Stray Dogs Attack: ఎవరినో కుక్క కరిస్తే.. నేనే కరవమన్నట్లు చేశారు: జీహెచ్ఎంసీ విజయలక్ష్మి

ABN , First Publish Date - 2023-03-06T16:35:55+05:30 IST

అంబర్‌పేట (Amberpet)లో వీధికుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు మృతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలుడి మృతిపై జీహెచ్‌ఎంసీ...

Stray Dogs Attack: ఎవరినో కుక్క కరిస్తే.. నేనే కరవమన్నట్లు చేశారు: జీహెచ్ఎంసీ విజయలక్ష్మి

హైదరాబాద్: అంబర్‌పేట (Amberpet)లో వీధికుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు మృతి తెలుగు రాష్ట్రాల సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే వీధి కుక్కలు ఆకలి వేయడంతోనే ఈ దాడి చేశాయంటూ జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అయితే అపఖ్యాతి పాలైనప్పటికీ ఆమె వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. మరోసారి ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. తనపై విమర్శలపై మేయర్ విజయలక్ష్మి స్పందిస్తూ... హైదరాబాద్‌‌లో (Hyderabad) ఎవరినో కుక్క కరిస్తే.. తానే కరవమన్నట్లు చేశారని అన్నారు. ‘నేనేమైనా కరవమన్నానా’ అనే రీతిలో వ్యాఖ్యానించారు. జీహెచ్‌ఎంసీ (GHMC) మేయర్‌గా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తున్నానని, కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. రాజకీయాల్లో మహిళల గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడతారని, మహిళలు బయటకు వస్తే ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. మహిళలకు రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వాలంటూ ఇప్పటికే సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌‌కు చాలాసార్లు చెప్పానని విజయలక్ష్మి అన్నారు.

విమర్శలపాలైనా వైఖరి మారలేదు...

అంబర్‌పేట్‌లో బాలుడి మృతిపై జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారుల పనితీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. బాలుడి మృతి నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్లు (GHMC Zonal Commissioners), ఉన్నతాధికారులతో మేయర్ విజయలక్ష్మి (Mayor Vijayalakshmi) అత్యవసర సమీక్ష నిర్వహించారు. బాలుడి మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. బాలుడిని చంపిన కుక్కలకు ప్రతిరోజూ ఓ మహిళ మాంసం పెడుతుండేదని, ఆమె 2 రోజులుగా కనిపించకపోవడంతో ఆకలితో కుక్కలు దాడి చేసి ఉండొచ్చంటూ ఆమె సందేహం వెలిబుచ్చారు. దీంతో మేయర్‌ను టార్గెట్‌గా అన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. ఇప్పటికీ ఆ వ్యాఖ్యల వేడి తగ్గలేదు.

కాగా అంబర్‌పేటలో బాలుడిపై కుక్కలు మూక్కుమ్మడిగా దాడి చేస్తున్న దృశ్యాలు చూసి ప్రతీ ఒక్కరూ కంటతడిపెట్టారు. ఈ క్రమంలో వీధికుక్కల దాడిని రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) సీరియస్‌గా పరిగణించింది. వీధి కుక్కల దాడులు, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై గైడ్ లైన్స్ (Guide lines) జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల పరిధిలో చర్యలకు ఆదేశించింది. వీధి కుక్కల సంఖ్య పెరగకుండా నియంత్రించాలని... కుక్కలకు 100 శాతం స్టెరిలైజేషన్ (Sterilization) చేయాలని పేర్కొంది. మాంసం దుకాణాలు, ఫంక్షన్ హాళ్ల వారు మాంసాహారాన్ని ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై పడేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. కుక్కలను పట్టుకునే బృందాలు, వాహనాల సంఖ్యను పెంచాలని తెలిపింది. వీధి కుక్కలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించాలని... అలాగే వీధి కుక్కలపై స్కూల్ పిల్లలకు అవగాహన కల్పించాలని పేర్కొంది. ఈ మేరకు కరపత్రాలను పంపిణీ చేయాలని చెబుతూ.. జీహెచ్ఎంసీ, సంబంధిత శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ జీహెచ్‌ఎంసీ మేయర్‌గా ఉన్న విజయలక్ష్మీలో ఎలాంటి మార్పు కనిపించకపోవడం గమనార్హం.

Updated Date - 2023-03-06T17:23:21+05:30 IST