Share News

ప్రతి 10 మందిలో ఏడుగురికి నష్టాలే...

ABN , Publish Date - Jul 25 , 2024 | 04:53 AM

డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌లోనే కాదు... ఈక్విటీ క్యాష్‌ విభాగంలోని ఇంట్రా డే ట్రేడింగ్‌లోనూ రిటైల్‌ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారు. ఇలా ట్రేడింగ్‌ చేసే ప్రతి పది మంది రిటైల్‌ మదుపరుల్లో ఏడుగురు నష్టపోతున్నట్టు సెబీ...

ప్రతి 10 మందిలో ఏడుగురికి నష్టాలే...

ఇంట్రా డే క్యాష్‌ ట్రేడింగ్‌పై సెబీ నివేదిక

న్యూఢిల్లీ: డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌లోనే కాదు... ఈక్విటీ క్యాష్‌ విభాగంలోని ఇంట్రా డే ట్రేడింగ్‌లోనూ రిటైల్‌ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారు. ఇలా ట్రేడింగ్‌ చేసే ప్రతి పది మంది రిటైల్‌ మదుపరుల్లో ఏడుగురు నష్టపోతున్నట్టు సెబీ తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెబీ జరిపిన ఒక అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఇలా నష్టాలు వస్తున్నా ఇంట్రా డే ఈక్విటీ క్యాష్‌ సెగ్మెంట్‌లో ట్రేడింగ్‌ చేసేందుకు మదుపరులు ఏ మాత్రం వెనకాడడం లేదు. 2018-19తో పోలిస్తే 2022-23లో ఇలా ట్రేడింగ్‌ చేసే మదుపరుల సంఖ్య మూడు రెట్లు పెరగడమే ఇందుకు నిదర్శనం. లాభాలు సంపాదించిన వారి కంటే, నష్టపోయిన వారే, మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మళ్లీ మళ్లీ ఇంట్రా డే ఈక్విటీ క్యాష్‌ ట్రేడింగ్‌లోకి ప్రవేశిస్తున్నట్టు సెబీ అధ్యయనం తెలిపింది.


ప్రతి ముగ్గురిలో ఒకరు

ఈక్విటీ క్యాష్‌ సెగ్మెంట్‌లో ట్రేడింగ్‌ చేసే ప్రతి ముగ్గురిలో ఒకరు ఇంట్రా డే ఈక్విటీ ట్రేడింగ్‌ చేస్తున్నట్టు సెబీ అధ్యయనంలో తేలింది. వీరిలో 48 శాతం మంది 30 ఏళ్ల కంటే తక్కువ వయస్కులే ఉన్నారు. 2018-19లో వీరి పాత్ర 18 శాతం మాత్రమే. కొవిడ్‌ తర్వాత యువకులు పెద్ద సంఖ్యలో స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీల్లోకి ప్రవేశించడం ఇందుకు ప్రధాన కారణం. టెక్నాలజీతో బాగా పరిచయం ఉన్న వీరిలో ఎక్కువ మంది ఇంట్రా డే ఈక్విటీ క్యాష్‌ ట్రేడింగ్‌ సైతం చేస్తున్నారు. అయితే ఇలా ట్రేడింగ్‌ చేసే యువకుల్లో 76 శాతం మంది ఇంట్రా డే క్యాష్‌ ట్రేడింగ్‌లోనూ నష్టపోతున్నట్టు సెబీ అధ్యయనం తెలిపింది.

Updated Date - Jul 25 , 2024 | 04:53 AM