Share News

గౌతమ్‌ అదానీ వార్షిక జీతం రూ.9.26 కోట్లు

ABN , Publish Date - Jun 24 , 2024 | 06:40 AM

అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తర్వాత దేశంలో రెండో అతిపెద్ద సంపన్నుడు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ తాజా ఇండెక్స్‌ ప్రకారం...

గౌతమ్‌ అదానీ వార్షిక జీతం రూ.9.26 కోట్లు

ఏఈఎల్‌ డైరెక్టర్‌ వార్షిక జీతం రూ.89.37 కోట్లు

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తర్వాత దేశంలో రెండో అతిపెద్ద సంపన్నుడు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ తాజా ఇండెక్స్‌ ప్రకారం ఆయన ఆస్తుల విలువ 10,600 కోట్ల డాలర్లు (సుమారు రూ.8.85 లక్షల కోట్లు). అంతర్జాతీయంగా చూస్తే 14వ అతిపెద్ద సంపన్నుడు. అయితే గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో గౌతమ్‌ అదానీ తన గ్రూప్‌లోని కంపెనీల నుంచి తీసుకున్న జీతభత్యాలు మాత్రం రూ.9.26 కోట్లు మాత్రమే. అదే అదానీ గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (ఏఈఎల్‌) డైరెక్టర్‌ వినయ్‌ ప్రకాష్‌ తీసుకున్న జీతభత్యాలు అక్షరాలా రూ.89.37 కోట్లు. కుటుంబాల నిర్వహణలోని ఇతర పారిశ్రామికవేత్తలతో పోల్చినా.. ఒక్క ముకేశ్‌ అంబానీ తప్ప మిగతా అందరూ గత ఆర్థిక సంవత్సరం గౌతమ్‌ అదానీ కంటే భారీగా జీతభత్యాలు తీసుకున్నారు. అంబానీ మాత్రం కొవిడ్‌ టైమ్‌ నుంచి ఆర్‌ఐఎల్‌ నుంచి పైసా కూడా జీతం తీసుకోవడం లేదు.


ఎందుకంటే: గత ఏడాది అదానీ గ్రూప్‌నకు పెద్ద పీడకల. హిండెన్‌బర్గ్‌ రీసెర్చి అనే అమెరికా షార్ట్‌ సెల్లింగ్‌ కంపెనీ రిపోర్ట్‌తో గౌతమ్‌ అదానీ గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ ఒక్కసారిగా 15,000 కోట్ల డాలర్లు తుడిచి పెట్టుకుపోయింది. దాంతో అదానీ తన గ్రూప్‌లోని పది లిస్టెడ్‌ కంపెనీల్లో రెండు కంపెనీలు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌, అదానీ పోర్ట్స్‌ నుంచి మాత్రమే జీతం తీసుకుని, మిగతా ఎనిమిది కంపెనీల నుంచి పైసా కూడా తీసుకోలేదు. ఈ కారణంగానే గత ఆర్థిక సంవత్సరం గౌతమ్‌ అదానీ తీసుకున్న జీతభత్యాలు రూ.9.26 కోట్లకు పరిమితమయ్యాయి.

Updated Date - Jun 24 , 2024 | 06:40 AM