Share News

Andhra Pradesh :అన్నదాత నెత్తిన అప్పుల కుంపటి

ABN , Publish Date - May 09 , 2024 | 05:25 AM

రాష్ట్ర రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. తలసరి రుణ భారంలో రాష్ట్ర రైతులు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నారు. రాష్ట్రంలో ఒక్కో రైతు కుటుంబంపై రూ.2,45,554 అప్పు పేరుకుంది.

Andhra Pradesh :అన్నదాత నెత్తిన అప్పుల కుంపటి

రాష్ట్రంలో ఒక్కో రైతు కుటుంబంపై రూ.2.45 లక్షల భారం

వార్షిక ఆదాయం కన్నా రెట్టింపు బాకీలు

తలసరి రుణ భారంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఏపీ

రాష్ట్ర రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. తలసరి రుణ భారంలో రాష్ట్ర రైతులు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నారు. రాష్ట్రంలో ఒక్కో రైతు కుటుంబంపై రూ.2,45,554 అప్పు పేరుకుంది. గత డిసెంబరులో కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఏపీలో ఒక్కో రైతు కుటుంబ వార్షిక ఆదాయం సగటున రూ.1,20,760 ఉండగా, అప్పు మాత్రం అంతకు రెట్టింపు ఉంది. గత ఐదేళ్లుగా వరుస విపత్తులతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సాగు ఖర్చులు ఏడాదికేడాది పెరిగిపోతుండగా.. దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి.

దీనికితోడు తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు అంతంతమాత్రం సాయంతో సరిపెడుతున్నాయి. పీఎం కిసాన్‌ కింద రైతులకు సాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు నయా పైసా ఇవ్వట్లేదు. రాష్ట్రప్రభుత్వం లక్షన్నర మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులకు మాత్రమే రూ.13,500 అందిస్తోంది.

వాస్తవంగా రాష్ట్రంలో సగానికిపైగా కౌలురైతులు ఉన్నారు. వారిలో అగ్రవర్ణాలకు చెందిన వారు సగం కన్నా ఎక్కువే. కానీ వారికి ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహాయమూ అందట్లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లోనూ పంట సాగు హక్కు పత్రం ఉన్నవారికే పెట్టుబడి సాయం ఇస్తున్నారు. పంట రుణాలు కూడా కౌలు రైతులందరికీ ఇవ్వట్లేదు. ప్రభుత్వ రాయితీలకు ఈ-క్రాప్‌ తప్పనిసరి చేయడంతో కౌలు సాగుదారులకు లబ్ధి అందట్లేదు.

-అమరావతి, ఆంధ్రజ్యోతి

Updated Date - May 09 , 2024 | 05:25 AM