Share News

TIDCO HOUSES: నిరుపేదల్లో... చిగురిస్తున్న ఆశలు..!

ABN , Publish Date - Jun 17 , 2024 | 12:09 AM

పట్టణంలో ఎన్నో ఏళ్లుగా సొంతిల్లులేక వేలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. అలాంటి వారికోసం గత తెలుగుదేశం హయాంలో ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి శ్రీకారం చుట్టింది. పట్టణంలోని 3 వేల మందికిగాను కొటిపి సమీపంలో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2018 జనవరి 10న ఇళ్ల నిర్మాణానికి అప్పటి, ఇప్పటి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భూమిపూజచేసి పనులు ప్రారంభించారు.

TIDCO HOUSES: నిరుపేదల్లో... చిగురిస్తున్న ఆశలు..!

వైసీపీ పాలనలో నిర్లక్ష్యం

కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో

నిరుపేదల్లో ఆనందం

హిందూపురం, జూన 16: పట్టణంలో ఎన్నో ఏళ్లుగా సొంతిల్లులేక వేలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. అలాంటి వారికోసం గత తెలుగుదేశం హయాంలో ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి శ్రీకారం చుట్టింది. పట్టణంలోని 3 వేల మందికిగాను కొటిపి సమీపంలో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2018 జనవరి 10న ఇళ్ల నిర్మాణానికి అప్పటి, ఇప్పటి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భూమిపూజచేసి పనులు ప్రారంభించారు. 2019 ఎన్నికలు జరిగే నాటికి 70శాతం పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వం మారడంతో ఈ ఐదేళ్లు టిడ్కో ఇళ్ల గురించి పట్టించుకున్న పాపాన వైసీపీ పాలకులు పోలేదు. దీంతో ఇళ్ల నిర్మాణం కోసం అక్కడున్న కొన్ని పరికరాలు దొంగలెత్తుకెళ్లారు. ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలవడం బాలకృష్ణ ఎమ్మెల్యే కావడంతో మరోసారి టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. దీనికితోడు తెలుగుదేశం అధికారంలోకి వస్తే టిడ్కో ఇళ్లు పూర్తిచేసి లబ్ధిదారులకు అందిస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే మాటను బాలకృష్ణ కూడా చెప్పారు. దీంతో ప్రభుత్వం మారడం ఎమ్మెల్యే బాలకృష్ణ రావడంతో ఇళ్ల నిర్మాణాలు పూర్తయి మాకు అప్పగిస్తారని వేయి కళ్లతో లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.


గత టీడీపీ హయాంలో నిర్మాణం

తెలుగుదేశం హయాంలో పట్టణానికి సంబంధించి కొటిపి వద్ద మొదటి దశ కింద 2050ఇళ్లు, రెండోదశ 6500 ఇళ్లు నిర్మాణం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అందరికీ ఇల్లు పథకం కింద టిడ్కో సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీ ప్లస్‌ 3 తరహాలో అపార్ట్‌మెంట్‌లో ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో 300, 365, 430 చదరపు అడుగుల్లో లబ్ధిదారుల వాటా కింద ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో 2736 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించి పనులు మొదలు పెట్టారు. మొదట్లో లబ్ధిదారులు రాకపోయినా పాలకులు దీనిపై అవగాహన కల్పించారు. దీనివల్ల లబ్ధిదారులు డీడీలు చెల్లించారు. 300చ.అడుగులకు 1104మంది, 365చ.అ.లకు 1355, 430చ.అడుగులకు 288మంది డీడీలు చెల్లించారు. దీనికోసం 2516 మందికి ఇళ్లు కేటాయించారు. వారికి బ్యాంక్‌ లింకేజీ కింద 380 మందికి పలు బ్యాంకుల్లో రుణాలు ఇప్పించారు. అంతేకాక డీడీలు ఇప్పటి వరకు కట్టించుకున్నవాటిని వెనక్కు ఇవ్వలేదు. ఇళ్లు అప్పగించలేదు. దీంతో టీడీపీ కాలంలో చేపట్టిన పనులే తప్ప ఒక్క అంగుళం పనికూడా చేయలేదు. వైసీపీ పాలనంతా టిడ్కో ఇళ్లపై నిర్లక్ష్యం వహించారు. దీంతో ఐదేళ్లుగా ఇళ్ల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.


కూటమి ప్రభుత్వంతో నిరుపేదల్లో ఆనందం

కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఎమ్మెల్యే బాలకృష్ణ మూడోసారీ గెలవడంతో పట్టణానికి చెందిన లబ్ధిదారులు ఆనందం వెల్లివిరుస్తోంది. మరీ ముఖ్యంగా నిరుపేదలు బాడుగలు చెల్లించలేక నానా అవస్థలు పడుతున్న వారు టీడీపీ గెలుపుతో ఇక మాకు సొంతింటికల నెరవేరే సమయం ఆసన్నమైందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు గుర్తించి మాకు ఇళ్లు అప్పగిస్తారని ఎదురుచూస్తున్నారు. అయితే వైసీపీ పాలనలో డెడ్‌లైనలు పెట్టారు తప్ప ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదు. దీనివల్ల నిరుపేదలు దానిపై ఆశలు వదులుకున్నారు. వైసీపీ కాలంలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకపోవడంతో ఇక్కడున్న పరికరాలు చోరీకి గురికావడమేకాక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ఇక ఇళ్ల నిర్మాణాలపై బాలయ్య దృష్టిసారిస్తారని నిరుపేదలు చెప్పుకుంటున్నారు.

Updated Date - Jun 17 , 2024 | 12:09 AM