Share News

Andhrajyothy: చీ.. ఛీ జగన్.. ‘ఆంధ్రజ్యోతి’ ఫొటోగ్రాఫర్‌పై వైసీపీ మూకల దాడి.. తిట్టేస్తున్నారు!

ABN , Publish Date - Feb 19 , 2024 | 11:41 AM

YSRCP Attack On Andhrajyothy Photo Grapher: ‘సిద్ధం’ అంటూ ప్రకటనలు చేస్తున్న ఏపీ సీఎం జగన్‌ అసలు నైజం మరోసారి బయటపడింది. ప్రశ్నిస్తే కేసులు.. ఎదురుతిరిగితే దాడులు.. అన్నట్టు సాగుతున్న జగన్‌ మార్కు రాజకీయం మరింతగా దిగజారింది. రాప్తాడులో జగన్‌ సభను కవర్‌ చేయడానికి వెళ్లిన ‘ఆంధ్రజ్యోతి’ అనంతపురం స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై పెనుదాడి జరిగింది. ఆదివారం జరిగిన ‘సిద్ధం’ సభ కవరేజీకి వెళ్లిన ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి ప్రతినిధులే లక్ష్యంగా ముందే దాడికి వైసీపీ మూకలు అంతా ‘సిద్ధం’ చేసుకున్నాయి...

Andhrajyothy: చీ.. ఛీ జగన్.. ‘ఆంధ్రజ్యోతి’ ఫొటోగ్రాఫర్‌పై వైసీపీ మూకల దాడి.. తిట్టేస్తున్నారు!

‘సిద్ధం’ అంటూ ప్రకటనలు చేస్తున్న ఏపీ సీఎం జగన్‌ అసలు నైజం మరోసారి బయటపడింది. ప్రశ్నిస్తే కేసులు.. ఎదురుతిరిగితే దాడులు.. అన్నట్టు సాగుతున్న జగన్‌ మార్కు రాజకీయం మరింతగా దిగజారింది. రాప్తాడులో జగన్‌ సభను కవర్‌ చేయడానికి వెళ్లిన ‘ఆంధ్రజ్యోతి’ అనంతపురం స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై పెనుదాడి జరిగింది. ఆదివారం జరిగిన ‘సిద్ధం’ సభ కవరేజీకి వెళ్లిన ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి ప్రతినిధులే లక్ష్యంగా ముందే దాడికి వైసీపీ మూకలు అంతా ‘సిద్ధం’ చేసుకున్నాయి. ‘మీరు ఆంధ్రజ్యోతా’ అంటూ పత్రిక పేరు ఆరా తీసి.. ఎంపిక చేసుకుని మరీ ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై విచక్షణారహితంగా వైసీపీ మూకలు విరుచుకుపడ్డాయి. తమ చేతుల్లోని వైసీపీ జెండా కర్రలతో శ్రీకృష్ణపై కర్రలతో పటపటా.. మని కొడుతూ, దెబ్బలవర్షం కురిపించారు. సిద్ధం సభా వేదిక నుంచి దాదాపు అర కిలోమీటరు వరకు కొట్టుకుంటూ తీసుకెళ్లారు. దెబ్బలను తప్పించుకోవడానికి అడ్డుపెట్టిన చేతులపై, కాళ్లపై కర్రలతో కొట్టారు. చేతులతో పిడిగుద్దులు గుద్దారు. తప్పించుకునే ప్రయత్నం చేసినా వదలకుండా.. వెంటాడారు. అక్కడున్న కొందరు శ్రీకృష్ణను వారినుంచి కాపాడటానికి ప్రయత్నించగా, వారిపైనా దాడిచేశారు. శ్రీకృష్ణ వంటిపై వాతలు తేలేలా కొడుతూనే ఉన్నారు. ఒకదశ వరకు ప్రతిఘటనకు ఆయన ప్రయత్నించారు. ఆ తర్వాత శ్రీకృష్ణ సొమ్మసిల్లిపడిపోయారు. స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు శ్రీకృష్ణను తరలిస్తున్నారు.


ఇంత దారుణమా..?

ఈ దాడిని వైసీపీ సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. ఇక ప్రతిపక్ష పార్టీల అధినేతలు, నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. జర్నలిస్టు యూనియన్లు, ప్రజా సంఘాలు జగన్ సర్కార్‌పై దుమ్మెత్తి పోస్తున్నాయి. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన మీడియాను జగన్‌రెడ్డి కక్షతో కూలగొడుతున్నారని తెలుగుదేశం నేతలు కన్నెర్రజేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేష్.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ.. పలు రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

వైసీపీ అరాచకాలకు: సోమిరెడ్డి

అనంతపురంలో ఆంధ్రజ్యోతి ఫొటో గ్రాఫర్ కృష్ణపై దాడి వైసీపీ అరాచకాలకు పరాకాష్ట అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ నేతల్లో ఓటమి భయంతో కూడిన ఫ్రస్ట్రేషన్‌ పీక్‌కు చేరిందన్నారు. అందులో భాగమే మొన్న అమరావతిలో ఈనాడు రిపోర్టర్‌పై దాడికి తెగబడ్డారని.. నిన్న అనంతపురంలో పోలీసుల సమక్షంలోనే ఆంధ్రజ్యోతి ఫొటో గ్రాఫర్‌ను విచక్షణరహితంగా కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో భాగంగా జర్నలిస్టు ఫొటోలు తీస్తుంటే వైసీపీ నేతలకు అంత ఉలుకెందుకో అని ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వానికి భారత రాజ్యాంగం అంటే పూర్తిగా లెక్కలేకుండా పోయిందన్నారు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాపైనా దారుణాలకు దిగుతుంటే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడిదన్నారు. పత్రికలన్నీ సాక్షిలాగా అబద్ధాలు రాసుకుంటూ భజన చేయాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారా అంటూ విరుచుకుపడ్డారు. సాక్షి వార్తలు రాయడం ఎప్పుడో మరిచిపోయిందని... ఆ పత్రిక ఉండేది ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలకు ఫేక్ కౌంటర్లు రాసుకోవడం కోసమే అని వ్యాఖ్యలు చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జర్నలిస్టులందరికీ సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని.. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

అనంతలో ఏపీయూడబ్ల్యూజే నిరసన..

ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడిని ఖండిస్తూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సోమవారం ఉదయం ఎస్పీ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు బైఠాయించి నిరసనకు దిగారు. రౌడీ మూఖలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మీడియా స్వేచ్ఛను కాపాడాలన్నారు. మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్పీ కార్యాలయం ముట్టడించిన జర్నలిస్టులు ప్రజాసంఘాల నేతలు యత్నించారు. ఎస్పీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎస్పీ కార్యాలయం వద్దకు భారీగా సీపీఐ నేతలు చేరుకున్నారు.

శ్రీకృష్ణకు పరామర్శలు...

వైఎస్సార్సీపీ మూకల దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణను పలువురు రాజకీయ నేతలు పరామర్శించారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌పై వైసీపీ మూకల దాడిని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీకృష్ణను సోమవారం ఉదయం మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ, ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్, సత్య సాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బికే పార్థసారథి, సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రాంభూపాల్ పరామర్శించారు. కాగా.. శ్రీకృష్ణకు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 19 , 2024 | 11:52 AM