Share News

AP Assembly : గౌరవసభలో అడుగుపెట్టా!

ABN , Publish Date - Jun 23 , 2024 | 05:24 AM

తెలుగు రాష్ట్రాల్లోనే బీసీ నాయకుల్లో అయ్యన్నపాత్రుడు సీనియర్‌ నేత అని, ఆయనకు స్పీకర్‌ స్థానం దక్కడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన అయ్యన్నపాత్రుడిని ఆయన, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, మంత్రులు

AP Assembly : గౌరవసభలో అడుగుపెట్టా!

నా బాధను ప్రజలు అర్థం చేసుకున్నారు.. అయ్యన్న పసుపు పోరాట యోధుడు.. బీసీ నేతకు పట్టం సంతోషం

వైసీపీకి 11 స్థానాలు దేవుడిచ్చిన స్ర్కిప్టు.. స్పీకర్‌ ఎన్నికకు రాకుండా వైసీపీ సభా విలువలు మంటగలిపింది

ప్రజలిచ్చింది అధికారం కాదు.. బాధ్యత.. రాజధాని కట్టాలి, పోలవరం పూర్తి చేయాలి: సీఎం చంద్రబాబు

ఓటమిని స్వీకరించలేని పిరికివారు.. వైసీపీపై పవన్‌ ధ్వజం.. ఇక తిట్టడానికి నో చాన్స్‌.. అయ్యన్నతో చలోక్తి

తిరుపతిలో నాపై క్లెమోర్‌ దాడి జరిగింది. ఆ రోజు కూడా కన్నీళ్లు రాలేదు. కానీ, సభతో, రాజకీయాలతో సంబంధం లేని నా సతీమణిపై నీచంగా మాట్లాడారు. రాష్ట్రంలో గౌరవంగా బతికే ప్రతి ఆడబిడ్డపై సోషల్‌ మీడియాలో నీచంగా పోస్టులు పెట్టడంతో ఆ బాధ తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నా. అలాంటి వ్యక్తులు, నేతలు, పార్టీ రాష్ట్రానికి అరిష్టమని ప్రజలు భావించి మమ్మల్ని గెలిపించారు.

- సీఎం చంద్రబాబు

ఈ విలువైన ఐదేళ్లు.. రాబోయే తరాలకు గొప్ప భవిష్యత్తును ఇచ్చేలా ఉండాలి. అన్నం పెట్టే రైతులకు అండగా నిలిచేలా ఉండాలి. మహిళలకు గౌరవం కల్పించేలా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులకు భరోసానిచ్చేలా, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి బాటలు వేసేలా ఉండాలి. ఉంటుందని ఆకాంక్షిస్తున్నా.

- డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

అమరావతి, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లోనే బీసీ నాయకుల్లో అయ్యన్నపాత్రుడు సీనియర్‌ నేత అని, ఆయనకు స్పీకర్‌ స్థానం దక్కడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన అయ్యన్నపాత్రుడిని ఆయన, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, మంత్రులు సత్యకుమార్‌, అచ్చెన్నాయుడు స్పీకర్‌ స్థానంలో కూర్చోబెట్టారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూఅసెంబ్లీలో అత్యంత సీనియర్‌ సభ్యుల్లో అయ్యన్నపాత్రుడు ఒకరని, అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషకరమన్నారు. ఎన్టీఆర్‌ పిలుపుతో 25 ఏళ్ల వయసుల్లో అయ్యన్న రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. ఏడు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారని గుర్తు చేశారు. ఏ పదవి ఇచ్చినా వన్నె తెచ్చారని పేర్కొన్నారు. 16 ఏళ్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ పడని ఇబ్బందులు గత ఐదేళ్లలో అనుభవించారని తెలిపారు. ఆయన ఇంటిపై పోలీసులు దాడులు చేశారని, అక్రమంగా 23 కేసులు పెట్టారని, ఆయనపై అనేక పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టి వేధించారని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా రాజీలేని పోరాటం చేశారని తెలిపారు. చట్ట సభకు రావడం అరుదైన అవకాశమని, ఎన్నుకున్న ప్రజలకు ఏం చేయాలో గుర్తు పెట్టుకోవాలన్నారు. గెలిచి వచ్చిన సభ్యులందరిపై పవిత్రమైన బాధ్యత ఉందని గుర్తుంచుకోవాలన్నారు. చట్టసభల్లో సభ్యుల ప్రవర్తన సరిగా ఉండాలని, సభ్యులు మాట్లాడే విషయాలన్నీ రాష్ట్రమంతా చూస్తుందని చంద్రబాబు తెలిపారు. ‘‘ఆనాడు మేం 23 మంది సభ్యులం. జనసేన, బీజేపీ సభ్యులు సభలో లేరు. ఇదే సభలో నేను ఎన్నో బాధలు పడ్డా. నన్ను, నా కుటుంబాన్ని ఇష్టానుసారంగా మాట్లాడితే నిరసన వ్యక్తం చేసేందుకు మైక్‌ కూడా ఇవ్వలేదు. ఇది గౌరవసభ కాదని, మైక్‌ కూడా ఇవ్వడం లేదని అప్పట్లోనే చెప్పా’’ అని అన్నారు.


