MI vs RR : సెంచరీతో చెడుగుడు ఆడేసిన జైస్వాల్.. రాజస్థాన్ భారీ స్కోరు

ABN , First Publish Date - 2023-04-30T21:54:03+05:30 IST

యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) చెడుగుడు ఆడేశాడు. వీర ఉతుకుడుతో ముంబై (MI) బౌలర్ల భరతం

MI vs RR : సెంచరీతో చెడుగుడు ఆడేసిన జైస్వాల్.. రాజస్థాన్ భారీ స్కోరు

ముంబై: యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) చెడుగుడు ఆడేశాడు. వీర ఉతుకుడుతో ముంబై (MI) బౌలర్ల భరతం పట్టాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ (Rajasthan Royals) 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఆకాశమే హద్దుగా చెలరేగిన జైస్వాల్ ఐపీఎల్ 1000వ మ్యాచ్‌లో రికార్డుల వర్షం కురిపించాడు. 53 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ బాదిన జైస్వాల్ ఆ తర్వాత మరో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. మొత్తంగా 62 బంతులు ఆడిన జైస్వాల్ 124 పరుగులు చేసి చివరి ఓవర్‌లో అవుటయ్యాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. అలాగే, ఐపీఎల్‌లో సెంచరీ బాదిన నాలుగో అతి పిన్న వయస్కుడు. 21 సంవత్సరాల, 123 రోజుల వయసులో జైస్వాల్ ఐపీఎల్ సెంచరీ నమోదు చేశాడు.

జైస్వాల్ క్రీజులో ఉన్నంత సేపు స్టేడియం మోతెక్కి పోయింది. ముంబై సారథి మార్చిమార్చి బౌలర్లను ప్రయోగించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. జైస్వాల్ దెబ్బకు మెరిడిత్ 4 ఓవర్లలో 51 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాడు.

రాజస్థాన్ బ్యాటర్లలో జోస్ బట్లర్ 18, కెప్టెన్ సంజు శాంసన్ 14, హోల్డర్ 11 పరుగులు చేశారు. పడిక్కల్, హెట్మెయిర్, జురెల్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ముంబై బౌలర్లలో అర్షద్ ఖాన్‌కు మూడు, పీయూష్ చావ్లాకు రెండు వికెట్లు దక్కాయి.

Updated Date - 2023-04-30T21:54:03+05:30 IST