Share News

ఆరు నెలల కిందట.. అవన్నీ నిజాలే!

ABN , Publish Date - Jul 27 , 2024 | 03:42 AM

‘‘రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోంది.

ఆరు నెలల కిందట.. అవన్నీ నిజాలే!

జగన్‌ వ్యాఖ్యలపై జనం చురకలు

విపక్షంలోకి రాగానే ‘అరాచక’ మాటలు

ఐదేళ్ల గతం మరచి ‘రివర్స్‌’ వ్యాఖ్యలు

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘‘రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోంది. రివర్స్‌ పాలన నడుస్తోంది. బాధితులపైనే పోలీసులు హత్యాయత్నం కేసులు పెడుతున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు’’... కొన్నాళ్లుగా జగన్మోహన్‌ రెడ్డి పదేపదే చెబుతున్న మాటలివి! ‘ఔను.. ఆయన చెబుతున్నవన్నీ నిజాలే! అయితే... ఆరు నెలల కిందటి వరకు పరిస్థితి ఇలాగే ఉండేది. ఆ విషయాలనే జగన్‌ ఇప్పుడు చెబుతున్నట్లుంది’’ అని విశ్లేషకులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. ‘అరాచకం, అన్యాయం, దౌర్జన్యం, రాష్ట్రపతి పాలన విధించాలి, ప్రజాస్వామ్యం చచ్చిపోయింది’... అంటూ విపక్షంలోకి వచ్చిన రోజు నుంచే జగన్‌ వాపోతున్నారు. తన ఐదేళ్ల పాలన గురించే జగన్‌ ఈ మాటలు అంటున్నట్లుందని.. ఆయన వ్యాఖ్యలు వింటుంటే నాటి పరిస్థితులు మళ్లీ కళ్లముందు కదలాడుతున్నాయని జగన్‌ బాధితులు పేర్కొంటున్నారు. ‘పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మిథున్‌ రెడ్డి పలుమార్లు ఎన్నికల్లో గెలిచారు కాబట్టి వాళ్లు మంచోళ్లు’ అంటూ జగన్‌ చేసిన సూత్రీకరణ కూడా నవ్వు తెప్పిస్తోంది. తాజా ఎన్నికల్లో 164 మంది వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారు. 21 మంది ఎంపీ అభ్యర్థులూ పరాజయం పాలయ్యారు. అంటే... వాళ్లంతా చెడ్డోళ్లని జగన్‌ ఒప్పుకున్నట్లేనా!? ఎన్నికల ప్రచార సభలో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని ‘మంచోడు’ అన్నప్పుడే... జగన్‌ భాషలో మంచి, చెడుకు అర్థాలు వేరని తేలిపోయింది. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడూ వరుసగా ఎన్నికల్లో గెలుస్తున్నారు. వాళ్లపై జగన్‌ కేసులు బనాయించారు. మరి... ఆయన సూత్రీకరణప్రకారం మంచి వాళ్లపైన కేసులు పెట్టకూడదు కదా!? ఇవేకాదు... దాదాపు రెండు గంటల ప్రెస్‌మీట్‌లో జగన్‌ అనేక అంశాలను అసంబద్ధంగా, గజిబిజిగా మాట్లాడారు. స్పిల్‌ వే పనులు పూర్తి చేయకుండా కాఫర్‌ డ్యామ్‌ లు నిర్మించడంవల్ల మెయిన్‌ డ్యామ్‌లోని మూడు డయాఫ్రమ్‌వాల్స్‌ దెబ్బతిన్నాయని జగన్‌ వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టులో ఉన్నదే ఒకే డయాఫ్రమ్‌వాల్‌! మరో రెండు ఎక్కడి నుంచి వచ్చాయో జగన్‌కే తెలియాలి. విద్యుత్‌ చార్జీలు పెంచబోమంటున్న చంద్రబాబు ట్రూఅప్‌ చార్జీలపై నోరుమెదపడంలేదని కూడా జగన్‌ విమర్శించారు. తన హయాంలో అడ్డగోలుగా వేసిన ట్రూఅప్‌ చార్జీలను కొత్త ప్రభుత్వం రద్దు చేయాలనడం వింతల్లోకెల్లా వింత!

రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 36 రాజకీయ హత్యలు జరిగాయంటూ ఢిల్లీ నుంచి గల్లీ దాకా జగన్‌ రచ్చ చేస్తున్నారు. కానీ... శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ లెక్క చెప్పలేదు. పైగా... నలుగురే హత్యకు గురయ్యారన్నట్లుగా మాట్లాడారు. జగన్‌ను చంద్రబాబు కొలంబియా డాన్‌ పాబ్లో ఎస్కోబార్‌తో పోల్చడంపై ప్రశ్నించినప్పుడు .. జగన్‌ అర్థం కానట్లుగా ము ఖంపెట్టారు. ఆ పేరును పలికేందుకు తడబడ్డారు.

మళ్లీ యెలహంక ప్యాలె్‌సకు...

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాక.. రాష్ట్ర ప్రజలపై కోపమో ఏమోగానీ... తాడేపల్లి ప్యాలె్‌సకు జగన్‌ దూ రంగా ఉంటున్నారు. వినుకొండలో హత్యకు గురైన రషీద్‌ కుటుంబ సభ్యుల పరామర్శ సందర్భంగా హుటాహుటిన బెంగళూరు యెలహంక ప్యాలెస్‌ నుంచి వచ్చిన జగన్‌ దంపతులు శుక్రవారం మళ్లీ యెలహంకకు వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బెంగళూరు చేరుకున్నారు. మూడురోజుల పాటు అక్కడే బస చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Updated Date - Jul 27 , 2024 | 03:43 AM