Share News

Election Commission of India : బాధ్యత మరిచారా? సీఎస్, డీజీపై ఈసీ ఫైర్..

ABN , Publish Date - May 17 , 2024 | 03:37 AM

రాష్ట్రంలో పోలింగ్‌ అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ భగ్గుమంది. మునుపెన్నడూ లేని విధంగా... అసాధారణ రీతిలో జిల్లా కలెక్టర్‌, ఎస్పీలు, 12 మంది దిగువస్థాయి పోలీసు అధికారులపై బదిలీ, సస్పెన్షన్‌ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై మండిపడింది.

 Election Commission of India :  బాధ్యత మరిచారా? సీఎస్, డీజీపై ఈసీ ఫైర్..
Andhra Pradesh CS and DGP

సీఎస్‌, డీజీపీలపై ఎన్నికల కమిషన్‌ కన్నెర్ర

పోలింగ్‌ అనంతర హింసపై తీవ్ర ఆగ్రహం

పల్నాడు, అనంత ఎస్పీలపై సస్పెన్షన్‌ వేటు

తిరుపతి ఎస్పీ, పల్నాడు కలెక్టర్‌ బదిలీ

డీఎస్పీ నుంచి ఎస్‌ఐ వరకు

12 మంది పోలీసు అధికారుల సస్పెన్షన్‌

వీరందరిపై శాఖాపరమైన విచారణ

హింసాత్మక ఘటనలపై దర్యాప్తునకు సిట్‌

రెండు రోజుల్లో సమగ్ర నివేదికకు ఆదేశం

నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

కోడ్‌ ముగిసేలోగానే చార్జిషీట్లు వేయాలి

కౌంటింగ్‌ తర్వాతా కేంద్ర బలగాల కొనసాగింపు

15 రోజులపాటు 25 కంపెనీలతో బందోబస్తు

అమరావతి/న్యూఢిల్లీ, మే 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పోలింగ్‌ అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ భగ్గుమంది. మునుపెన్నడూ లేని విధంగా... అసాధారణ రీతిలో జిల్లా కలెక్టర్‌, ఎస్పీలు, 12 మంది దిగువస్థాయి పోలీసు అధికారులపై బదిలీ, సస్పెన్షన్‌ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై మండిపడింది. ‘ఏపీలో ఏం జరుగుతోంది? స్వయంగా వచ్చి వివరణ ఇవ్వండి’ అని ఆదేశించడంతో... గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి, డీజీపీ హరీశ్‌ గుప్తా, ఇంటెలిజెన్స్‌ డీజీ విశ్వజీత్‌ ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌, కమిషనర్లు జ్ఞానేశ్‌ కుమార్‌, సుఖ్‌బీర్‌సింగ్‌ సంధూ ముందు హాజరయ్యారు. ఈ భేటీలో జరిగిన చర్చ, తీసుకున్న నిర్ణయాలపై ఈసీ అధికారిక ప్రకటన జారీ చేసింది. ‘‘ఏపీలో పోలింగ్‌ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎస్పీలు తగిన చర్యలు తీసుకునేలా చూడాలని సీఎస్‌, డీజీపీలకు ఘాటుగా, సూటిగా చెప్పాం’’ అని ఈసీ వెల్లడించింది. ఆయా ఘటనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికను, సిఫారసులను పరిశీలించి... దానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది.

  • కఠిన చర్యలకు ఆదేశం...

అల్లర్లు అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైన పల్నాడు ఎస్పీ గరికపాటి బిందుమాధవ్‌, అనంతపురం ఎస్పీ అమిత్‌ బర్దార్‌లను ఈసీ సస్పెండ్‌ చేసింది. తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌ను బదిలీ చేసింది. పల్నాడు జిల్లా కలెక్టర్‌ శివ శంకర్‌పైనా ను బదిలీ వేటు వేసింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఎస్‌ఐ నుంచి డీఎస్పీ స్థాయి వరకు 12 మంది అధికారులను సస్పెండ్‌ చేయాలని ఆదేశించింది.

అంతటితో ఆగకుండా... వీరందరిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారాలపై ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి రెండు రోజుల్లో ఎన్నికల కమిషన్‌కు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆయా సంఘటనలపై ఇప్పటికే దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లను సవరించి అవసరమైన మేరకు అదనపు సెక్షన్లు జోడించాలని ఆదేశించింది.

ఈ కేసుల్లో నిందితులపై చట్ట ప్రకారం చార్జిషీట్లు దాఖలు చేయాలని... అది కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసేలోగానే చేయాలని సీఎస్‌, డీజీపీలను ఆదేశించింది. ఈ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించాలని స్పష్టం చేసింది.


  • కేంద్ర బలగాల కొనసాగింపు...

ఫలితాల వెల్లడి తర్వాతా హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశాలున్నందున 25 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాల(సీఏపీఎ్‌ఫ)ను ఇక్కడే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో... ఆ బలగాలను కౌంటింగ్‌ తర్వాత 15 రోజులపాటు ఏపీలోనే ఉంచాలని కేంద్ర హోంశాఖను ఈసీ ఆదేశించింది.

