కొనసాగిన అమ్మకాల జోరు
ABN , Publish Date - May 09 , 2024 | 05:30 AM
దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 45.46 పాయింట్ల నష్టంతో 73.466.39 వద్ద ముగిసింది. ఇంట్రా డేలో ఒక దశలో 437.93 పాయింట్ల వరకు...
45 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 45.46 పాయింట్ల నష్టంతో 73.466.39 వద్ద ముగిసింది. ఇంట్రా డేలో ఒక దశలో 437.93 పాయింట్ల వరకు నష్టపోయి 73,073.92 పాయింట్లను తాకింది. నిఫ్టీ మాత్రం ఎదుగూ బొదుగూ లేకుండా 22,302.50 పాయింట్ల వద్ద క్లోజైంది. ఐటీ కంపెనీలతో పాటు ప్రైవేటు బ్యాంకుల షేర్లలో అమ్మకాలు, ఎఫ్పీఐల అమ్మకాలు బుధవారం మార్కెట్ను దెబ్బతీశాయి. లోక్సభ ఎన్నికల్లో ఓటర్ల టర్నౌట్ తక్కువగా ఉండడం, క్యూ4 ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడమూ మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీస్తున్నట్టు జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చి హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
ఇండీజీన్ ఇష్యూకి అదిరే డిమాండ్: హెల్త్కేర్ టెక్ కంపెనీ ఇండీజీన్ ఐపీఓ సూపర్ డూపర్ హిట్టయింది. బుధవారం బిడ్డింగ్ ముగిసే సమయానికి 69.71 రెట్లు సబ్స్ర్కైబ్ అయింది. కంపెనీ పబ్లిక్ ఇష్యూ ద్వారా 2,88,66,677 షేర్లను రూ.430-452 ప్రైస్ బ్యాండ్లో షేర్లు జారీ చేయగా, మదుపరుల నుంచి 201.22 కోట్ల షేర్లకు బిడ్స్ వచ్చాయి.
ఆధార్ హౌసింగ్ ఐపీఓ: ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఐపీఓ ప్రారంభమైన తొలి రోజే 43 శాతం సబ్స్ర్కైబ్ అయింది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ 700.80 లక్షల షేర్లు జారీ చేస్తోంది. ఇష్యూ ప్రారంభమైన తొలి రోజే మదుపరుల నుంచి 304.53 లక్షల షేర్లకు బిడ్స్ వచ్చాయి. రూ.300-315 ప్రైస్ బ్యాండ్లో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ ఐపీఓ జారీ చేస్తోంది.