Share News

వైసీపీ విధ్వంసం నిజమే

ABN , Publish Date - Jun 11 , 2024 | 02:44 AM

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల రోజు, ఆ తర్వాత వైసీపీ మూకలు విధ్వంసం సృష్టించాయని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నిర్ధారించింది..

వైసీపీ విధ్వంసం నిజమే

  • ఎన్నికల రోజు, ఆ తర్వాత రెచ్చిపోయిన వైసీపీ మూకలు

  • టీడీపీ అభ్యర్థులు, సానుభూతిపరులపై హత్యాయత్నాలు

  • పల్నాడులో ఈవీఎంలు ధ్వంసం చేసిన పిన్నెల్లి

  • గుర్తుతెలియని వ్యక్తులంటూ బీఎల్‌వో, వీఆర్వో ఫిర్యాదు

  • ఆధారాల సేకరణలో స్థానిక పోలీసులు విఫలం

  • జూలకంటి కారుపై పెట్రోలు పోసి తగులబెట్టారు

  • నరసరావుపేటలో టీడీపీ అభ్యర్థుల కార్లు ధ్వంసం

  • తాడిపత్రిలో కేతిరెడ్డి, ఆయన అనుచరుల వీరంగం

  • తిరుపతిలో పులివర్తి నానిపై చెవిరెడ్డి మనుషుల దాడి

  • డీజీపీ గుప్తాకు పూర్తిస్థాయి నివేదిక అందజేసిన సిట్‌

వైసీపీ (YSR Congress) మద్దతుదార్లు పట్టపగలే విధ్వంసం సృష్టించారు. టీడీపీ అభ్యర్థులు, సానుభూతిపరులపై హత్యాయత్నాలకు పాల్పడ్డారు. పోలీసులు వారిని అడ్డుకున్న పాపాన పోలేదు. పోలింగ్‌ బూత్‌ల్లోకి దూసుకెళ్లి ఈవీఎంలు ధ్వంసం చేశారు. ప్రిసైడింగ్‌ అధికారి కనీసం ఫిర్యాదు చేయలేదు. బీఎల్‌వో, వీఆర్వోలు ఇచ్చిన ఫిర్యాదులో ఆశ్చర్యకరంగా గుర్తుతెలియని వ్యక్తులని పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీని కనీసం పరిశీలించలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆధారాలు సరిగా సేకరించలేదు.

- ఎన్నికల హింసపై ఏర్పాటైన సిట్‌ తన నివేదికలో చేసిన కీలక వ్యాఖ్యలు

అమరావతి, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల రోజు, ఆ తర్వాత వైసీపీ మూకలు విధ్వంసం సృష్టించాయని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నిర్ధారించింది. టీడీపీ అభ్యర్థులు, సానుభూతిపరులపై దాడులు చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డారని తేల్చింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింసాత్మక ఘటనలపై వాస్తవాలను వెలికి తీసేందుకు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో ఐజీ వినీత్‌ బ్రిజిలాల్‌ నేతృత్వంలో రంగంలోకి దిగిన సిట్‌ బృందాలు క్షుణ్ణంగా దర్యాప్తు నిర్వహించి 157 పేజీల నివేదికను డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాకు సమర్పించాయి. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి పోలింగ్‌ బూత్‌లోకి దూసుకొచ్చి ఈవీఎంలు విధ్వంసం చేసిన తీరు నుంచి పోలీసు స్టేషన్లోకి చొచ్చుకెళ్లిన వైనాన్ని ఆ నివేదికలో వివరించారు. ఎన్నికల హింసపై 35 కేసులు, ఈవీఎంల ధ్వంసంపై 2 కేసులు నమోదయ్యాయని, 447మంది ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసినట్లు సిట్‌ వెల్లడించింది.

