IPL 2023: దంచికొట్టిన కరన్, జితేశ్ శర్మ.. పంజాబ్ భారీ స్కోరు

ABN , First Publish Date - 2023-04-22T21:38:06+05:30 IST

పంజాబ్ బ్యాటర్లు శామ్ కరన్(Sam Curran), హర్‌ప్రీత్ సింగ్ భాటియా(Harpreet Singh Bhatia), జితేశ్

IPL 2023: దంచికొట్టిన కరన్, జితేశ్ శర్మ.. పంజాబ్ భారీ స్కోరు

ముంబై: పంజాబ్ బ్యాటర్లు శామ్ కరన్(Sam Curran), హర్‌ప్రీత్ సింగ్ భాటియా(Harpreet Singh Bhatia), జితేశ్ శర్మ(Jitesh Sharma) చెలరేగిపోయారు. ముంబై(MI)తో ఇక్కడి వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో బంతిని ఊచకోత కోశారు. సిక్సర్లు, ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఫలితంగా 20 ఓవర్లలో పంజాబ్ 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు భారీ స్కోరు సాధించింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 18 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. అయితే, ఆ తర్వాత మాత్రం నిలదొక్కుకుంది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (26), అథర్వ టైడే (29) పరవాలేదనిపించినా ఆ తర్వాత వచ్చిన హర్‌ప్రీత్ సింగ్ భాటియా, శామ్ కరన్ ముంబై బౌలర్లను బెంబేలెత్తించారు. ఫోర్లు సిక్సర్లతో చెడుగుడు ఆడుకున్నారు.

భాటియా 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేయగా, శామ్ కరన్ 29 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. ఇక, జితేశ్ శర్మ అయితే శివాలెత్తిపోయాడు. ఆడింది ఏడు బంతులే అయినా అందులో నాలుగింటిని స్టాండ్స్‌లోకి తరలించి మొత్తంగా 25 పరుగులు పిండుకున్నాడు. ఫలితంగా చివరి ఐదు ఓవర్లలో పంజాబ్ ఏకంగా 98 పరుగులు పిండుకుంది. దీంతో 214 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది. ముంబై బౌలర్లలో కామెన్ గ్రీన్, పీయూష్ చావ్లా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

Updated Date - 2023-04-22T21:38:06+05:30 IST