గతాన్ని గుర్తు చేసుకుని..

సీఎం చంద్రబాబు గతాన్ని గుర్తు చేసుకున్నారు. వైసీపీ హయాంలో తనను సభలో ఏవిధంగా వేధించారో ఆయన చెప్పారు. ‘‘నా కుటుంబ సభ్యులను దూషించారు. ఆ సమయంలో నేను ఒకటే చెప్పా. ‘నేను స్టేట్‌మెంట్‌ ఇవ్వాలనుకున్నా.. మీరు మైక్‌ ఇవ్వలేదు. అయినా నాకు బాధలేదు. మళ్లీ చెబుతున్నా ముఖ్యమంత్రిగానే సభకు వస్తాను. ఇది కౌరవసభ. గౌరవసభ కాదు. ఇలాంటి సభలో ఉండనని చెబుతున్నా’ అని ఆనాడు చెప్పాను. నా అనుమానం ప్రజలు అర్థం చేసుకుని నిండు మనసుతో ఆశీర్వదించారు’’ అని చంద్రబాబు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో తనకు, రాష్ట్రంలోని మహిళలకు జరిగిన అవమానాన్ని మరెవ్వరికీ జరగనివ్వనని హామీ ఇచ్చారు. తన జీవితాంతం ప్రజలకు రుణపడి ఉంటానని, మళ్లీ జన్మ అంటూ ఉంటే తెలుగు గడ్డపై పుట్టి రుణం తీర్చుకుంటానన్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని ప్రగల్భాలు పలికారని, పోటీ చేసిన 21 స్థానాల్లో పార్టీని గెలిపించిన వ్యక్తి పవన్‌ అని చంద్రబాబు అన్నారు. ‘‘ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్‌. వైసీపీ వైనాట్‌ 175 అని చెప్పి 11 సీట్లు తెచ్చుకున్న పరిస్థితిని చూశాం. నా జీవితంలో ఎప్పుడూ చూడని సభ 15వ శాసనసభ. అది కౌరవసభ. 16వ శాసనసభ అత్యున్నత గౌరవప్రదమైన శాసనసభ. దీనిని అత్యున్నత సభగా మనం నిర్వహించాలి. 24 గంటలూ మనం ప్రజలతో ఉండాలి. ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాలి’’ అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ అందరి స్వప్నం కావాలని అభిలషించారు. దానికి అనుగుణంగా సభలో చర్చలు, నిర్ణయాలు, పాలసీలు రావాలన్నారు. సభలో దూషణలు, వెకిలి చేష్టలు లేకుండా హుందాగా సాగాలన్నారు.

ఇవీ లక్ష్యాలు

సభలో చంద్రబాబు కొన్ని లక్ష్యాలు ప్రకటించారు. రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి, నదుల అనుసంధానం చేసుకోవాలన్నారు. పెట్టుబడులు తీసుకురావడం, యువతకు ఉద్యోగాల కల్పన, బడుగులకు న్యాయం చేయాలన్నారు. అయ్యన్న ఆధ్వర్యంలో జరిగే సభ ద్వారా ఏపీని ప్రపంచంలో నెంబర్‌వన్‌గా నిలిపేందుకు, పేదరికం లేని రాష్ట్రంగా తయారు చేసేందుకు, ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు అడుగులు వేయాలని ఆకాంక్షించారు. ఆ తరహా చర్చలు సాగాలని కోరుకుంటున్నామన్నారు.

Updated Date - Jun 23 , 2024 | 06:58 AM