చరిత్రలోనే తొలిసారి..

డీజీపీ నుంచి ఎస్‌ఐల వరకు చర్యలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నేపథ్యంలో జగన్‌ సర్కార్‌ విపరీత పోకడల కారణంగా మొత్తం పోలీసు శాఖపైనే మచ్చ పడింది. ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసం పోలీసు యంత్రాంగాన్ని అడ్డగోలుగా వాడుకోవాలన్న వ్యూహం బెడిసికొట్టింది. దీని ఫలితంగా... డీజీపీతో మొదలుకుని ఎస్‌ఐల దాకా బలి కావాల్సి వచ్చింది. ఇంత మందిపై చర్యలు తీసుకోవడం, పోలింగ్‌ తర్వాతా ఈసీ కొరడా ఝళిపించడం బహుశా దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి.

పోలింగ్‌కు ముందే డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డితోపాటు ఇంటెలిజెన్స్‌ అధిపతి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతి రాణా తాతా, గుంటూరు ఐజీ పాలరాజు, అనంతపురం ఎస్పీ అన్బురాజన్‌, చిత్తూరు ఎస్పీ జాషువా, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌ రెడ్డి, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్‌ రెడ్డిపై వేటు ఈసీ వేసింది. జిల్లా కలెక్టర్లపైనా ఈసీ చర్యలు తీసుకుంది. పోలింగ్‌ అనంతరం జరిగిన హింసపై తీవ్రంగా స్పందిస్తూ... ఎస్‌ఐ స్థాయి అధికారులనూ సస్పెండ్‌ చేయాలని ఆదేశించింది.

  • అసంతృప్తి... ఆగ్రహం!

ఢిల్లీలోని నిర్వాచన్‌ సదన్‌లో జరిగిన భేటీలో... రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియపై తీసుకున్న చర్యలు, ప్రశాంత పోలింగ్‌కు చేపట్టిన ఏర్పాట్ల గురించి సీఎస్‌, డీజీపీ, ఇంటెలిజెన్స్‌ డీజీలు ఎన్నికల కమిషన్‌కు వివరించారు. సుమారు 40 నిమిషాలపాటు ఈ సమావేశం జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు తమ దృష్టికి రాలేదని, ఎన్నికల పరిశీలకుడు మిశ్రా పరిశీలనలోనూ కనిపించలేదని ఈసీ పెదవి విరిచింది. పోలింగ్‌ అనంతరం జరిగిన హింసపై తీవ్రంగా స్పందించింది.

అక్కడ పని చేస్తున్న దిగువ స్థాయి అధికారుల బాధ్యత ఏంటని ప్రశ్నించింది. ‘‘ఫలితాల ప్రకటన దాకా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని మరిచిపోయారా? గత మూడు రోజులుగా వివిధ ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగిన తీరు చూస్తుంటే... పోలింగ్‌ ముగియగానే మీ బాధ్యత మరిచిపోయినట్లనిపిస్తోంది’’ అని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ మండిపడినట్లు సమాచారం.

పోలీసు అధికారులను బదిలీ చేసిన చోట, మొదటి నుంచీ వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలు ఉన్న చోట మాత్రమే హింసాత్మక ఘటనలు జరిగాయని, తాము అప్రమత్తంగానే ఉన్నామని సీఎస్‌, డీజీపీ ఇచ్చిన నివేదిక, పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌పైనా ఈసీ పలు సందేహాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది.

‘‘సమస్యాత్మక ప్రాంతాలను ముందే గుర్తించినట్లయితే తగిన జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదు? అల్లర్లను ఎందుకు అదుపు చేయలేకపోయారు? ఈ సంఘటనలకు ఎవరు బాఽధ్యత వహించాలి? మీరా, మేమా? మీ వద్ద ఇంటెలిజెన్స్‌ సమాచారం ఉండదా?’’ అని వరుస ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది.

పోలీసు యంత్రాంగం తమకు పట్టనట్లు అలసత్వం వహించినట్లు పరిశీలకుల నివేదికల ద్వారా తమకు తెలిసిందని ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. అభ్యర్థులపైనా దాడులు జరిగాయంటే శాంతి భద్రతలు అదుపు తప్పినట్లు కాదా అని ప్రశ్నించింది. ఇదే క్రమంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించిన డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐల పేర్లతో కూడిన జాబితాను డీజీపీ అందించారు. వారిపై చర్యలకు ఈసీ ఆదేశించింది. పోలీసు మాన్యువల్‌ ప్రకారం పనిచేయని ప్రతి అధికారిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని స్పష్టం చేసింది.

నిర్లక్ష్యంతోపాటు పర్యవేక్షణ లోపం ఉన్న ప్రతి పోలీసు అధికారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి చర్య తీసుకోవాలని గట్టిగా చెప్పింది.

Updated Date - May 17 , 2024 | 07:25 AM