Share News

Vizag Steel Plant: విశాఖ ఉక్కుపై ఉలకడు.. పలకడు!

ABN , Publish Date - Apr 18 , 2024 | 03:31 AM

విశాఖ ఉక్కు... ఆంధ్రుల హక్కు’ అంటూ 32మంది ప్రాణత్యాగంతో సాధించుకున్న విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రం ప్రైవేటుపరం చేయడానికి సిద్ధమైంది. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, ప్రతిఘటించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రానికి మొక్కుబడిగా ఒక లేఖ రాసి ఊరుకుంది.

Vizag Steel Plant: విశాఖ ఉక్కుపై ఉలకడు.. పలకడు!

కర్మాగారం పరిరక్షణకు జగన్‌ చేసింది శూన్యం

మొక్కుబడిగా కేంద్రానికి లేఖ.. ఆపై మౌనం

పార్లమెంటులోనూ ప్రశ్నించని వైసీపీ ఎంపీలు

ఇసుక, మాంగనీస్‌ ఒప్పందాల రెన్యువల్‌కూ నో

మిగులు ఐరన్‌ఓర్‌ గనులు జిందాల్‌కు ధారాదత్తం

జగనన్న ఇళ్లకు విశాఖ స్టీల్‌ను కొనాలని అభ్యర్థన

కనీసం స్పందించని పరిశ్రమల మంత్రి అమర్‌నాథ్‌

స్టీల్‌ప్లాంటు ఉద్యోగ వర్గాలతో చర్చలకూ అయిష్టత

అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వని సీఎం జగన్‌

ప్లాంటుకు ఉన్న మిగులు భూములు అమ్ముకొని నిధులు సమకూర్చుకోవడం మంచిదని సలహా

ప్రైవేటీకరణ ప్రక్రియ ఆపుతామన్న హామీ ఏదీ?

సీఎం జగన్‌ చిత్తశుద్ధి ఇదేనా అంటూ విమర్శలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘విశాఖ ఉక్కు... ఆంధ్రుల హక్కు’ అంటూ 32మంది ప్రాణత్యాగంతో సాధించుకున్న విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రం ప్రైవేటుపరం చేయడానికి సిద్ధమైంది. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, ప్రతిఘటించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రానికి మొక్కుబడిగా ఒక లేఖ రాసి ఊరుకుంది. ఆ లేఖపై కేంద్రం ఎందుకు స్పందించలేదని హైకోర్టు ఇటీవల ప్రశ్నిస్తే... ఆ లేఖ రాయడమే గొప్ప అన్నట్టుగా జగన్‌ రోత పత్రిక పతాక శీర్షికల్లో డప్పు కొట్టేసింది. వాస్తవానికి స్టీల్‌ ప్లాంటు ప్రైవేటీకరణను ఆపాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సీఎం జగన్‌ ఏనాడూ చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదు. పైగా తెర వెనుక ఆ ప్రక్రియకు సహకారం అందిస్తున్నారు. ఎక్కడైనా సమస్య వస్తే... దానిపై సంబంధిత సంస్థ ప్రతినిధులతో చర్చించి, పరిష్కారాలు తెలుసుకొని ఆ దిశగా నాయకులు ప్రయత్నం చేస్తారు. స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణను ఎలా ఆపాలి?, ప్రత్యామ్నాయాలు ఏమిటి? అనే విషయాలు తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ మూడేళ్లలో ఎలాంటి ప్రయత్నం జరగలేదు. సీఎంను కలిసి ఇబ్బందులు చెప్పుకోవాలని ప్లాంటు అధికారులు ఎంత ప్రయత్నించినా కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదు. జగన్‌ విశాఖపట్నం వచ్చినప్పుడు ఒకసారి అన్ని కార్మిక సంఘాల నాయకులను విమానాశ్రయానికి పిలిపించుకున్నారు. వారి మనోభావాలను పూర్తిగా తెలుసుకోకుండా, తన మనసులో మాట చెప్పి పంపేశారు. మిగులు భూములు అమ్ముకొని నిధులు సమకూర్చుకోవడం మంచిదని సలహా ఇచ్చారు. అంతే తప్ప కేంద్రంతో పోరాడి ప్రైవేటీకరణ ప్రక్రియను ఆపుతామని వారికి హామీ మాత్రం ఇవ్వలేదు.

