Share News

Andhra Pradesh: ఏజెన్సీ ఘాట్‌ రోడ్డులో ప్రమాదం

ABN , Publish Date - Jun 01 , 2024 | 05:39 AM

ద్విచక్ర వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకుపోవడంతో తండ్రి, కొడుకు మృతిచెందారు. అదే వాహనంపై ఉన్న తల్లి, కూతురు తీవ్రంగా గాయపడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం చింతవానిపాలెంలో శుక్రవారం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి.

Andhra Pradesh: ఏజెన్సీ ఘాట్‌ రోడ్డులో ప్రమాదం

లోయలోకి దూసుకుపోయిన బైక్‌

తండ్రి, కొడుకు మృతి.. తల్లి, కుమార్తెకు తీవ్ర గాయాలు

కొయ్యూరు, మే 31: ద్విచక్ర వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకుపోవడంతో తండ్రి, కొడుకు మృతిచెందారు. అదే వాహనంపై ఉన్న తల్లి, కూతురు తీవ్రంగా గాయపడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం చింతవానిపాలెంలో శుక్రవారం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. అడ్డతీగల మండలం సీతారాం గ్రామానికి చెందిన వెలమ రాంబాబు (35), కాసులమ్మ దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

వీరిలో పెద్ద కుమార్తె రంపచోడవరంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో చదువుతోంది. మరో కుమార్తె ప్రమీలను కొయ్యూరు మండలం బాలరేవులలో ఉన్న తమ బంధువుల ఇంటికి పండగ కోసం పంపించారు. కుమార్తెను తిరిగి తీసుకురావడానికి రాంబాబు, కాసులమ్మ కుమారుడు ప్రశాంత్‌(7)తో కలిసి గురువారం బాలరేవుల వచ్చారు. శుక్రవారం ఉదయం ద్విచక్ర వాహనంపై కుమార్తె ప్రమీలతో కలిసి తమ సొంత గ్రామం బయలుదేరారు.

చింతవానిపాలెం గ్రామం దాటాక ఘాట్‌ రోడ్డులోని ప్రమాదకర మలుపులో వాహనం బ్రేకులు ఫెయిలవ్వడంతో అదుపుతప్పి లోయలోకి దూసుకుపోయింది. దీంతో రాంబాబు, ప్రశాంత్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాసులమ్మ, ప్రమీల తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరూ కేకలు వేయడంతో అటుగా వెళుతున్న ప్రయాణికులు గమనించి స్థానికులతో కలిసి రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. సమాచారం అందుకున్న కొయ్యూరు ఎస్‌ఐ రామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Updated Date - Jun 01 , 2024 | 05:39 AM