Share News

Gaganyaan: ఇస్రో సాధించిన మరో మైలురాయి.. ఆ కీలక పరీక్ష విజయవంతం

ABN , Publish Date - Feb 21 , 2024 | 08:50 PM

చంద్రయాన్-3 (Chandrayaan-3), ఆదిత్య-ఎల్1 (Aditya L1) మిషన్‌ల తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అందుకుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ (Gaganyaan) ప్రాజెక్టులో భాగంగా.. మనుషుల్ని అంతరిక్షంలోకి సురక్షితంగా తీసుకెళ్లే సీఈ20 క్రయోజనిక్ ఇంజిన్‌ని సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన తుది పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది.

Gaganyaan: ఇస్రో సాధించిన మరో మైలురాయి.. ఆ కీలక పరీక్ష విజయవంతం

చంద్రయాన్-3 (Chandrayaan-3), ఆదిత్య-ఎల్1 (Aditya L1) మిషన్‌ల తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అందుకుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ (Gaganyaan) ప్రాజెక్టులో భాగంగా.. మనుషుల్ని అంతరిక్షంలోకి సురక్షితంగా తీసుకెళ్లే సీఈ20 క్రయోజనిక్ ఇంజిన్‌ని సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన తుది పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ఇస్రో తెలిపింది. ఫిబ్రవరి 13న నిర్వహించిన ఈ పరీక్షలో భాగంగా.. లైఫ్ డిమాన్‌స్ట్రేషన్, ఎండ్యూరెన్స్, ఇంధన ట్యాంకు ఒత్తిడి, ఇంజెన్ భద్రత వంటి అంశాలను పరిశీలించారు. ‘‘ఇస్రోకు చెందిన సీఈ20 క్రయోజనిక్‌ ఇంజిన్‌ ఇప్పుడు గగన్‌యాన్‌ మిషన్‌లో మానవ ప్రయాణానికి (హ్యూమన్ రేటెడ్) అనువైనదిగా రుజువైంది. ఇది కఠినమైన పరీక్షల్ని ఎదుర్కుంది’’ అని ఇస్రో ఎక్స్ వేదికగా పేర్కొంది.


పరీక్ష ఎలా నిర్వహించారు?

రాకెట్‌ ఇంజిన్లలో హ్యూమన్‌ రేటింగ్‌ అనేది ఎంతో కీలకమైంది. హ్యూమన్ రేటింగ్ ప్రమాణాల ప్రకారం.. మానవ మిషన్లకు ఇంజన్లు అనువైనవేనా? కాదా? అనే నిర్ధారించే క్రమంలో మొత్తం నాలుగు ఇంజెన్లపై 39 హాట్ ఫైరింగ్ టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టింగ్ దాదాపు 8,810 సెకన్ల పాటు కొనసాగింది. నిజానికి.. అర్హత సాధించేందుకు 6,350 సెకన్లు నిర్వహిస్తే సరిపోతుంది. వివిధ ప్రయోగపరిస్థితుల్లో 8810 సెకెన్ల పాటు ఇంజెన్లు మండించి, వాటి పనితీరును పరిశీలించినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ పరీక్ష మహేంద్రగిరిలో ఉన్న ఇస్రోలోని హైఆల్టిట్యూడ్‌ టెస్ట్ కేంద్రంలో జరిగింది. దీనికితోడు.. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో జరగనున్న మానవ రహిత గగన్‌‌యాన్‌ ప్రాజెక్టుకు అవసరమైన వాటికి యాక్సెప్టెన్సీ టెస్ట్‌లు కూడా పూర్తయ్యాయని ఇస్రో స్పష్టం చేసింది.

గగన్‌యాన్ ప్రాజెక్ట్ ఏంటి?

ముగ్గురు భారత వ్యోమగాముల్ని దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తైన కక్ష్యలోకి పంపేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. అక్కడి నుంచి తిరిగి వాళ్లను భూమిపైకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ప్రయోగం మొత్తం మూడు రోజుల పాటు సాగనుంది. తమ తిరుగు ప్రయాణంలో వ్యోమగాములు సముద్రంపై సురక్షితంగా దిగాల్సి ఉంటుంది. మీడియా కథనాల ప్రకారం.. గగన్‌యాన్ ప్రాజెక్టుకు రూ.9000 కోట్లు ఖర్చవుతుందని తెలుస్తోంది. ఈ మిషన్ విజయవంతమైతే.. అంతరిక్షంలోకి మనుషులను పంపిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది. ఇంతకు ముందు సోవియట్ యూనియన్, అమెరికా, చైనాలు ఈ చారిత్రాత్మక ఫీట్‌ని సాధించాయి.

Updated Date - Feb 21 , 2024 | 08:50 PM