Share News

గురుకుల పాఠశాలలో దారుణం

ABN , Publish Date - Sep 02 , 2024 | 11:12 PM

లక్కిరెడ్డిపల్లెలోని అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న బాలికపై ప్రిన్సిపాల్‌ భర్త లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో పాఠశాలలోని విద్యార్థినులు సోమవారం తరగతులకు వెళ్లకుండా ధర్నాకు దిగి నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు.

గురుకుల పాఠశాలలో దారుణం
విద్యార్థినులతో మాట్లాడుతున్న మంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి

అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాలలో ఘటన

నిందితుడు పాఠశాల ప్రిన్సిపాల్‌ భర్త

ప్రిన్సిపాల్‌ భర్తపై పోక్సోతో పాటు ఎస్సీ, ఎస్టీ, కేసుల నమోదు

బాలిక తల్లిదండ్రులను పరామర్శించిన మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

లక్కిరెడ్డిపల్లె, సెప్టెంబరు 2 : లక్కిరెడ్డిపల్లెలోని అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న బాలికపై ప్రిన్సిపాల్‌ భర్త లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో పాఠశాలలోని విద్యార్థినులు సోమవారం తరగతులకు వెళ్లకుండా ధర్నాకు దిగి నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ పాఠశాలకు వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేయడమే కాకుండా ఆమెపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఆమె భర్తపై పోక్సోతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని మంత్రి, కలెక్టర్‌ పోలీసులను ఆదేశించారు. వివరాలిలా ఉన్నాయి. అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాలలో పరిమళ అనే ప్రిన్సిపాల్‌ ఎఫ్‌ఏసీగా పనిచేస్తోంది. ఆమె పాఠశాల ఆవరణంలోని క్వార్టర్స్‌లోనే నివాసం ఉంటోంది. ఆదివారం అర్ధరాత్రి ప్రిన్సిపాల్‌ భర్త బాలసుబ్బయ్య హాస్టల్‌లోకి వెళ్లి 5వ తరగతి చదువుతున్న విద్యార్థినిని దగ్గరకు పిలిచి లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ బాలిక భయంతో ఎవరికీ చెప్పకుండా ఉండిపోయింది. ఈ విషయాన్ని తోటి బాలికలు గుర్తించి రాత్రి డ్యూటీలో ఉన్న టీచర్‌కు తెలపగా ఆమె వెంటనే బాలికను విచారించి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించింది. ఈ విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్‌ బాలికలను పిలిపించి ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే మీకు టీసీలు ఇచ్చి పంపిస్తానని బెదిరించింది. అనంతరం ఈ విషయం ఎలాగో బయటపడటంతో విద్యార్థినులు పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు. అక్కడికి వెళ్లిన విలేకరులకు విద్యార్థినులు తమ బాధను చెప్పుకున్నారు. గతంలో ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్‌ కమలాపురానికి బదిలీపై వెళ్లడంతో దీంతో ఇక్కడ సీనియర్‌గా ఉన్న పరిమళకు ఎఫ్‌ఏసీ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు అప్పగించారని, ఆమె బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థినులను వేధింపులకు గురి చేస్తోందని వాపోయారు. ప్రిన్సిపాల్‌ భర్త బాలసుబ్బయ్య చిన్న కాంట్రాక్ట్‌ పనులు చేసుకుంటూ రాత్రి అయ్యేసరికి ఫుల్‌గా మద్యం తాగేవాడని, అతడితో పాటు మరో ముగ్గురిని పాఠశాలలోకి పిలిపించుకుని ఇక్కడే మద్యం తాగుతారని తెలిపారు. అంతేకాకుండా వారు మద్యం తాగడానికి తమ చేత తినుబండారాలను కూడా ప్రిన్సిపాల్‌ తెప్పించి తన భర్తకు ఇచ్చేదని వాపోయారు. ఉదయం 10వ తరగతి, ఇంటర్‌ విద్యార్థినులు స్నానాలు చేసేటప్పుడు లోపలికి వచ్చి చూసేవాడని, ఆడపిల్లలను ఫొటోలు, వీడియోలు తీసి బెదిరించేవాడని ఇంటర్‌ విద్యార్థినులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంఈవోలు చక్రేనాయక్‌, వెంకటసుబ్బయ్య, తహసీల్దార్‌ లక్ష్మిప్రసన్న, ఎంపీడీవో వెంకటరామిరెడ్డి పాఠశాలకు చేరుకుని ఆందోళన చేస్తున్న విద్యార్థినులకు నచ్చచెప్పినా వారు వినకుండా వెంటనే ప్రిన్సిపాల్‌ను తొలగించాలని, ఆమె భర్తను ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న రామాపురం, లక్కిరెడ్డిపల్లె ఎస్‌ఐలు రవీంద్రబాబు, సుధాకర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థినులకు నచ్చచెప్పి తరగతి గదుల్లోకి పంపించారు

మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పరామర్శ

బాలికపై జరిగిన సంఘటన విషయం తెలిసిన వెంటనే మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వాస్పత్రికి వెళ్లి జరిగిన సంఘటనపై ఆరా తీశారు. ఆసుపత్రిలో ఉన్న బాలికను పరామర్శించి బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం తరపున అన్నివిధాలుగా ఆదుకుంటామని, బాలికకు లక్ష రూపాయలు ఆర్థికసాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గురుకుల పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులు, విద్యార్థినులతో మాట్లాడారు. పరిమళ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యార్థినులు, ఉపాధ్యాయులకు నరకం చూపిస్తోందని వాపోయారు. మాకు రావాల్సిన గుడ్లు, చిక్కీ, కాస్మొటిక్‌ ఫీజు, మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా ఆమె ఇంటికి సరుకులన్నీ తరలిస్తోందని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే టీసీలు ఇచ్చి పంపిస్తానని బెదిరిస్తోందని మంత్రికి తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి రాంప్రసాద్‌రెడ్డి విషయాన్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి తెలియచేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పేద విద్యార్థుల కడుపుకొడుతున్న ప్రిన్సిపాల్‌ను వెంటనే సస్పెండ్‌ చేసి ఆమె భర్తపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు లక్కిరెడ్డిపల్లె పోలీసులు పోక్సోతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారు

పోక్సో కేసు నమోదు చేయండి

కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌

కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి సంఘటన గురించి విద్యార్థినులు, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. బాలికల పాఠశాలలో ప్రత్యేక నిఘా పెట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బాలికలు కలెక్టర్‌ ఎదుట భోరున విలపించారు. మాకు చాలా అన్యాయం జరుగుతోందని, ఈ ప్రిన్సిపాల్‌ మాకొద్దు సార్‌.. వెంటనే ఆమెను తొలగించండని కోరారు. ప్రిన్సిపాల్‌ భర్తకు ఎవరైనా విద్యార్థినులు ఎదురెళితే వారి శరీరంపై ఎక్కడెక్కడో చేతులు వేస్తాడని, ప్రిన్సిపాల్‌ మా ఫొటోలు తీసి ఆమె భర్తకు పంపుతుందని, చాలా అసభ్యంగా ప్రవర్తిస్తోందని కన్నీటి పర్యంతమయ్యారు. స్నానం చేసే సమయంలో బాత్రూలోకి వస్తాడని, భయబ్రాంతులకు గురి చేస్తాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్‌ వెంటనే ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేయడమే కాకుండా ఆమె మీద, ఆమె భర్త మీద పోక్సో కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ప్రిన్సిపాల్‌తో పాటు హెల్త్‌ సూపర్‌వైజర్‌ లక్ష్మిదేవి, సెక్యూరిటీ గార్డు నాగలక్ష్మిలను సస్పెండ్‌ చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో రంగస్వామి, డీసీవో మాధవీలత, అన్ని శాఖల అధికారులు ఉన్నారు.

Updated Date - Sep 02 , 2024 | 11:19 PM