Share News

YS Jagan: జగన్‌ నోట మళ్లీ వింత మాటలు..

ABN , Publish Date - Jun 14 , 2024 | 03:38 AM

ఘోర పరాజయంపై ఆత్మ విమర్శలేదు! అంతా ఆత్మ వంచనే! పైగా... విలువలు, విశ్వసనీయత అంటూ కాకమ్మ కబుర్లు! ఇదీ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ తీరు..

YS Jagan: జగన్‌ నోట మళ్లీ వింత మాటలు..

  • విలువలు, విశ్వసనీయత..

  • పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశం

  • ఐదేళ్లు కళ్లు మూసుకోండి

  • పైకి లేస్తాం, అధికారం వస్తుంది

  • మభ్యపెట్టే మాటలు చెప్పిన జగన్‌

  • కొడతా ఉన్నారంటూ ఆక్రోశం

అమరావతి, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): ఘోర పరాజయంపై ఆత్మ విమర్శలేదు! అంతా ఆత్మ వంచనే! పైగా... విలువలు, విశ్వసనీయత అంటూ కాకమ్మ కబుర్లు! ఇదీ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ (YS Jagan) తీరు! గురువారం తాడేపల్లి ప్యాలెస్‌లో వైసీపీ ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు. ‘కళ్లు మూసుకుంటే ఐదేళ్ల కాలం గడిచిపోతుంది’ అని మభ్యపెట్టే మాటలు చెప్పారు. ‘‘ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. కళ్లు మూసుకుంటే చాలు ఐదు సంవత్సరాలు అయిపోయింది. మళ్లీ అదే మాదిరి కళ్లు మూసుకుంటే 2029 సంవత్సరం వచ్చేస్తుంది. సినిమాలో ఓన్లీ ఫస్ట్‌ హాఫ్‌ మాత్రమే అయింది. ఇంటింటికీ మనం చేసిన మంచి ప్రజల్లో ఇంకా బతికే ఉంది. కాబట్టి మనం మళ్లీ పైకిలేవడం తథ్యం. కాకపోతే కొంచెం సమయం పడుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం.. విలువలు, విశ్వసనీయత. రాజకీయాల్లో ఈ పదాలకు అర్థం తెలిసి ఉండడం చాలా అవసరం. విలువలు, విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా? లేదా కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొన్ని హుందాగా నిలబడి.. ఐదు సంవత్సరాలు కళ్లు మూసుకుంటే మళ్లీ మన ప్రభుత్వం వస్తుందని గుర్తుపెట్టుకుని అడుగులు వేద్దామా అన్నది కూడా ఆలోచన చేసుకోవాలి’’ అని జగన్‌ వ్యాఖ్యానించారు.

YS-Jagan-With-Mlc.jpg

ఆయన చేశానంటున్న మంచి కంటే... చేసిన చెడే ఎక్కువని జనం ఈ ఎన్నికల్లో తేల్చేశారు. గద్దెదించి... ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మూలన కూర్చోబెట్టారు. అయినా సరే... ‘చేసిన మంచి బతికే ఉంది. మళ్లీ పైకి లేస్తాం’ అని జగన్‌ పేర్కొనడం గమనార్హం. ఇక... ఐదేళ్లపాటు వైసీపీ మూకలు చేసినన దాడులు, దౌర్జన్యాలు, హత్యలను మరిచిపోయి, ‘ ఈ రోజు వాళ్ల పార్టీకి ఓటు వేయకపోవడమే పాపం అన్నట్టుగా కొడతా ఉన్నారు. ఈ పాపం ఊరికే పోదు’ అని జగన్‌ వాపోయారు. ఐదేళ్లు ‘ప్రత్యేక హోదా’ను అటకెక్కించిన జగన్‌... ఇప్పుడు మళ్లీ ఆ పాట అందుకున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరి రెండు రోజులైనా కాకమునుపే... ‘ఎన్డీయేలో చక్రం తిప్పే పరిస్థితి వచ్చినా కూడా ప్రత్యేక హోదా అడగకపోవడం చంద్రబాబు చేసిన మరో పాపం’ అని నిందించారు. ప్రతిపక్ష నేతగా 14 నెలల పాటు పాదయాత్ర చేశానని, ఆనాటి ఓపిక ఇంకా తనకు ఉందంటూ... మళ్లీ కాళ్లకు పని చెప్పే అవకాశముందని సంకేతాలు పంపారు.

YS-Jagan-With-Mlc-2.jpg

Updated Date - Jun 14 , 2024 | 10:38 AM