారు. బ్రిట న్‌ ప్రధాని రిషి సునాక్‌ కోసం షాంగ్రీ-లా హోటల్‌ సిద్ధం చేశారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యూయల్‌ మక్రోన్‌ క్లారిడ్జ్స్‌ హోటల్‌లో బస చేస్తారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనేస్‌ కోసం ఇంపీరియల్‌ హోటల్‌ను ముస్తాబు చేశారు. టర్కిష్‌ ప్రతినిధులకు ఒబెరాయ్‌ హోటల్‌, మారిషస్‌, నెదర్లాండ్‌, నైజీరియా, స్పెయిన్‌ తదితర దేశాల ప్రతినిధులకు లే మెరిడియన్‌ను కేటాయించారు.

హిట్‌ టీమ్‌లతో భద్రత

అతి క్లిష్టమైన సవాళ్లను సైతం అతి సునాయాసంగా అధిగమించే హిట్‌ టీమ్‌లను రంగంలోకి దించుతున్నారు. ఢిల్లీలో బస చేసే అగ్రనేతల హోట ళ్లు, జీ-20 సదస్సు జరిగే ప్రాంగణాల లోపలి భాగాలు ఈ టీమ్‌ల నిఘాలో ఉంటాయి. ఎన్నికల ఏడాదిలో జీ-20కి సారథ్యం వహించే అవకాశం రావడంతో, సదస్సు నిర్వహణను మోదీ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో హిట్‌ టీమ్‌లను దించుతున్నారు. నేషనల్‌ సెక్యూరిటీ గార్డులు, ఢిల్లీ పోలీసుల నుంచి చురుకైన సిబ్బందిని ఎంచుకుని.. వారితో ఏర్పాటుచేసినవే హిట్‌ టీమ్‌లు. ‘.కాల్చివేత’ అధికారాలు కూడా ఈ టీమ్‌లకు ఇచ్చేశారు. అలాగే.. హోటళ్ల బయట, ప్రాంగణాల ఆవరణలో ఎదురయ్యే భద్రతాసవాళ్లను ఎదుర్కొనేందుకు స్వాట్‌ బృందాలను సిద్ధం చేశారు. మరోవైపు మన భద్రతా దళాలు, అటు ఆయా దేశాల రక్షణ బృందాలు పెద్దఎత్తున ఢిల్లీలో మోహరించనున్నాయి. కేంద్ర పారా మిలిటరీ, నేషనల్‌ సెక్యూరిటీ గార్డులు, ఢిల్లీ పోలీస్‌ బృందాల భద్రతా వలయంలోకి ఢిల్లీ దాదాపుగా వెళ్లిపోయింది. ఒక్కో టీమ్‌కు 1000 మంది చొప్పున సీఆర్పీఎ్‌ఫకు చెందిన యాభై టీమ్‌లు పూర్తిగా జీ-20 ప్రతినిధుల రక్షణ బాధ్యతల్లోనే ఉంటాయి. విదేశీ భద్రతా సంస్థలకు చెందిన కమాండోలు సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ఢిల్లీకి చేరుకుంటారు. బైడెన్‌ సెక్యూరిటీ టీమ్‌ మూడు రోజుల ముందు ఢిల్లీ చేరుకోనుంది. భద్రతా ఏర్పాట్ల గురించి కేంద్ర హోం శాఖ ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. మరోవైపు..

జీ20 సదస్సుకు వచ్చే విదేశీ అతిథులకు కోతుల బెడద లేకుండా ఎన్‌ఎండీసీ(న్యూఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌), అటవీ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నాయి. కొండముచ్చుల్లా శబ్దాలు చేస్తూ కోతులను తరిమేసేందుకు శిక్షణ పొందిన 30-40 మందిని నియమిస్తున్నట్టు ఎన్‌ఎండీసీ వైస్‌ చైర్మన్‌ సతీశ్‌ ఉపాధ్యాయ్‌ చెప్పారు.

Updated Date - 2023-08-30T04:28:03+05:30 IST