‘కమలం’లో జోష్..
ABN , First Publish Date - 2023-11-27T23:43:39+05:30 IST
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘సకల జనుల విజయసంకల్ప సభ’ విజయవంతమైంది. ప్రధానమంత్రి మోదీ పర్యటనతో కమలదళంలో ఉత్సాహం ఉప్పొంగింది. మధ్యాహ్నం 12.50గంటలకు చేరుకున్న ప్రధాని.. గంటపాటు సభా ప్రాంగణంలో గడిపారు. అక్కడక్కడా తెలుగు పదాలను ఉచ్చరించి మోదీ సభికులను ఉర్రూతలూగించారు. 38 నిమిషాలు సాగిన ప్రసంగంలో మోదీ బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. సీఎం కేసీఆర్పై విరుచుకపడ్డారు.
మానుకోటలో ప్రధాని మోదీ బహిరంగ సభ సక్సెస్
సీఎం కేసీఆర్ టార్గట్గా పదునైన విమర్శలు
రాష్ట్రంలో బీజేపీ సర్కారు రావడం ఖాయమని ధీమా
ప్రసంగంలో పలుమార్లు తెలుగు పదాల ఉచ్ఛారణ
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘సకల జనుల విజయసంకల్ప సభ’ విజయవంతమైంది. ప్రధానమంత్రి మోదీ పర్యటనతో కమలదళంలో ఉత్సాహం ఉప్పొంగింది. మధ్యాహ్నం 12.50గంటలకు చేరుకున్న ప్రధాని.. గంటపాటు సభా ప్రాంగణంలో గడిపారు. అక్కడక్కడా తెలుగు పదాలను ఉచ్చరించి మోదీ సభికులను ఉర్రూతలూగించారు. 38 నిమిషాలు సాగిన ప్రసంగంలో మోదీ బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. సీఎం కేసీఆర్పై విరుచుకపడ్డారు. ఫామ్హౌస్ ముఖ్యమంత్రి మనకు అవసరమా? అంటూ ప్రజలను ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాల స్థానంలో కన్నీళ్లు, మోసాలు, నిరుద్యోగాలు వచ్చాయంటూ వ్యాఖ్యానించారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలంటే బీజేపీ రావాలని పునరుద్ఘాటించారు. చివరగా ‘భారత్ మాతా కీ జై’ అంటూ ముగించారు.
మహబూబాబాద్ టౌన్/మహబూబాబాద్ రూరల్, నవంబరు 27 : గిరిజన ఖిల్లా మానుకోట జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘సకల జనుల విజయసంకల్ప సభ’ విజయవంతమైంది. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని డోర్నకల్, మానుకోట, ఇల్లందు, పినపాక, భద్రాచలం, నర్సంపేట, ములుగు నియోజకవర్గాల నుంచి ప్రజలు తరలిరావడంతో సభా ప్రాంగణం జనసంద్రోహంగా మారింది. అనుకున్న సమయానికే ప్రధాని మోదీ మహబూబాబాద్కు 12.50 గంటలకు చేరుకుని సరిగ్గా గంట పాటు పర్యటించారు. తిరిగి ఇక్కడి నుంచి 1.50 గంటలకు బయలుదేరి వెళ్లారు. ప్రధాని మోదీ 38 నిమిషాల పాటు తన ప్రసంగాన్ని కొనసాగించడంతో పాటు అందులో మిన్నగా తెలుగు అక్షరాలను జోడించడంతో సభికుల్లో హర్షద్వానాలు వెల్లువెత్తాయి.
ప్రతిసారి నా కుటుంబసభ్యుల్లారా అంటూ మోదీ ఆత్మీయ, ఆప్యాయ పలకరింపుతో ప్రసంగం కొనసాగడంతో వచ్చిన ప్రజలంతా కేరింతలు కొట్టారు. సభికులకు అర్థమయ్యే రీతిలో ఈ ప్రాంతాన్ని ఉచ్చరిస్తూ సాధారణ పరిభాషలో ప్రసంగం ఉండడంతో ఆటు బీజేపీ శ్రేణులు, ఇటు ప్రజల్లో జోష్ నిండుకుంది. ఎప్పుడు లేనివిధంగా సాక్షాత్తూ దేశ ప్రధాని మహబూబాబాద్ జిల్లాలో పర్యటించడంతో బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నెలకొంది. తన ప్రసంగంలో తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని పదే.. పదే చెప్పడంతో పార్టీ శ్రేణులంతా చప్పట్లతో సభా ప్రాంగణం మారుమ్రోగింది.
