Share News

T20 Ind vs Aus : మ్యాక్స్‌ దంచుడు

ABN , First Publish Date - 2023-11-29T05:37:31+05:30 IST

హ్యాట్రిక్‌ విజయాలతో ఐదు టీ20ల సిరీస్‌ను ఖాతాలో వేసుకోవాలనుకున్న యువ భారత్‌ ఆశలపై గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లతో 104 నాటౌట్‌) నీళ్లు జల్లాడు. నరాలు తెగే ఉత్కంఠభరిత మ్యాచ్‌లో.. తనకు మాత్రమే ..

T20 Ind vs Aus : మ్యాక్స్‌ దంచుడు
మ్యాక్స్‌వెల్‌ (104 నాటౌట్‌)

సిరీస్‌లో నిలిచిన ఆసీస్‌

మూడో టీ20లో భారత్‌ ఓటమి

రుతురాజ్‌ సెంచరీ వృధా 47 బంతుల్లోనే అజేయ శతకం

గువాహటి: హ్యాట్రిక్‌ విజయాలతో ఐదు టీ20ల సిరీస్‌ను ఖాతాలో వేసుకోవాలనుకున్న యువ భారత్‌ ఆశలపై గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లతో 104 నాటౌట్‌) నీళ్లు జల్లాడు. నరాలు తెగే ఉత్కంఠభరిత మ్యాచ్‌లో.. తనకు మాత్రమే సాధ్యమయ్యే ఆటతీరుతో చెలరేగి విజయాన్ని లాగేసుకున్నాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ (57 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్సర్లతో 123 నాటౌట్‌) వీరోచిత శతకంతో భారత్‌ భారీ స్కోరు సాధించినప్పటికీ.. మ్యాక్స్‌ బాదుడుకు ఆఖరి బంతి వరకు ఉత్కంఠ తప్పలేదు. భారత్‌ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో 30 పరుగులిచ్చుకున్న అతనే.. తమ ఛేదనలో 6 బంతుల్లో 21 పరుగులను అలవోకగా సాధించి లెక్క సరిచేశాడు. దీంతో ఆసీస్‌ 5 వికెట్లతో గెలిచి సిరీస్‌లో భారత్‌ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా భారత్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 222 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ (29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 39), తిలక్‌ వర్మ (24 బంతుల్లో 4 ఫోర్లతో 31 నాటౌట్‌) రాణించారు. ఛేదనలో ఆసీస్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 225 పరుగులు చేసి గెలిచింది. హెడ్‌ (18 బంతుల్లో 8 ఫోర్లతో 35), మాథ్యూ వేడ్‌ (16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 28 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. బిష్ణోయ్‌కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా మ్యాక్స్‌వెల్‌ నిలిచాడు.

