Share News

ATM ఏటీఎంలో చోరీ ఇంటి దొంగల పనే..!

ABN , Publish Date - Sep 02 , 2024 | 02:00 AM

చంద్రగిరి పట్టణం కొత్తపేటలోని కోసూరి కాంప్లెక్స్‌లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో గురువారం రాత్రి జరిగిన చోరీ ఇంటి దొంగల పనే అని పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులున్నట్లు సమాచారం.

 ATM  ఏటీఎంలో చోరీ ఇంటి దొంగల పనే..!
ధ్వంసమైన ఏటీఎం (ఫైల్‌ ఫొటో)

- పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులున్నట్లు సమాచారం

చంద్రగిరి, సెప్టెంబరు 1: చంద్రగిరి పట్టణం కొత్తపేటలోని కోసూరి కాంప్లెక్స్‌లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో గురువారం రాత్రి జరిగిన చోరీ ఇంటి దొంగల పనే అని పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులున్నట్లు సమాచారం. విశ్వసనీయ కథనం మేరకు.. ఎస్బీఐ ఏటీఎంలలో నగదు పెట్టే ప్రైవేటు సిబ్బంది అయిన కస్టోడియన్‌ సురేష్‌ పథకం ప్రకారం ఈనెల 27వ తేదీన కోసూరి కాంప్లెక్స్‌లోని ఏటీఎం మెషీన్‌లో నగదు పెట్టి.. దానికి సంబంధించిన తాళం వేయకుండా, ప్రధాన డోరుకు సంబంధించిన తాళం వేసి వచ్చేశాడు. అదే రోజు రాత్రి నగదు తరలించే వాహన డ్రైవర్‌ మనోజ్‌కు విషయాన్ని తెలిపాడు. అతను తన స్నేహితుడు మనోజ్‌కు విషయం తెలిపి.. నగదు చోరీకి ప్రణాళిక రూపొందించారు. డ్రైవర్‌ స్నేహితుడైన మనోజ్‌ సెక్యూరిటీ వేషధారణలో వచ్చి సురేష్‌ వద్ద ఉన్న ప్రధాన డోరు తాళంతో ఏటీఎం తెరిచి లోపలున్న నగదును చోరీ చేశాడు. అనంతరం ఇది ఇంటి దొంగల పనే అన్న అనుమానం రాకుండా ఉండటానికి గడ్డపారతో ఏటీఎంను కదిలించి, ధ్వంసం చేశాడు. కాగా, వీరు చంద్రగిరిలోనే కాకుండా తిరుపతిలోని గిరిపురం, అన్నారావు సర్కిల్‌, తుమ్మలగుంట దగ్గర ఉన్న ఎల్‌ఎ్‌సనగర్‌లోని ఏటీఎంలలో కూడా ఈ తరహాలోనే చోరీ చేసినట్లు గుర్తించారు. ఏటీఎం చోరీ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసి, మరో రెండ్రోజుల్లో నిందితులను అరెస్టు చూపి, రిమాండ్‌కు తరలించనున్నట్లు సమాచారం.

Updated Date - Sep 02 , 2024 | 02:00 AM