Share News

Ap Politics: మైలవరంలో యథేచ్ఛగా కోడ్‌ ఉల్లంఘన..!

ABN , Publish Date - May 13 , 2024 | 04:57 AM

మైలవరం వైసీపీ అభ్యర్థి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. శనివారంతో సార్వత్రిక ఎన్నికల ప్రచారం గడువు ముగిసినా.. 144 సెక్షన్‌ అమల్లో ఉన్నా..

Ap Politics: మైలవరంలో యథేచ్ఛగా కోడ్‌ ఉల్లంఘన..!

గడువు ముగిసినా వైసీపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం

అధికార పార్టీకి కొమ్ముకాసిన పోలీసులు, అధికారులు

ఫొటోలు తీస్తున్న ‘ఆంధ్రజ్యోతి’ విలేకరికి బెదిరింపులు

మైలవరం, మే 12: మైలవరం వైసీపీ అభ్యర్థి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. శనివారంతో సార్వత్రిక ఎన్నికల ప్రచారం గడువు ముగిసినా.. 144 సెక్షన్‌ అమల్లో ఉన్నా.. మందీమార్బలంతో ఆదివారం రాత్రి ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం పట్టణంలోని యాదవుల బజారులో యథేచ్ఛగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ప్రచారాన్ని అడ్డుకునేందుకు పోలీసులు, అధికారులు అటువైపు రాకపోవడం గమనార్హం. వైసీపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారాన్ని చిత్రీకరిస్తున్న ‘ఆంధ్రజ్యోతి’ విలేకరిపై సర్నాల బంధుగణం బెదిరింపులకు దిగింది. ఎన్నికలయ్యాక నీ అంతు చూస్తామని బెదిరించి ఫొటోలు మొబైల్‌ ఫోన్‌ నుంచి డిలీట్‌ చేయాలని భయపెట్టారు.

విషయం చెప్పేందుకు పోలీసులకు విలేకరి ఫోన్‌ చేసినా స్పందించలేదు. ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవాల్సిన ఎంపీడీవో జాడలేదు. ‘మా బజారులో ఇంతవరకు నేను ఓటర్లను కలవలేదు.. మావాళ్లని ఓట్లు అడగొద్దంటారా..’’ అని తిరుపతిరావు ఎదురు ప్రశ్నించడంతో స్థానికులు విస్తుపోయారు.

Updated Date - May 13 , 2024 | 04:59 AM