నోరెత్తని వైసీపీ ఎంపీలు

ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ ఎంపీలు ఒక్కరు కూడా స్టీల్‌ప్లాంటు సమస్యపై పార్లమెంటులో ఏనాడూ ప్రస్తావించలేదు. సాధారణంగా ఏదైనా అంశంపై కేంద్రానికి సీఎం లేఖ రాస్తే... దాని సంగతి ఏం చేశారంటూ ఆ పార్టీ ఎంపీలు పార్లమెంటులో ప్రశ్నించి సమాధానం రాబడతారు. స్టీల్‌ప్లాంటుపై జగన్‌ రాసిన లేఖపై ఒక్క వైసీపీ ఎంపీ కూడా ఏనాడూ సభాపతి ద్వారా సంబంధిత మంత్రిని ప్రశ్నించలేదు. అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ సత్యవతి స్టీల్‌ అండ్‌ కోల్‌ పార్లమెంటరీ కమిటీలో సభ్యురాలు. ఆ హోదాలో ఆమె స్టీల్‌ప్లాంటుకు వచ్చి సమస్య తెలుసుకొని నివేదిక సమర్పించే అవకాశం ఉన్నా, ఆ ప్రయత్నం చేయలేదు. వైసీపీ ఎంపీలూ ఢిల్లీలో నోరెత్తలేదు. అక్కడి వ్యవహారాలన్నీ ఆ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి, మిధున్‌రెడ్డి మాత్రమే చూసుకోవాలనేది అధినాయకుడి ఆదేశం. అందుకే విశాఖ ఉక్కు సమస్యపై ఢిల్లీలో ఎవరూ నోరెత్తలేదు.

కేంద్రానికి వైసీపీ సర్కారు సహకారం

విశాఖ ఉక్కుకు అన్ని వైపుల నుంచి సహాయం నిలిపివేసి, నష్టాల్లోకి నెట్టి, నిలబెట్టడం కష్టమని తేల్చేసి, తక్కువ ధరకు ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలనేది కేంద్ర పెద్దల ఆలోచన. దానికి వైసీపీ ప్రభుత్వం తరఫున సీఎం జగన్‌ సహకారం అందిస్తున్నారు. విశాఖ ఉక్కుకు సొంత ఐరన్‌ఓర్‌ గనులు లేవని, వాటిని కేటాయించాలని కొన్ని దశాబ్దాలుగా కోరుతున్నా అటు కేంద్రం, ఇటు రాష్ట్రం స్పందించలేదు. తాజాగా మిగులు ఐరన్‌ఓర్‌ గనులను కూడా రాష్ట్రం జిందాల్‌ కంపెనీకి కట్టబెట్టిందే తప్ప విశాఖ ఉక్కుకు ఇవ్వలేదు. ముడిపదార్థాల కోసం ఏపీ ప్రభుత్వంతో స్టీల్‌ప్లాంటుకు కొన్ని ఒప్పందాలు ఉన్నాయి. విజయనగరం జిల్లాలో ఇసుక గనులు, మాంగనీస్‌ గనులు లీజుకు ఇచ్చారు. వాటిని రెన్యువల్‌ చేయాల్సిన సమయం వచ్చింది. అనేక లేఖలు రాసినా, ప్రత్యేకంగా వెళ్లి ఆ శాఖ అధికారులను కలిసినా పునరుద్ధరించలేదు.