ఆసీస్‌ అదుర్స్‌: భారీ ఛేదనను ఆసీస్‌ ఆత్మవిశ్వాసంతోనే ఆరంభించినా 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడం, రన్‌రేట్‌ కూడా పెరిగిపోవడంతో ఆసీస్‌ గెలవడం కష్టమే అనిపించింది. కానీ సిరీ్‌సలో తొలి మ్యాచ్‌ ఆడిన మ్యాక్స్‌వెల్‌ మాత్రం ఆశలు వదులుకోలేదు. వన్డే వరల్డ్‌క్‌పలో అఫ్ఘాన్‌పై చెలరేగినట్టుగా యువ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో భారత్‌కు భంగపాటు తప్పలేదు. ఓపెనర్‌ హెడ్‌ మొదటి ఓవర్‌లో రెండు, రెండో ఓవర్‌లో నాలుగు ఫోర్లు బాదడంతో 18 బంతుల్లోనే 40 రన్స్‌ చేరాయి. మరో ఓపెనర్‌ హార్డీ (16)తో కలిసి హెడ్‌ తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించాడు. ఈ ఇద్దరూ వరుస ఓవర్లలో పెవిలియన్‌ చేరినా పవర్‌ప్లేలో 67 రన్స్‌ వచ్చాయి. ఇన్‌గ్లి్‌స (10) మళ్లీ విఫలం కాగా.. మ్యాక్స్‌వెల్‌ 8వ ఓవర్‌లో 6,4,6తో 23 రన్స్‌ రాబట్టి స్కోరును గాడినపెట్టాడు. నాలుగో వికెట్‌కు స్టొయినిస్‌ (17)తో 60 పరుగులు జోడించాడు. డేవిడ్‌ను బిష్ణోయ్‌ గోల్డెన్‌ డకౌట్‌ చేసినా.. మ్యాక్స్‌ మాత్రం తన దంచుడు ఆపలేదు. 17వ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదడంతో జట్టు గెలుపు సమీకరణం 18 బంతుల్లో 49గా మారింది. అయితే 18వ ఓవర్‌లో ప్రసిద్ధ్‌ 6 పరుగులే ఇవ్వగా వేడ్‌ క్యాచ్‌ను సూర్య వదిలేశాడు. తర్వాతి ఓవర్‌లో వేడ్‌ చెలరేగి 4,4,6తో 22 రన్స్‌ రాబట్టాడు. ఆఖరి ఓవర్‌లో 21 రన్స్‌ కావాల్సి ఉండగా.. వేడ్‌ 4, మ్యాక్స్‌వెల్‌ 6,4,4,4తో 23 పరుగులు రావడంతో ఆసీస్‌ సంబరాల్లో మునిగింది.

భారత్‌ తరఫున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (123 నాటౌట్‌) సాధించిన రెండో బ్యాటర్‌గా రుతురాజ్‌. గిల్‌ (126 నాటౌట్‌) ముందున్నాడు.

ruturaj-century--big-size.jpg

రుతురాజ్‌ షో: వరుసగా రెండో మ్యాచ్‌లోనూ టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఈసారి మెరుపు ఆరంభం దక్కలేదు. అయితేనేం.. ఓపెనర్‌ రుతురాజ్‌ మధ్య ఓవర్ల నుంచి సాగించిన విజృంభణకు మరోసారి స్కోరు 200+ దాటేసింది. ఆఖరి మూడు ఓవర్లలోనే అతను 52 పరుగులు సాధించడం విశేషం. ఇంత భారీ స్కోరులో పేసర్‌ బెహ్రెన్‌డార్ఫ్‌ (4-1-12-1) మాత్రం ఆకట్టుకున్నాడు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ యశస్వీ (6), ఇషాన్‌ (0) తొలి మూడు ఓవర్లలోనే పెవిలియన్‌ చేరడంతో భారత్‌ కష్టాల్లో పడినట్టనిపించింది. బెహ్రెన్‌డార్ఫ్‌.. రెండో ఓవర్‌లోనే యశస్వీ వికెట్‌ తీశాడు. అయితే రుతురాజ్‌ సహకారంతో మరో ఎండ్‌లో సూర్యకుమార్‌ సహజశైలిలో విజృంభించాడు. ఐదో ఓవర్‌లో అతడి రెండు సిక్సర్లతో పవర్‌ప్లేలో జట్టు 43/2 స్కోరుతో నిలిచింది. అలాగే సంఘా, హార్డీ ఓవర్లలో రెండేసి ఫోర్లతో చకచకా స్కోరును పెంచాడు. కానీ సూర్య దూకుడుకు 11వ ఓవర్‌లో హార్డీ బ్రేక్‌ వేయడంతో మూడో వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత రుతురాజ్‌ గేరు మార్చడంతో పరుగుల వరద పారింది. అటు తిలక్‌ కూడా బ్యాట్‌ ఝుళిపించాడు. ఇద్దరూ బౌండరీలతో విరుచుకుపడడంతో 12వ ఓవర్‌లోనే స్కోరు వంద దాటింది. ఈ జోరుతో రుతురాజ్‌ 32 బంతుల్లోనే వరుసగా రెండో ఫిఫ్టీ పూర్తి చేశాడు. 17 ఓవర్లలో జట్టు స్కోరు 155/3. కానీ తర్వాతి ఓవర్‌లో రుతురాజ్‌ 6,6,4,6తో 25 రన్స్‌.. ఆఖరి ఓవర్‌లోనైతే మ్యాక్స్‌వెల్‌ను బాదేస్తూ 6,4,4,6,6,4తో 30 రన్స్‌ రాబట్టడంతో చివరి మూడు ఓవర్లలో భారత్‌ 67 పరుగులు సాధించింది. ఈక్రమంలోనే రుతురాజ్‌ 52 బంతుల్లోనే కెరీర్‌లో తొలి శతకం అందుకున్నాడు.

