Share News

National : విమానంలో భారీ కుదుపులు

ABN , Publish Date - May 22 , 2024 | 03:55 AM

లండన్‌ నుంచి సింగపూర్‌ వెళ్తున్న సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి తీవ్రమైన కుదుపులు(టర్బులెన్స్‌) రావడంతో ఒక ప్రయాణికుడు మృతి చెందగా... 30 మంది గాయాలపాలయ్యారు.

National : విమానంలో  భారీ కుదుపులు

ఒకరి మృతి, 30 మందికి గాయాలు

లండన్‌ నుంచి వెళ్తున్న సింగపూర్‌

ఎయిర్‌లైన్స్‌లో ఘటన

బ్యాంకాక్‌లో అత్యవసర ల్యాండింగ్‌

సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో భారీ కుదుపులు

ఒకరి మృతి, 30 మందికి గాయాలు

బ్యాంకాక్‌, మే 21 : లండన్‌ నుంచి సింగపూర్‌ వెళ్తున్న సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి తీవ్రమైన కుదుపులు(టర్బులెన్స్‌) రావడంతో ఒక ప్రయాణికుడు మృతి చెందగా... 30 మంది గాయాలపాలయ్యారు. లండన్‌ హీత్రూ విమానాశ్రయం నుంచి సింగపూర్‌ వెళ్తున్నఎస్‌ క్యూ321 విమానం అండమాన్‌ సముద్రంపై 37వేల అడుగుల ఎత్తులో ఉండగా... కేవలం మూడు నిమిషాల్లోనే 31వేల అడుగులకు దిగిపోయింది. దీంతో, విమానాన్ని అత్యవసరంగా బ్యాంకాక్‌లోని సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు.

ఈ బోయింగ్‌ 777-300ఈఆర్‌ విమానంలో 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ముగ్గురు భారతీయులు. మృతి చెందిన 73 ఏళ్ల బ్రిటీషు ప్రయాణికుడి కుటుంబానికి సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సంతాపం తెలియజేసింది. వాతావరణ మార్పులు, రాడార్‌ నుంచి దీనికి సంబంధించి ఎటువంటి సూచనలు లేకపోవడంతో పైలెట్‌ ముందుగా ప్రయాణికులను హెచ్చరించలేకపోయినట్లు నిపుణులు చెబుతున్నారు.

విమానంలో కుదుపుల ఘటనలు సాధారణమే అయినప్పటికీ ప్రయాణికులు మరణించిన ఘటనలు అత్యంత అరుదు. 1997 డిసెంబరులో యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టోక్యో నుంచి హోనొలులుకు వెళుతుండగా కుదుపులు చోటు చేసుకుని ఒక ప్రయాణికుడు మరణించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అమెరికాకు చెందిన ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ సంస్థ ఇటువంటి అనుకోని కుదుపుల నుంచి విమాన ప్రయాణికులు క్షేమంగా ఉండేందుకు అన్ని వేళలా సీటుబెల్ట్‌ ధరించి ఉండాలని సూచిస్తోంది.

Updated Date - May 22 , 2024 | 03:55 AM