కాలు కదపని జగన్‌

ఆర్థిక అవసరాల కోసం స్టీల్‌ప్లాంటు గత ఏడాది ‘ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’ జారీ చేసినప్పుడు కారణం ఏదైనా సింగరేణి అధికారులను పంపించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ దీనిపై సమాచారం తెలుసుకున్నారు. కానీ సీఎం జగన్‌ మాత్రం కనీసం స్పందించలేదు. ఉత్తరాంధ్రకు చెందిన పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను స్టీల్‌ప్లాంటు అధికారులు కలసి జగనన్న ఇళ్ల నిర్మాణం కోసం విశాఖ ఉక్కును తీసుకోవాలని కోరారు. కనీసం రూ.2వేల కోట్ల సరుకు తీసుకొని నెలకు రూ.200 కోట్లు చొప్పున సాయం చేయాలని అభ్యర్థించారు. ప్రభుత్వం ఆ సాయం కూడా చేయలేకపోయింది.

తాడేపల్లికి కేంద్ర ఉక్కు మంత్రులు

విశాఖ ఉక్కు కర్మాగారం విక్రయ ప్రకటన వెలువడక ముందు కేంద్ర ఉక్కుమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తాడేపల్లి వచ్చి సీఎం జగన్‌ను కలిశారు. ఆ భేటీలో ఏ ఒప్పందం జరిగిందో తెలియదు. గతేడాది కేంద్ర ఉక్కు మంత్రి ఆర్‌సీపీ సింగ్‌ కూడా తాడేపల్లి వచ్చి జగన్‌ను కలిశారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టబోతున్నట్టు ప్రకటించిన జిందాల్‌ కంపెనీకి ఐరన్‌ఓర్‌ గనులు కేటాయించాలని కేంద్రాన్ని కోరిన జగన్‌... విశాఖ ఉక్కు సమస్యలపై ఒక్కసారి కూడా నోరు విప్పలేదు. ఇదేనా ఆయన చిత్తశుద్ధి అని కార్మిక వర్గాలు విమర్శిస్తున్నాయి.

తమిళనాడులోని సేలం స్టీల్‌ ఫ్యాక్టరీని విక్రయిస్తామని కేంద్రం ప్రకటించినప్పుడు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అసెంబ్లీని సమావేశపరిచి, సుదీర్ఘంగా చర్చింది. అమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పు కోబోమని తీర్మానించింది. సీఎం, ప్రతిపక్ష నాయకుడు కలసి ఢిల్లీ వెళ్లి ఆ తీర్మానం కాపీని అందజేసి నిరసన వ్యక్తంచేశారు. ఇదే అంశంపై ఆ రాష్ట్ర ఎంపీలు పార్లమెంటులో అనేకసార్లు గళమెత్తారు.

కర్ణాటకలో భద్రావతి ఉక్కు కర్మాగారాన్ని మూసేస్తామని కేంద్రం ప్రకటించినప్పుడు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. నాటి సీఎం సిద్ధరామయ్య, యడియూరప్ప ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో మాట్లాడారు.

విశాఖ ఉక్కును 100 శాతం అమ్మేస్తామని 2021 జనవరి 27న కేంద్రం ప్రకటించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించలేదు. తరువాత తీరుబడిగా బడ్జెట్‌ సమావేశాల్లో దీనిపై ఓ పది నిమిషాలు చర్చించి ఏకవాక్య తీర్మానం చేసింది. దానిని కూడా మొక్కుబడిగా కేంద్రానికి పంపి ఊరుకుంది. ఆ తరువాత తీరిగ్గా సీఎం ఇంకో లేఖ రాశారు. అది రాసి రెండేళ్లు దాటింది. ఆ తరువాత అనేకసార్లు జగన్‌ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశారు. ఒక్కసారి కూడా విశాఖ ఉక్కుపై మాట్లాడలేదు.

Updated Date - Apr 18 , 2024 | 07:33 AM