Share News

Sharmila: అదానీని కాపాడేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు.. కేంద్రంపై షర్మిల ధ్వజం

ABN , Publish Date - Aug 22 , 2024 | 12:03 PM

అదానీని కాపాడేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపణలు చేశారు. గురువారం నాడు విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

Sharmila: అదానీని కాపాడేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు.. కేంద్రంపై షర్మిల ధ్వజం

విజయవాడ: అదానీని కాపాడేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. గురువారం నాడు విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ, అదానీపై షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. బ్రిటిష్ వారిపై నిస్వార్థంగా పోరాడి, స్వేచ్ఛనే లక్ష్యంగా కాంగ్రెస్ పోరాటం చేసిందని వివరించారు.

అలుపెరగని సుదీర్ఘ సమరం చేసి, దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిందని చెప్పారు. ఈరోజు, మరోసారి, ప్రజాధనాన్ని లూటీ చేస్తూ, ప్రజల ఆస్తులను విచక్షణారహితంగా దోచుకుంటున్నకార్పొరేట్ జలగలను తరిమికొడతామని హెచ్చరించారు. వారిని పెంచిపోషిస్తున్న, వారిచేతిలో ఉన్న రిమోట్ కంట్రోల్‌తో నడుస్తున్న మోదీ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ, దేశం కోసం మరొక పోరాటం సాగిస్తోందని షర్మిల ఉద్ఘాటించారు.


మోదీ సర్కారు దివాళాకోరుతనం..

‘‘సెబీ చీఫ్ మాధబి పూరీపై వచ్చిన తీవ్ర ఆరోపణలపై విచారణ జరపకుండా, అదానీ పెట్టుబడులకు సంబంధించి ఆమె పాత్ర గురించి యావత్ దేశం నిరసన తెలుపుతున్న వేళ, నిమ్మకు నీరెత్తకుండా, మౌనం వహిస్తూ, పైపెచ్చు అటు ఆమెను, ఇటు అదానిని కాపాడే కుటిల ప్రయత్నాలను మోదీ చేస్తున్నారు. మోదీ సర్కారు దివాళాకోరుతనాన్ని నిరసిస్తూ, ఇండియా కూటమి నేడు దేశవ్యాప్తంగా ఈడీ ఆఫీసుల ఎదుట ధర్నాలు నిర్వహిస్తోంది. దేశంలోని 10 కోట్ల మంది పెట్టుబడిదారుల ఆందోళనను ఏమాత్రం పట్టించుకోకుండా, నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తున్న బీజేపీ సర్కారును నిలదీస్తూ, మాదబీ పూరి విషయంలో వెనువెంటనే JPC వేసి, సీబీఐ, ఈడీ సమగ్ర విచారణకు ఆదేశించాలని, 140 కోట్ల ప్రజల తరపున కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది’’ అని షర్మిల పేర్కొన్నారు.


అదానీపై దర్యాప్తు చేయాలి..

‘‘ఇలాంటి క్యాపిటలిస్టు రక్కసి ధోరణిని ప్రజలమీదకు రుద్దుతూ, ప్రభుత్వ సంస్థలను తన జేబుసంస్థలుగా మార్చి, కేవలం ప్రతిపక్షాల మీద కక్షపూరిత దాడులకు మాత్రమే వాటిని వాడుకునే మోదీ నియంత పాలనపై కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుంది. అదానీ లాభాలు మోదీ లాభాలుగా, అదానీ సంస్థల వృద్ధి, బీజేపీ వృద్ధిగా మారిన దారుణ పరిస్థితుల్లోకి మోదీ దేశాన్ని నెట్టేశారు. అదానీపై దర్యాప్తు ప్రారంభించడం ప్రభుత్వానికి నైతిక,వృత్తిపరమైన బాధ్యత. ఇంత తీవ్రమైన ఆరోపణపై మౌనం వహించి, ఎదురు, మీ కార్పొరేట్ మిత్రులను కాపాడటానికి అన్ని కుటిల మార్గాలను వాడుకోవటం ఎంతో సిగ్గుచేటు’’ అని షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Aug 22 , 2024 | 12:07 PM