Share News

అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Sep 10 , 2024 | 11:56 PM

రాగల 72 గంటల్లో గోదావరి వరద మహోగ్ర రూపం దాల్చే ప్రమాదం ఉన్నందున ప్రజలు, అధికారులు అప్రమత్తతతో ఉండాలని జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ అన్నారు. అధికారులు సూచించే ఆదేశాలను లంక గ్రామాల ప్రజలు ఖచ్చితంగా పాటించి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

అప్రమత్తంగా ఉండాలి

అమలాపురం, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): రాగల 72 గంటల్లో గోదావరి వరద మహోగ్ర రూపం దాల్చే ప్రమాదం ఉన్నందున ప్రజలు, అధికారులు అప్రమత్తతతో ఉండాలని జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ అన్నారు. అధికారులు సూచించే ఆదేశాలను లంక గ్రామాల ప్రజలు ఖచ్చితంగా పాటించి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగాన్ని సర్వసన్నద్ధం చేసినట్టు చెప్పారు. అమలాపురంలోని కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశం వరద పరిస్థితిపై మాట్లాడారు. గోదావరి పరివాహక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున ముఖ్యంగా శబరి నది ఉగ్రరూపం దాల్చడంతో అంచనాలకు అందని రీతిలో వరద గంటగంటకు పెరిగిపోతుందని చెప్పారు. గురువారం ఉదయానికి 13లక్షల క్యూసెక్కుల నీటిని దాటి రెండో ప్రమాద హెచ్చరికకు చేరువ అవుతుందన్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక సమయంలో జి.పెదపూడిలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తామని, రెండో ప్రమాద హెచ్చరిక సమయంలో గోదావరి నది పరివాహక 44 లంక ప్రాంతాల్లో పునరావాస శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్‌ చెప్పారు. నదీ పరివాహక ప్రాంతాల్లో 17 పాయింట్లలో పంట్లు, పడవలపై ప్రయాణాలపై ఆంక్షలు విధించినట్టు తెలిపారు. ఇక్కడ అధికారుల సూచనల మేరకు మోటారు బోట్‌లను ఏర్పాటుచేసి వాటిలో లైఫ్‌ జాకెట్లతో పాటు గజ ఈతగాళ్లను పెడుతున్నామన్నారు. వరద పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ప్రధానమైన రేవుల్లో రాకపోకలపై నిషేధాలు అమలు చేస్తామని హెచ్చరించారు. రాగల 72 గంటల్లో వరద ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉన్న దృష్ట్యా జిల్లాకు రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రప్పిస్తున్నట్టు కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ తెలిపారు. లంల గ్రామాల్లో ఉన్న రైతులు అత్యవసమైతే అధికారుల సూచనలతో పడవలపై ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు. వదర ప్రభావిత లంక గ్రామాల్లో తాగునీటి సమస్య ఉత్పన్నమవుతున్నందున వారికి తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రాధాన్యతను ఇస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో ఉన్న వరద పరిస్థితులపై వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారులకు సూచనలు చేశారు.

గణేష్‌ నిమజ్జనాల్లో జాగ్రత్తలు తీసుకోండి..

ప్రస్తుతం గణేష్‌ నిమజ్జన ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించినట్టు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లో అధికారులుఎంపిక చేసిన ప్రదేశాల్లో మాత్రమే నిమజ్జన కార్యక్రమాలు చేయాలన్నారు. నిమజ్జనానికి అవసరమైన క్రేన్లు, పోలీసు బందోబస్తు, గజ ఈతగాళ్లను సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. గోదావరి వరద ఉగ్రరూపం దాల్చుతున్నందున అధికారుల సూచనలు దాటి ఎవరూ గణేష్‌ నిమజ్జనాలను చేసేందుకు వెళ్లొద్దని సూచించారు. ప్రమాదకరమైన పరిస్థితులు గోదావరి నదుల్లో ఉన్నందున భక్తులు సహకారం అందించి గణేష్‌ నిమజ్జన వేడుకలను ప్రశాంత పరిస్థితుల నడుమ జరుపుకోవాలని సూచించారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు మాత్రమే బుధవారం సెలవుగా వెల్లడించారు. మిగిలిన ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయని చెప్పారు. ప్రజలు మాత్రం అధికార యంత్రాంగానికి పూర్తిగా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

Updated Date - Sep 10 , 2024 | 11:56 PM