టీ20ల్లో ఎక్కువ (68) పరుగులు

ఇచ్చుకున్న భారత బౌలర్‌గా ప్రసిద్ధ్‌ ఛేదనలో ఆఖరి ఓవర్‌లో ఎక్కువ పరుగులు (21) సాధించి గెలిచిన జట్టుగా ఆసీస్‌ వరుసగా మూడు టీ20 మ్యాచుల్లో 200కు పైగా స్కోరు నమోదు చేసిన తొలి జట్టుగా భారత్‌.టీ20ల్లో ఎక్కువ సెంచరీలు (4) బాదిన బ్యాటర్‌గా రోహిత్‌తో సమంగా నిలిచిన మ్యాక్స్‌వెల్‌

స్కోరుబోర్డు

భారత్‌: యశస్వి (సి) వేడ్‌ (బి) బెహ్రెన్‌డార్ఫ్‌ 6, రుతురాజ్‌ (నాటౌట్‌) 123, ఇషాన్‌ (సి) స్టొయినిస్‌ (బి) రిచర్డ్సన్‌ 0, సూర్యకుమార్‌ (సి) వేడ్‌ (బి) హార్డీ 39, తిలక్‌ వర్మ (నాటౌట్‌) 31, ఎక్స్‌ట్రాలు 23, మొత్తం: 20 ఓవర్లలో 3 వికెట్లకు 222; వికెట్ల పతనం: 1-14, 2-24, 3-81; బౌలింగ్‌: రిచర్డ్సన్‌ 3-0-34-1, బెహ్రెన్‌డార్ఫ్‌ 4-1-12-1, ఎలిస్‌ 4-0-36-0, సంఘా 4-0-42-0, హార్డీ 4-0-64-1, మాక్స్‌వెల్‌ 1-0-30-0.

ఆస్ర్టేలియా: హెడ్‌ (సి) బిష్ణోయ్‌ (బి) అవేశ్‌ 35, హార్డీ (సి) ఇషాన్‌ (బి) అర్షదీప్‌ 16, ఇన్‌గ్లిస్‌ (బి) బిష్ణోయ్‌ 10, మాక్స్‌వెల్‌ (నాటౌట్‌) 104, స్టొయినిస్‌ (సి) సూర్య (బి) అక్షర్‌ 17, డేవిడ్‌ (సి) సూర్య (బి) బిష్ణోయ్‌ 0, వేడ్‌ (నాటౌట్‌) 28, ఎక్స్‌ట్రాలు 15; మొత్తం: 20 ఓవర్లలో 5 వికెట్లకు 225; వికెట్ల పతనం: 1-47, 2-66, 3-68, 4-128, 5-134; బౌలింగ్‌: అర్షదీప్‌ 4-0-44-1, ప్రసిద్ధకృష్ణ 4-0-68-0, రవి బిష్ణోయ్‌ 4-0-32-2, అవేశ్‌ ఖాన్‌ 4-0-37-1, అక్షర్‌ పటేల్‌ 4-0-37-1.

Updated Date - 2023-11-29T05:37:39+05:30 IST