32 ఎఫ్‌ఐఆర్‌లలో అదనపు సెక్షన్లు జోడించినట్లు తెలిపింది. 25 కేసుల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఫుటేజీ తీసుకుని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పంపామని, రిపోర్టు చార్జిషీట్లకు జతచేసి కోర్టులో దాఖలు చేసినట్లు పేర్కొంది. 1,450 మందికి పైగా నిందితులు ఉన్నారని, ఇప్పటివరకూ 718మందిని అరెస్టు చేసి, మిగతా వారికి 41ఏ నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. ఎన్నికల్లో పోటీచేస్తూ చట్టవిరుద్ధంగా హింసకు పాల్పడిన, అనుచరుల్ని ప్రోత్సహించిన అభ్యర్థులకు సీడీఆర్‌లు, టవర్‌ డంప్‌ల ద్వారా మొబైల్‌ నెట్‌వర్క్‌లు అందించే డేటాతో ఉచ్చు బిగిస్తున్నట్లు చెప్పింది. ధ్వంసమైన ఈవీఎంల ముక్కలు, ఫొటోలు, వీడియోలు అన్నీ సేకరించామని పేర్కొంది. సిట్‌ ప్రధాన కార్యాలయంతో పాటు జిల్లాల్లోని సిట్‌ అధికారులకు మొత్తం 43 వినతులు అందగా టీడీపీ నుంచి 21, వైసీపీ నుంచి 19, బీజేపీ 1, ఇతరులు 2 ఇచ్చినట్లు వెల్లడించింది.

నివేదికలో మరికొన్ని కీలక ప్రస్తావనలివీ..

  • పోలింగ్‌ రోజు ఈవీఎంలు ధ్వంసం చేసి ఓటర్లలో భయాందోళనలు సృష్టించిన కేసులు 7 నమోదవగా, అన్నిట్లో వైసీపీ వారి ప్రమేయం ఉన్నట్లు ఫుటేజీల్లో స్పష్టమైంది.

  • మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరులు పాల్వాయి గేట్‌ పోలింగ్‌ స్టేషన్లో ఈవీఎం ధ్వసం చేసి, అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్‌ తల పగులగొట్టారు.

  • ఒప్పిచెర్ల పోలింగ్‌ బూత్‌లో వైసీపీ ఏజెంట్‌ పాలకీర్తి శ్రీనివాసరావు కంట్రోల్‌ యూనిట్‌ను నేలకేసి కొట్టి ధ్వంసం చేశారు.

  • టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిపై రెంటాల లూథర్‌ చర్చ్‌ వద్ద వైసీపీ మద్దతుదారులు దాడిచేసి, ఆయన కారుపై పెట్రోలు పోసి తగులబెట్టారు. టీడీపీ మద్దతుదారుడిని చంపేందుకు యత్నించినవైసీపీ అల్లరి మూకల రాళ్లదాడిలో సీఐ తల పగిలింది.

  • వైసీపీ మద్దతుదారులు వినుకొండ రహదారిలో చెక్‌పోస్టు వద్ద టీడీపీ నేత కారు ధ్వంసం చేశారు.

  • ‘టీడీపీ వాళ్లందరినీ చంపేస్తే కానీ మా జోలికి రారు నా కొ....’’ అంటూ నినాదాలు చేస్తూ ఇళ్లు, దుకాణాలు, టీడీపీ కార్యాలయాలు ధ్వంసం చేస్తూ వైసీపీ రౌడీలు వీరంగం సృష్టించారు.

  • టీడీపీకి చెందిన వేల్పుల సింహాద్రి యాదవ్‌ను హత్య చేసేందుకు 20మంది వైసీపీ అల్లరి మూకలు కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు.

  • నరసరావుపేట మండలం దొండపాడులో టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు కారుపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి.

  • తాడిపత్రిలో ప్రభాకర్‌ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్‌ రెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారుడు హర్షవర్ధన్‌ రెడ్డి 40 మంది అనుచరులతో దాడి చేశారు.

  • టీడీపీ సానుభూతిపరుడు సూర్యముని ఇంటి ముందుకెళ్లి కులం పేరుతో దూషించడంతో పాటు అంతు చూస్తామని పెద్దారెడ్డి బెదిరించారు. అడ్డుకున్న సీఐపై దాడి చేయగా ఆసుపత్రి పాలయ్యారు.

  • తిరుపతిలో టీడీపీ చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నానిపై చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డి అనుచరులు సుత్తి, ఇనుప రాడ్లు, మద్యం సీసాలు, క్రికెట్‌ బ్యాట్లతో దాడి చేశారు. నాని ఎడమ భుజానికి గాయం కాగా గన్‌మెన్‌కు రక్తగాయాలు అయ్యాయి.

  • వైసీపీ నాయకుడు కొట్టాల చంద్రశేఖర్‌రెడ్డి గుంపు తో వచ్చి చంద్రగిరిలో ఓట్లు చీల్చేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలపై కత్తులు, రాడ్లు, కర్రలు, క్రికెట్‌ స్టంప్‌లు, రాళ్లతో వైసీపీ అల్లరి మూకలు దాడి చేశాయి.

Updated Date - Jun 11 , 2024 | 07:55 AM