Share News

CM Chandrababu: కూటమి నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఏం చెప్పారంటే..?

ABN , Publish Date - Aug 13 , 2024 | 10:22 AM

విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి దూరంగా ఉండనుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయంతో పోటీకి దూరంగా కూటమి నేతలు ఉండనున్నారు.

CM Chandrababu: కూటమి నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఏం చెప్పారంటే..?

అమరావతి: విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి దూరంగా ఉండనుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయంతో పోటీకి దూరంగా కూటమి నేతలు ఉండనున్నారు. మంగళవారం నాడు టెలికాన్పరెన్స్‌లో తన అభిప్రాయాన్ని కూటమి నేతలకు చంద్రబాబు తెలిపారు. చంద్రబాబు అత్యంత హూందాగా వ్యవహరించారని కూటమి నేతలు కొనియాడారు. అధికారంలో ఉండి... గెలిచే అవకాశం ఉన్నా రాజనీతిజ్ఞుడిలా చంద్రబాబు వ్యవహరించారని నేతలు ప్రశంసలు కురిపించారు.


గెలవాలంటే పెద్ద కష్టం కాదు...కానీ హూందా రాజకీయాలు చేద్దామని నేతలతో అన్నారు. చంద్రబాబు నిర్ణయాన్ని కూటమి పక్షనేతలు, జిల్లా నేతలు ఆమోదించారు. నాటి స్థానిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ అక్రమాల కారణంగా నాడు ఎన్నికల్లో పోటీకీ దూరంగా టీడీపీ ఉందని చెప్పారు. అధికార మార్పిడి తర్వాత స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున కూటమి వైపు వచ్చారని వివరించారు. గెలుపు కాదు ప్రజల అభిప్రాయలు, విలువలు ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం ముందున్న లక్ష్యం రాష్ట్ర పునర్నిర్మాణం అన్నివర్గాల అభివృద్ధి అని చంద్రబాబు ఈ సమావేశంలో కూటమి నేతలకు చంద్రబాబు తెలిపారు.


ఎమ్మెల్యేలు ఓకే చెప్పినా..

మరోవైపు.. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీచేయరాదని టీడీపీ అధినాయకత్వం నిర్ణయించింది. టీడీపీ కూటమి పక్షాల బలం పరిమితంగా ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. జీవీఎంసీ కార్పొరేటర్లు, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపల్‌ కౌన్సిలర్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఇందులో ఓటర్లు. వీరిలో 60 శాతానికిపైగా వైసీపీ నుంచి గెలిచిన వారే.


పోటీ పెడితే.. గెలిపిస్తామని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు ముందుకు వచ్చినా.. అంత ప్రయాస పడి గెలవాల్సిన అవసరం లేదని నాయకత్వం భావించింది. ఒక ఎమ్మెల్సీ సీటు కోసం అంతమందిని ప్రత్యర్ధి పార్టీ నుంచి సమీకరించాల్సిన అవసరం లేదని, దాని వల్ల వచ్చే ప్రయోజనం కూడా లేదని అభిప్రాయపడినట్లు సమాచారం. నామినేషన్ల దాఖలుకు మంగళవారం చివరి రోజు. వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్‌ సక్రమమని తేలితే ఆయన ఎన్నిక ఏకగ్రీవమవుతుంది.


వైసీపీ అభ్యర్థిగా బొత్స నామినేషన్‌

స్థానిక సంస్థల కోటాలో ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మూడు సెట్ల నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. సోమవారం ఆయన రిటర్నింగ్‌ అధికారి, విశాఖ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌కు సమర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బలం లేదని తెలిసి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని నిలబెడితే దుశ్చర్య అవుతుందని వ్యాఖ్యానించారు.


మొత్తం 838 ఓట్లలో వైసీపీకి 530 ఓట్లు ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమానికి అరకు ఎంపీ తనూజరాణి, నగర మేయర్‌ గొలగారి హరివెంకటకుమారి, మాజీ మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్‌, కురసాల కన్నబాబు, మాజీ ఎంపీ బొత్స ఝూన్సీ తదితరులు హాజరయ్యారు. పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి వైవీ సుబ్బారెడ్డి కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం వరకు వచ్చి నాయకులను కలిసి వెళ్లిపోయారు. స్వతంత్ర అభ్యర్థిగా షేక్‌ సఫీ నామినేషన్‌ వేశారు.

Updated Date - Aug 13 , 2024 | 12:20 PM