Share News

Earthquake: అటు పాకిస్థాన్, ఇటు ఢిల్లీ.. భూకంపంతో వణికిన ప్రజలు

ABN , Publish Date - Sep 11 , 2024 | 02:53 PM

పాకిస్థాన్‌(Pakistan)తోపాటు, ఉత్తర భారతదేశాన్ని భూకంపం(Earthquake) వణికించింది. ఇవాళ మధ్యాహ్నం 12:58 గంటలకు 5.8 తీవ్రతతో పాక్‌లో భూకంపం సంభవించింది.

Earthquake: అటు పాకిస్థాన్, ఇటు ఢిల్లీ.. భూకంపంతో వణికిన ప్రజలు

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌(Pakistan)తోపాటు, ఉత్తర భారతదేశాన్ని భూకంపం(Earthquake) వణికించింది. ఇవాళ మధ్యాహ్నం 12:58 గంటలకు 5.8 తీవ్రతతో పాక్‌లో భూకంపం సంభవించింది. ఇస్లామాబాద్‌, పెషావర్‌, లాహోర్‌లో ప్రకంపనలు భయకంపితులను చేశాయి.

భూకంప కేంద్రం పాకిస్థాన్‌లోని కరోర్‌‌లాల్‌కు నైరుతి దిశలో 25 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ తెలిపింది. కరోర్ లాల్ టౌన్‌ సమీపంలో ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో ఫలకాల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకంపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ తెలిపింది.


భయంతో పరుగులు..

భూకంపం ప్రభావం ఉత్తర భారతదేశంపైనా పడిందని వివరించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతం, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌, పంజాబ్‌, జమ్మూ కశ్మీర్‌లోనూ భూమి కంపించినట్లు వివరించింది. అయితే భూకంపం కేంద్రం పంజాబ్​లోని అమృత్​సర్​కు పశ్చిమాన 415 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు పేర్కొంది. పాక్‌తో పోలిస్తే తేలికపాటి ప్రకంపనలే రావడంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.

భారత్, పాకిస్థాన్ సహా ఆఫ్ఘనిస్థాన్‌లోనూ భూమి కంపించినట్లు అంతర్జాతీయ కథనాలు వచ్చాయి. భూకంపంతో ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. అధికారులకు సమాచారం చేరవేశారు. కరోర్ లాల్, ఫతేపూర్, లెయ్యా, బస్తీ సర్ఘాని, డేరా ఇస్మాయిల్ ఖాన్, ఖాజియాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఆవాసాలకు బీటలువారినట్లు తెలుస్తోంది.

పోలీసుల సూచనలు..

భూకంపంతో భయాందోళనకు గురైన ప్రజలకు ఢిల్లీ పోలీసులు కీలక సూచనలు చేశారు. 'ఢిల్లీ ప్రజలారా.. మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాం. దయచేసి మీ భవనాల నుంచి సురక్షితమైన ప్రదేశానికి వెళ్లండి. కానీ, భయపడొద్దు. ఎలివేటర్లను ఉపయోగించవద్దు. అత్యవసరమైతే 112కి కాల్ చేయండి' అని పోలీసులు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

For Latest News and National News click here

Updated Date - Sep 11 , 2024 | 04:38 PM