Share News

సహకార సంఘాల్లో సీఈవోల పెత్తనం

ABN , Publish Date - Aug 05 , 2024 | 01:22 AM

ఉమ్మడి చిత్తూరుజిల్లాలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(సింగిల్‌ విండో)లో ఆధిపత్య పోరు సాగుతోంది. 76 సింగిల్‌ విండోలకుగాను చాలాచోట్ల 20-30 ఏళ్ళుగా సీఈవోలు తిష్టవేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

సహకార సంఘాల్లో సీఈవోల పెత్తనం

ఫ దశాబ్దాలుగా తిష్టవేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వైనం

ఉమ్మడి చిత్తూరుజిల్లాలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(సింగిల్‌ విండో)లో ఆధిపత్య పోరు సాగుతోంది. 76 సింగిల్‌ విండోలకుగాను చాలాచోట్ల 20-30 ఏళ్ళుగా సీఈవోలు తిష్టవేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిన్నటివరకు త్రీమెన్‌ కమిటీని, ఇప్పుడు అఫిషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జిని సైతం లెక్కచేయడం లేదు. పలుచోట్ల సీఈవోలే సింగిల్‌ విండోల్లో పెత్తనం చెలాయిస్తున్నారు. వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి డీసీసీబీ సీఈవో, డీసీవోలే భయపడుతున్నారు.

- చిత్తూరు కలెక్టరేట్‌

రైతులకు చేదోడుగా ఉండాల్సిన సింగిల్‌ విండోల్లో గత ఐదేళ్లలో త్రీమెన్‌ కమిటీలు ఉండేవి. నెల క్రితం కూటమి ప్రభుత్వం ఏర్పడి, ఆ కమిటీలను రద్దుచేసి సహకార శాఖకు చెందిన సీనియర్‌, జూనియర్‌ రిజిస్ట్రార్లను, ఆడిటర్లను అఫిషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జిలుగా నియమించింది. అప్పుడు, ఇప్పుడు రైతులకోసం పనిచేయాల్సివుండగా ఏళ్ళ తరబడి తిష్టవేసిన సీఈవోలు లెక్కపెట్టకపోవడంతో కమిటీలు ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి. ఒకవేళ ఎన్నికలు జరిగితే సొసైటీల చైర్మన్‌ పదవీకాలం ఐదేళ్లే. కానీ సీఈవోలు మాత్రం ఉద్యోగ విరమణ చేసేంతవరకు తమను ఎవరూ ఏమీ చేయలేరనే అభిప్రాయంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. దీంతో కమిటీ చైర్మన్లకు అప్పట్లో, అఫిషియల్‌ పర్శన్‌ ఇన్‌చార్జిలకు ఇప్పుడు సీఈవోలతో పొసగక సమస్య జఠిలంగా మారి సొసైటీల ప్రతిష్ఠ దెబ్బతింటోంది. సింగిల్‌ విండోల్లో కోల్డ్‌వార్‌తో తిరోగమన దిశగా పయనిస్తోందన్న చర్చ సాగుతోంది.

డీఎల్‌ఈఎస్‌ భేటీలు కరువు

సింగిల్‌ విండోల బాగోగులు, సీఈవోలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన డిస్ట్రిక్‌ లెవల్‌ ఎంపవర్డ్‌ కమిటీ (డీఎల్‌ఈఎస్‌) ఎప్పుడూ భేటీ కాలేదు. ఈ కమిటీలో డీసీసీబీ చైర్మన్‌ (ఇప్పుడు పర్శన్‌ ఇన్‌చార్జి అయిన జేసీ)తో పాటు బ్యాంకు సీఈవో, డీసీవో, నాబార్డు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధికారులు ఉంటారు. సింగిల్‌ విండోల్లో సమస్యలు, ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయ పరచడం, అవసరమైతే సీఈవోలను ఇతర సొసైటీలకు బదిలీ చేయాలని ఆప్కాబ్‌కు సిఫార్సుచేయడం ఈ కమిటీ విధి. సింగిల్‌ విండో కమిటీ అధికారులు, సీఈవోల మధ్య స్నేహపూర్వక వాతావరణం కల్పించి సొసైటీల ద్వారా రైతులకు మేలు చేకూర్చేలా డీఎల్‌ఈఎస్‌ కమిటీ వ్యవహరించాలి. రైతులకు రుణాలిచ్చే విషయంలో రాజకీయ నేతలకు, రైతుల మధ్య ఘర్షణ వైఖరి కల్పించి కోరిన వారికి మాత్రం నిబంధనలకు మించి రుణాలివ్వడం, కాని వారికి సీఈవోలు రిక్తహస్తం చూపుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. సీఈవోల బదిలీ విషయంలో ఆప్కాబ్‌ నిర్ణయం తీసుకోకపోవడంతో ఉమ్మడి జిల్లాలోని దాదాపు 50కి పైగా సింగిల్‌ విండోల్లో సమస్యలు జఠిలంగా మారుతున్నాయి. ఇప్పటికైనా డీసీసీబీ అఫిషియల్‌ పర్శన్‌ ఇన్‌చార్జి అయిన జేసీ డీఎల్‌ఈఎస్‌ భేటీ నిర్వహించి, సొసైటీల పరిస్థితులను అంచనా వేయడంతో పాటు దీర్ఘకాలంగా తిష్టవేసిన వారికి స్థానచలనం కల్పించాలని రైతులు కోరుతున్నారు.

బదిలీలపై దృష్టి సారించని ఆప్కాబ్‌

వాస్తవానికి సింగిల్‌ విండోల సీఈవోల బదిలీని ఆప్కాబ్‌ పర్యవేక్షించాలి. ఉమ్మడి జిల్లాలో డీసీసీబీ, సొసైటీల్లో బదిలీల ప్రక్రియను చూడాలి. జిల్లా సహకార బ్యాంకుతో పాటు బ్రాంచుల్లో కిందిస్థాయి ఉద్యోగుల నుంచి పైస్థాయి అధికారుల వరకు బదిలీలు చేస్తున్నా, విండోల్లో మాత్రం సీఈవోల బదిలీపై దృష్టి సారించడం లేదు. దీంతో ఒకే విండోలో దశాబ్దాలుగా సీఈవోలు కొనసాగుతుండడం, నిధుల దుర్వినియోగం చేస్తూ పైవారి నిర్ణయాలను వారు ఖాతరుచేయడం లేదు. తమచే నిమితులైన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సింది డీసీవోనే అంటూ డీసీసీబీ సీఈవో వెనుకడుగు వేస్తోంది.

డీఎల్‌ఈఎస్‌ నిర్ణయంతోనే బదిలీలు

దీర్ఘకాలికంగా సొసైటీల్లో పనిచేస్తున్న సీఈవోల బదిలీలతో పాటు అన్ని సొసైటీలలో బదిలీలపై డీఎల్‌ఈఎస్‌ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కమిటీ తీర్మానం మేరకు బదిలీల ఉత్తర్వులు వస్తే ఆ ప్రక్రియను డీసీసీబీ సీఈవో నిర్వహిస్తారు. కొన్ని సొసైటీల్లో దీర్ఘకాలంగా సీఈవోలు ఒకే ప్రాంతంలో పనిచేస్తుండడంతో సమస్యలు ఏర్పడిన పరిస్థితులు మా దృష్టికి వచ్చాయి.

- నాగవర్దన, డీసీవో, చిత్తూరు.

Updated Date - Aug 05 , 2024 | 01:22 AM