IPL 2023: ఉత్కంఠ పోరులో బెంగళూరుదే విజయం

ABN , First Publish Date - 2023-04-23T19:48:14+05:30 IST

రాజస్థాన్ రాయల్స్‌(RR)తో సొంతగడ్డపై జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ చాలెంజర్స్

IPL 2023: ఉత్కంఠ పోరులో బెంగళూరుదే విజయం

బెంగళూరు: రాజస్థాన్ రాయల్స్‌(RR)తో సొంతగడ్డపై జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 190 పరుగుల లక్ష్య ఛేదనలో బోల్తా పడిన రాజస్థాన్ 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు మాత్రమే చేయగలిగింది. దేవదత్ పడిక్కల్(Devdutt Padikkal) అర్ధ సెంచరీ (52)తో మెరిసినా, యశస్వి జైస్వాల్ 47 పరుగులు చేసినా చివర్లో బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ విజృంభించి మూడు వికెట్లు తీయడంతో రాజస్థాన్ చేతులెత్తేయక తప్పలేదు.

ధృవ్ జురెల్ 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 పరుగులు చేసి అజేయంగా నిలిచినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. ఇక, వెటరన్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ క్రీజులో ఉన్న కొన్ని నిమిషాలు బెంగళూరును భయపెట్టాడు. ఆడింది ఆరు బంతులే అయినా రెండు ఫోర్లు బాది రాజస్థాన్‌లో ఆశలు నింపాడు. అయితే, మరో భారీ షాట్‌కు యత్నించి ప్రభుదేశాయ్‌కు దొరికిపోయాడు. అతడు అవుట్ కావడంతో బెంగళూరు గెలుపు ఖాయమైంది.

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరుకు తొలి బంతికే షాక్ తగిలింది. బౌల్ట్ సంధించిన తొలి ఓవర్ తొలి బంతికే కోహ్లీ వికెట్ల ముందు దొరికిపోయి గోల్డెన్ డక్ అయ్యాడు. అయితే, ఇంపాక్ట్ ప్లేయర్‌గా క్రీజులోకి వచ్చిన డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ రాజస్థాన్ బౌలర్లపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. బౌలర్లను ఉతికి ఆరేశారు.

డుప్లెసిస్ 39 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 62, మ్యాక్స్‌వెల్ 44 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేయడంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. అయితే, వారిద్దరూ అవుటైన తర్వాత వికెట్లు టపటపా రాలిపోయాయి. క్రీజులోకి వచ్చినవారు వచ్చినట్టే వెనుదిరగడంతో 200 దాటుతుందనుకున్న స్కోరు 189 పరుగులకే పరిమితమైంది. మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్ తర్వాత దినేశ్ కార్తీక్ చేసిన 16 పరుగులే మూడో అత్యధికం. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, సందీశ్ శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

Updated Date - 2023-04-23T19:53:15+05:30 IST