మానుకోటలో గంట పాటు మోదీ
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రధాని మోదీ పర్యటన సరిగ్గా గంటపాటు కొనసాగింది. సభా ప్రాంగణానికి సమీపంలో 12.50 గంటలకు హెలిప్యాడ్ ల్యాండ్ అయింది. అక్కడ్నుంచి నేరుగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. కొద్దిసేపు బీజేపీ శ్రేణులు ప్రధాని మోదీకి మెమోంటోలు అందజేసి శాలువాలతో సత్కరించారు. డోర్నకల్ అభ్యర్థిని భూక్య సంగీత లంబాడ సంప్రదాయ అద్దాలతో కూడిన టవల్ను బహూకరించారు. మహబూబాబాద్ అభ్యర్థి జాటోతు హుస్సేన్నాయక్, జిల్లా అధ్యక్షుడు వద్దిరాజు రాంచందర్రావు.. శ్రీరాముడు, అనంతాద్రి శ్రీ వేంకటేశ్వరస్వామి పటాలను అందచేశారు. ఆపై కొద్దిసేపటి తర్వాత 1.12 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం ఆరంభమై 1.50 వరకు కొనసాగింది. సరిగ్గా గంట పాటు మానుకోట పర్యటన అనంతరం ఇక్కడ్నుంచి కరీంనగర్ సభకు బయలుదేరి వెళ్లారు.
తెలుగులో...
మహబూబాబాద్ విజయసంకల్ప సభలో ప్రధాని మోదీ తన ప్రసంగంలో అక్కడక్కడ తెలుగు పదాలు మా ట్లాడి బీజేపీ శ్రేణులను ఉత్తేజ పరిచారు. తొలుత ప్రసంగాన్ని సైతం తెలుగులోనే ప్రారంభించడంతో కేరింతలు కొట్టారు. మొదటగా తెలుగు ప్రజలందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలంటూ ప్రసంగాన్ని ఆరంభించారు. తర్వాత ప్రసంగం కొనసాగింపులో తరుచుగా ‘నా కుటుంబసభ్యులారా’ అంటూ ప్రసంగాన్ని కొనసాగించారు. వీటితో పాటు మొదటిసారిగా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని.. మోదీ గ్యారెంటీ అంటే పూర్తి అయ్యే గ్యారెంటీ.. ఫాంహౌస్ ముఖ్యమంత్రి మనకు అవసరమా..? సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం, పెట్రోల్, డిజీల్ ధరలు తగ్గాలా.. వద్దా..? నీళ్లు, నిధులు, నియామకాలు కాదు... కన్నీళ్లు, మోసాలు, నిరుద్యోగం వచ్చాయని ఈ పదాలన్నింటిని తన ప్రసంగంలో తెలుగులో ఉచ్చరించారు. చివరికి భారత్ మాతాకు జై అంటూ ప్రసంగం ముగించారు.
భారీ బందోబస్తు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ప్రధాని మోదీ సభకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఒక్కరోజు ముందుగానే కేంద్రబలగాలు సభా ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ (మల్టీజోన్-1) ఐజీ చంధ్రశేఖర్రెడ్డి నేతృత్వంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి పోలీస్ అధికారులు, సిబ్బంది మహబూబాబాద్లో బందోబస్తులో పాల్గొన్నారు. దాదాపుగా రెండువేల మంది పోలీసులు విధులు నిర్వహించారు. ప్రతీ ఒక్కరి పాసులు తనిఖీ చేసిన తర్వాతే సభా ప్రాంగణానికి అనుమతించారు. ప్రధాని మోదీ సభకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. చివరికు సభా ప్రాం గణంలో సైతం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా మధ్య ప్రధాని పర్యటన కొనసాగింది.
సభా వేదికపై అరుదైన సన్నివేశం
మహబూబాబాద్, నవంబరు27 (ఆంధ్రజ్యోతి) : మహబూబాబాద్లో జరిగిన బీజేపీ సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సభావేదికపై ప్రధాని మోదీకి డోర్నకల్ అభ్యర్థి భూక్య సంగీత లంబాడ సంప్రదాయ పాకిడి (రుమాలు) అం దించి పాదాభివందనం చేయగా, ఆ వెంటనే మోదీ కూడా కిందకు వంగి ఆమె పాదాలకు నమ స్కారం చేశారు. అరుదైన ఈ సన్నివేశాన్ని చూసి న వారందరూ సంబ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. మోదీ తీరును ప్రశంసించారు.