ప్రేమ విఫలమై బాలిక ఆత్మహత్య
ABN , First Publish Date - 2023-11-25T23:46:26+05:30 IST
ప్రేమ విఫలమై బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకోగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందిన సంఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం ఇటిక్యాలలో శనివారం చోటుచేసుకున్నది.
చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి
యువకుడి ఇంటి ఎదుట బంధువుల ఆందోళన
పరిహారం ఇప్పించడానికి నిర్ణయించిన గ్రామపెద్దలు!
జగదేవ్పూర్, నవంబరు 25: ప్రేమ విఫలమై బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకోగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందిన సంఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం ఇటిక్యాలలో శనివారం చోటుచేసుకున్నది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటిక్యాలకు చెందిన దళిత మైనర్ తుమ్మ భానుప్రియ (17), అదే గ్రామానికి చెందిన రజక సామాజికవర్గానికి చెందిన యువకుడు ఎడపల్లి సందీప్ (21) ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ విషయం తెలిసి యువకుడి కుటుంబసభ్యులు పెళ్లికి నిరాకరించారు. తమ ప్రేమ విఫలమైందని భావించిన సదరు బాలిక 20 రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. బాలిక పురుగుల మందు తాగిన నాలుగు రోజుల తర్వాత కుటుంబీలకు చెప్పడంతో వారు ములుగు మండలం లక్ష్మక్కపల్లిలోని ఆసుపత్రికి తరలించారు. ఆలస్యంగా ఆసుపత్రిలో చేర్చడంతో బాలిక కిడ్నీలు, లివర్ పాడయ్యాయి. బాలికకు డయాలసిస్ చేసినా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో వైద్యులు ఆమెను ఇంటికి పంపించారు. బాలిక కుటుంబసభ్యులు గ్రామ పెద్దలకు చెప్పడంతో ఊర్లో పంచాయితీ పెట్టారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మాట్లాడదామని గ్రామపెద్దలు బాలిక కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. ఈ క్రమంలో బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించి శనివారం కన్నుమూసింది. బాలిక కుటుంబసభ్యులు యువకుడి ఇంటి ఎదుట మృతదేహాన్ని ఉంచి నాలుగు గంటల పాటు ఆందోళన చేశారు. ఇరువర్గాలు, గ్రామపెద్దలు మాట్లాడి పరిహారం ఇప్పించడానికి నిర్ణయించారు. సమస్య సద్దుమణగడంతో బాలిక మృతదేహాన్ని ఆమె కుటుంబీకులు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయమై జగదేవపూర్ ఎస్ఐ చంద్రమోహన్ను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.